Tuesday 26 February 2013

శ్రీ అమరారామం-అమరావతి పంచారామక్షేత్రం


               Sree AmaraaramamAmaravati Pancharamakshetram
                     
                శ్రీ అమరారామం అమరావతి పంచారామక్షేత్రం.
             
                గుంటూరు జిల్లా లో కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్ధం శ్రీ అమరారామం. దీనినే అమరావతి అని పిలుస్తున్నాం.  అమరలింగేశ్వరుడు కొలువు తీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమిది. పంచారామాలలో మొదటిది గా సేవించబడుతోంది. కలిదోష నివృత్తి కొఱకు శౌనకాది మహామునులకు నారద మహర్షి  భూలోకమునందు గల  పవిత్ర పుణ్య స్థలాలను గూర్చి వివరిస్తూ  ఈ అమరేశ్వరుని  గురించి చెప్పినట్లు  స్కాంద పురాణం లో  కన్పిస్తోంది.
                                          
                                 अमरेश समं तीर्थं न भूतो न भविष्यति !
                                  अमरेशं महादेवं सर्वदेवमयं शुभम्  !!”
    

       
                                  ఆలయ రాజగోపురం

               స్థలపురాణం  ::------.      ఈ అమరారామాన్ని  గురించిన విశేషాలు, స్కాంద పురాణం లో సహ్యాద్రి ఖండం లోను ,బ్రహ్మపురాణం పూర్వ ఖండం లోను. పద్మపురాణం ఉత్తర భాగం లోను ప్రస్తావించబడినట్లు స్థలపురాణం చెపుతోంది.
                     
                 
                              కృష్ణానదిలోని  స్నాన ఘట్టం
                       
                    తారాకాసుర సంహారం పూర్తి చేశాడు కార్తికేయుడు. యుద్ధ సమయం లో తారకుని కంఠమందలి అమృతలింగం కుమారస్వామి శక్తి ఘాతాలకు ఐదు గా విడి పోయి ఆంధ్ర దేశం లో ఐదు ప్రదేశాల్లో పడ్డాయి.వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాము. ఆ పంచారామాల్లో ఒకటైన  ఈ అమరారామం లోని అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడటం వలన ఈ స్వామిని  అమరేశ్వరుడని, ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి యని పిలుస్తున్నారు.  దీనిని దక్షిణ కాశి  యని  కూడ అంటారు..  దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం  ఇంద్రుడు  ఆశ్వయుజ శుద్ధదశమి నాడు  సమస్త దేవతా గణము జయజయధ్వానము లు చేయుచూ వెంటరాగా,    తారకాసురుని గళమందలి అమృత లింగము నుండి చెదిరిన ఒక శకలమును ఈ క్రౌంచగిరి పై ప్రతిష్ఠించినాడు .
                   
               
                                               అమరలింగేశ్వరుని దివ్యరూపం
                            
                   శుద్ధ ధవళ కాంతులతో  ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైపైకి పెరిగి పోవటం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి, వివిధ దేవతాకుసుమములతోను,  బిల్వ పత్రములతోను పూజించినను స్వామి పెరుగుదల ఆగక పోవటంచేత  లింగాగ్రముపై  సీల కొట్టి, కృష్ణవేణీ జలం తో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట.   ఇప్పటికీ లింగాగ్రంలో  తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కన్పిస్తాయని భక్తులు చెప్పుకుంటుంటారు. తారకాసురుని మరణానంతరం ఇంద్రుడు స్వామి ని  ప్రతిష్ఠించిన తర్వాతే   మహేంద్ర పదవిని మరల పొందాడు.  ఆ ఇంద్రుని చే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడిగా ఆరాథించబడుతున్నాడు.
                               
            
                    
                                            ఆలయప్రవేశ ప్రధాన ద్వారం
                  
                     ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బృహస్పతి చెంతకు వచ్చాడు.  కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగి పోయే ప్రమాదం ఉంది గదా! అటువంటి ప్రదేశం లో స్వామిని ఎలా ప్రతిష్ఠ చేయించారనే సందేహాన్ని వెలిబుచ్చాడు బృహస్పతి తో శుక్రాచార్యుడు. అందుకు ఆత్మలింగం పడినచోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపై నున్న ఆమహాలింగం పెరగటం వల్ల, ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పు ఏమీలేదు.కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి  ప్రక్కకు తిరిగింది కదా.  ఉత్తర దక్షిణాలు గా నది ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా!” అన్నారట బృహస్పతి. ఆ యనంతరం దేవ గురువుల సూచనల మేరకు   అమరేశ్వరుని చుట్టుఅంబిక మొదలైన శివపరివారమంతా  కొలువు తీరింది .
            

                         ఆలయప్రాకారం మీద కుడ్యశిల్పం
             
                   లింగదర్శనం.::----               అమరేశ్వరుని  రూపం  పది అడుగుల ఎత్తు కలిగి, మూడు అడుగులకైవారం తో, శుద్ధ ధవళ వర్ణం తో మెరిసి పోతూ ఉంటుంది. పానమట్టం మీద స్వామి పదిహేను అడుగుల ఎత్తులో కన్పిస్తారు. అభిషేకం చేయడానికి  ప్రత్యేకమైన  ఏర్పాటు చేయబడింది. స్వామి  మాటి మాటికీ పెరుగుతూ ఉంటే ఆలయనిర్మాణం  మాటి మాటికీ మార్చవలసి వస్తోందని, స్వామి వారి పెరుగుదలను సీల కొట్టడం ధ్వారా నియంత్రించారనే మాట స్వామి రూపాన్ని ఛూస్తే వెంటనే స్మరణకు వస్తుంది.
   
                    ఉత్సవ సమయాల్లో అమరలింగేశ్వరుని దివ్యమంగళ విగ్రహం
          
             క్షేత్రమహిమ :---                  ఈ స్వామి పంచలింగాకారాలతో పంచాక్షరీ మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటారని ప్రతీతి. ప్రణవేశ్వరుని గా, అగస్త్యేశ్వరుని గా, కోసలేశ్వరుని గా ,   సోమేశ్వరుని గా, పార్ధివేశ్వరుని గా  దర్శనమిచ్చే ఈ క్షేత్రం లో  అయిదు రోజులు నివసించి,  కృష్ణానది లో స్నానం చేస్తూ, పంచాక్షరిని జపిస్తూ, స్వామిని ఆరాథిస్తే కైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతున్నారు. 
                              
                             स्नानमात्रेण तत्तोये गो सहस्रफलं लभेत् !
                              सुरेश्वरं सकृद्दष्ठा पुनर्जन्म नविद्यते  !!”
    
                 అని  శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ క్రౌంచ పర్వతం మీద  గతం లో దేవతలు, కపిలుడు మొదలైన మహామునులు  తపస్సు చేసి కృతార్థులగుట వలన దీన్ని  సిద్థి క్షేత్రం గా కూడ పిలుస్తారు.   పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆర్ధ్ర నక్షత్రము, ఆది వారము, సంక్రాంతి, సూర్య, చంద్రగ్రహణ కాలాల్లోను, సప్తమీ సోమవారం ,దక్షిణోత్తరాయణములందు ఈ అమరావతీ తీర్ధమందు స్నానం చేసి, అమరేశ్వరుని సేవించిన  యెడల వారికి  సహస్ర యజ్ఞఫలము  లభిస్తుందని చెప్పబడుతోంది.
           
                               అమ్మవారు బాల చాముండేశ్వరీ దేవి

                  ఆలయదర్శనం :::---         కృష్ణా నదీ తీరాన వెలసిన అతి ప్రాచీన ఆలయం అమరావతి.  మహోన్నత గోపురాలతో విరాజిల్లే  పౌరాణిక పుణ్యస్థలం అమరావతి. మూడు ప్రాకారాలతో విలసిల్లు తున్న అమరేశ్వరుని మందిరం ఇది. మొదటిప్రాకారం లో ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే  వరుసగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీవిశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయస్వామి, రుద్రపాదాలు, జ్వాలముఖీ దేవి, అగస్త్యేశ్వర స్వామి, ఫార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసురమర్థని, కోసలేశ్వరుడు, వీరభద్రుడు  దర్శనమిస్తారు. రెండవ ప్రాకారం లో నైరుతిన కాలభైరవుడు, తూర్పు దిక్కున ధ్వజస్థంభం, దాని సమీపం లోనే సూర్యభగవానుడు ప్రతిష్ఠంచబడటం తో ఇది పంచాయతన క్షేత్రం గా కొనియాడబడుతోంది.
                  
              
                  
                              ఉత్సవ సమయాల్లో  అమ్మవారి దివ్యరూపం
                   
                    మూడవ ప్రాకారం లో ప్రదక్షిణ మార్గంలో  బయలుదేరితే, ముందుగా  నైరుతీ దిశ లో శ్రీశైల మల్లేశ్వరుడు, వాయవ్యం లో కాశీవిశ్వేశ్వరుడు, ఈశాన్యం లో చండీశ్వరుడు, ఆ గ్నేయం లో శ్రీ కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భగుడి లో 10 అడుగుల ఎత్తులో ధగధ్ధగాయమానంగా ధవళ కాంతి తో అమరేశ్వరుడు ప్రత్యక్షమౌతాడు.  ముఖమండపం లో స్వామి కి ఎడమవైపు ఉపాలయం లో బాల చాముండేశ్వరీ దేవి దివ్యరూపం  దర్శనమిస్తుంది.  ఈ ఆలయం లో నాలుగు దిక్కుల నాలుగు ధ్వజస్థంభాలుండటం ప్రత్యేకత.  ముఖమండపం లో నందీశ్వరుని చెంతనే  ఈ ఆలయ అభివృద్ధి కి  అహరహము కృషిచేసిన  వదాన్యులు  శ్రీ రాజా వాసిరెడ్డి  వేంకటాద్రి నాయుడు   ముకుళిత హస్తాలతో స్వామి వారికి నమస్కరిస్తున్న లోహ విగ్రహం   మనకు దర్శనమౌతుంది. ముఖమండపం నుండి   స్వామి వారికి ఎడమవైపు కు తిరిగితే  శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం లోకి వెళతాము. ఈ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు. శివకేశవాభేదానికి ఇది ఒక తార్కాణం గా చెప్పవచ్చు.
       
                       
                   రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు లోహ విగ్రహం
                 
                చారిత్రక నేపథ్యం. :-----                                                అమరావతి, 
ధరణి కోట అనే వేరు వేరు పేర్ల తో పిలువ బడే ఈ ప్రాంతం చరిత్రలో  ధాన్యకటకం గా ఫ్రసిద్ధి కెక్కింది. క్రీ.శ  8 వ శతాబ్దం నాటికే  అమరావతీ బౌద్ధస్ధూపం నిర్మించబడింది. శాతవాహనుల కాలం లో   దక్షిణాపథం గా పిలువబడిన ఈ ప్రాంతానికి ధాన్యకటకం రాజధానిగా ఉండేది. అశోకుని సార్వభౌమత్వాన్ని అంగీకరించిన శాతవాహనులు బౌద్ధమతాన్ని  ప్రచారం చేశారు.కొండవీటి రెడ్డిరాజుల కాలం లో ఈ ఆలయం పునరుద్ధరించబడినట్టలు తెలుస్తోంది.క్రీ.శ. 1158 లోని  కొమ్మనాయని శాసనం,కోటరాజుల శాసనాలు లభిస్తున్నాయి. అనవేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి అమరేశ్వరాలయం మీద  పంచసువర్ణ కలశాలను ఎత్తించిన శాసనం  వేంకటాద్రి నాయుడు  మండపం లో కన్పిస్తుంది.అలాగే క్రీ.శ 1517 లోని శ్రీకృష్ణ దేవరాయల  దాన శాసనం ఒకటి ఉంది. ముఖమండపం లో కోట కేతరాజు మంత్రి ప్రోలినాయుడు భార్య  స్వామి వారికి అఖండదీపారాథనకు చేసిన శాసనం కన్పిస్తుంది.
             
                        
                                          ముఖమండపం లోని శాసన స్ధంభాలు
            
                    శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చటకు వచ్చి .  స్వామి కి తులాభారమిచ్చినట్లు తులాభారమండపం సాక్ష్యంగా నిలుస్తోంది. అనంతరం క్రీ.శ 1626 ల పెద్ద అప్పము గారు ఆలయాన్ని పునరుద్ధరించారు. అమరావతీ ఆలయ కుడ్యాల మీద నున్న ఎన్నో  శాసనాలు చరిత్ర పరిశోధకు లకు ఎంతో  విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
                         
                                                         బుద్ధ ప్రతిమ కలిగిన ఆలయస్థంభాలు
                    
                    రాజా వాసిరెడ్డి  వెంకటాద్రి నాయుడు చెంచులను తుదముట్టించిన తరువాత అమరేశ్వరుని ఆజ్ఞ మేరకు తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతి కి  మార్చారు. అమరేశ్వరుని ఆలయ సమీపం లో క్రీ.శ.1795 ధరణికోట ను నిర్మించి తన రాజధాని గా చేసుకొని, స్వామి వారిని సేవించి తరించాడు. శ్రీ కృష్ణ దేవరాయలు వలెనే  స్వామి కి తులాభారాన్ని సమర్పించి, తులాభార మండపాన్ని నిర్మించాడు.   ఆలయ ప్రాకార మండప గోపురాలను నిర్మించి,స్వామిసేవలో తరించాడు. స్వామి పూజాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నవబ్రహ్మల్లాంటి అర్చకులను ఏర్పాటు చేసి, 300 సంవత్సరాలక్రిందటే ఒక్కొక్కరికి 12 ఎకరాల భూమిని దానం  చేసిన వదాన్యుడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు. రాజా వేంకటాద్రి నాయుడు ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయించేటప్పుడు బౌద్దారామ శిథిలాలు కొన్నింటిని కూడ ఆలయ నిర్మాణం లో వాడారనే అపప్రథ  నిజమేనేమో అన్నట్లు దేవాలయ స్థంభాలమీద అక్కడక్కడ బుద్ధ ప్రతిమలు దర్శనమిస్తాయి.

                                             గర్బాలయగోడల మీది కుడ్యచిత్రాలు
               
                       రవాణా వసతి సౌకర్యాలు   :----            గుంటూరు నుండి 35 కి.మీ, విజయవాడ నుండి 30 కి.మీ  దూరం లోను అమరావతి ఉంది.  ఆర్టీసి సర్వీసులు బహుళంగానే ఉంటాయి.  దేవాలయానికి దగ్గరగా వసతి సౌకర్యాలు లభిస్తాయి. కాఫీ ,టిఫిన్ భోజనవసతులు, హోటళ్లు ఉన్నాయి.
  


           
                      విద్యుత్కాంతిలో ఆలయప్రవేశ మార్గం           

               విశేష ఉత్సవాలు ::------      శ్రీ అమరేశ్వరస్వామి కి    మాఘ బహుళ దశమి తో ప్రారంభమయ్యే మహాశివరాత్రి  ఉత్సవాలు , అమావాస్య నాడు  జరిగే రథోత్సవాన్ని చూడటానికి భక్తులు వేలాది గా తరలి వస్తారు.  కార్తీకమాసోత్సవాలు  కన్నుల పండువుగా జరుగుతాయి.





                                                                    శ్రీ స్వామి వారి రథం

*********************************************************************************

No comments:

Post a Comment