Thursday 14 February 2013

మేళ్ళ చెరువు -స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి


                మేళ్ళ చెరువుస్వయంభూ శంభు లింగేశ్వర స్వామి
                    
                       
             మేళ్ళ చెరువు నల్గొండ జిల్లా హుజూర్ నగర్  కు 10 కి. మీ దూరం లో ఉన్న ప్రాచీన గ్రామము.  ఇక్కడ వెలసిన స్వయంభూ లింగము ఇష్ట కామేశ్వరీ సమేత స్వయంభూ శంభులింగేశ్వరుడు గా పూజలందుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రాంతం చేసుకున్న పుణ్యం ఒక్కొక్కరూపం గా ప్రతిఫలిస్తూ ఉంటుంది కదా !
                      ఈ స్వామి శిరస్సు పై కుడివైపున మూడు అంగుళాల వ్యాసార్ధం గల చిన్న బిలం ఉంటుంది. దానిలో నుండి అన్ని కాలాలల్లోను చల్లని నీరు ఊరుతూనే ఉంటుంది. నీరు పొర్లటం ఉండదు. నీరు తీస్తుంటే వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న అయ్యవార్లు ప్లాస్టిక్ గ్లాసు తో ముంచి అరలీటరు సీసా పోసుకెళ్లడం  మేము ప్రత్యక్షం గా చూశాము. ఇది స్వామి  వారి ప్రత్యేకత.


                            ఆలయ శిఖర దర్శనం

             ఆలయ ప్రత్యేకత ;;;----                మేళ్ళ చెరువు  ఒక దివ్య క్షేత్రం. ఇచ్చట వెలసిన  శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరుడు అపో లింగము.( గంగ శిరమున కలిగిన లింగము.) పంచ భూత గుణములతో వెలసిన లింగములను పంచభూతేశ్వర లింగములందురు.  తమిళ నాడు లోని జంబుకేశ్వరుని ఆపోలింగం  గా కీర్తిస్తారు.  పంచభూతములనగా భూమి,నీరు ,అగ్ని,నీరు ఆకాశము, శంభులింగేశ్వర లింగము అపోలింగము. అనగా స్వామి వారి శిరసుపై గంగధార కలదు. ఈ లింగము స్వయంభువు . అనగా తనకు తానుగ భూమినుండి వెలుపలకు వచ్చి ప్రకటితమైన లింగము.


                               ఆలయ ధ్వజస్థంభం
     
                     లింగ దర్శనము. ::           ఈ లింగము స్థూపాకారము గా నున్నది.1.83 మీటర్లు  ఎత్తు కలిగి,0.34 మీటర్లు  కైవారము కలిగియుండును. శ్రీ స్వామి వారు పన్నేండు సంవత్సరముల కొక అంగుళము పెరుగు చున్నారట. 144 సంవత్సరాలకు ఒక అడుగు పెరుగతాడన్నమాట. అందు కు తార్కాణం గా లింగము  చుట్టు  ప్రతి అడుక్కి ఒక గుండ్ర పు చార ను మనం చూడవచ్చు. 
                
                                     పెరుగు తున్న శ్రీ స్వామి  రూపం
                  
                         లింగానికి పానుమట్టాన్ని పైనుంచి తొడిగారు. పెరుగు తున్న లింగ భాగాన్ని క్రిందివైపున ఉంచి, పానుమట్టాన్ని తొడిగి, దీనిక రాతి పలకలను పూటీగా పెట్టారు.   దీన్ని అర్ధ నారీశ్వర లింగం గా భక్తులు కొలుస్తారు. ఎందుకంటే లింగం రెండు భాగాలుగా ఉంటుంది, స్వామి వారికి వెనుక వైపు మూడుపాయలు గా జడ ఉంటుంది. గంగ ఉన్న వెనుక భాగం లోనే ఉంటుంది. అందుకే అభిషేకానంతరం చేసే విభూతిచర్చ, చందన చర్చలను వెనుక భాగానికి తగలకుండా జాగ్రత్త పడటం అభి షేక సమయం లో మనం  గమనించవచ్చు.   
                 
                                          విశేష అలంకారం లో శ్రీ స్వామి వారు         
            

                  ప్రతి రోజు అభిషేకానంతంరం  విశేషాలంకరణ ఛేస్తారు.  లింగం పై అడుగు అడుగు కి కుంకుమ బొట్టును అందం గా దిద్దుతారు. లింగం క్రింది భాగాన చిన్నబొట్టు తో ప్రారంభించి.   పైకి వెళ్లే కొద్ది సైజు పెరుగుతూ. చివరి బొట్టు పెద్దది గా  పెడతారు. అంటే స్వామి వారు పెరుగుతున్నారని చెప్పడానికి  అది సంకేంతం కావచ్చు. ఐదు కుంకుమ చుక్కలు  స్వామి వారిపై మనకు కన్పిస్తాయి.  అలంకారం చాల నిష్ట తో , ఓర్పు తో చేస్తారు అయ్యవారు. 
   
                                                              నందీశ్వరుడు               
          స్వామి వారి కి ఎడమవైపు ఉపాలయం లో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి కొలువు తీరి ఉంటుంది.
               
                    
                                                                 అమ్మవారి ఆలయ  శిఖరం
             

              స్థలపురాణం ::::          ఈ దివ్యక్షేత్రమున వెలసిన స్వయంభువు త్రేతా, ద్వాపర యుగములనాటి వాడుగా చెప్పబడుతున్నాడు.  ఇప్పటికీ అరణ్య మయం గా కన్పించే ఈ భూమి కొన్ని వేలయేండ్ల నాడు భయంకరార ణ్యమై ఉండవచ్చును.పూర్వమున ఈ ప్రాంతమంతయు మేడి చెట్లమయము గా నుండి   మేడి చెరువుగా పిలువబడి యుండును. మేడికి బహువచనము మేళ్లు కావున  కాలక్రమంగా మేళ్ల చెరువుగా ప్రసిద్దమైంది.
        
       

   
                                                         ఆలయ ఆవరణ లోని శాసనము                              

                     ఈ గ్రామము నిర్మాణము జరగక పూర్వము ఇక్కడ గొల్లగుంట అనే చిన్నపల్లె ఉండేది. వారు పశువుల కాపరులు గనుక వారు పశువులను మేపుకొంటూ, ఈ పరిసరారణ్యం లో  నివసించే వారు. వారు ఆ అడవిలోనే  పశువుల కొరకు ఒక కొట్టమును నిర్మించుకొనిరి. ఆ సమీపములోనే స్వామి ఆవిర్భవించిన సంగతి వారి కి తెలియదు. వీరి ఆవుల మందలోని  పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఒక గోమాత   ప్రతి రోజు  వెళ్లి   స్వామి   వారు ఆవిర్భవించిన  ప్రదేశములో తన పాలతో అభిషేకము  చేస్తూ ఉండేది.. మొదట పశువుల   కాపరులు ఈ దృశ్యాన్ని చూచి భయపడ్డారు. అనంతరము  గొల్ల పెద్దకు ఈవిషయాన్ని   చెప్పారు. కాని ఆ రాత్రే స్వామి గంగబోయిన మంగన్న,బోయన్నలకు స్వప్నం లో సాక్షాత్కరించి, తాను సదాశివుడనని,తానిక్కడ వెలసియుంటినని. ఈ దక్షణ కాశి   గా ప్రసిద్ది పొందునని, తనకిక్క్డడ ధేళము నిర్మింపుడని ఆదేశించెనట. వారు మహదానంద భరితులై,  వారి తాహతు కు తగినట్లు గా ఆలయ మును నిర్మించి పూజించ  సాగారు.

                
                                   ఆలయప్రాగణం లోని నాగశిల్పాలు   
              
                కాకతీయుల కాలం నాటికే ఈ  ఆలయం ఉచ్ఛ స్థితి లో ఉంది. ప్రతాపరుద్రుని కాలం లో నాగిరెడ్డి,చల్లయ్య రెడ్డి అను  వారు ఈ దేవాలయానికి కొంత భూమిని దానమిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

        ప్రత్యేక ఉత్సవాలు ..             మహా శివరాత్రి ఈ ఆలయం లో గొప్ప ఉత్సవం.  ఆ  రోజు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువు గా జరుగు తుంది. చుట్టుప్రక్కల  జిల్లాలనుంచి కూడ వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి  రావడం ఒక ప్రత్యేకత. కార్తీక మాసం లో దీపోత్సవం కూడ చాల   వైభవం గా నిర్వహిస్తారు.
  
              
                          శ్రీ స్వామి వారి ఉత్సవ అలంకారం

         రవాణాసౌకర్యాలు  . ::::               ఈ క్షేత్రము నల్గొండ జిల్లా కోదాడ నుండి 24 కి.మీ దూరం లోను. హుజూరు నగర్ నుండి 10 కి. మీ దూరం లోను, ఖమ్మం నుండి  68 కిమీ దూరం లోను  ఉంది.  విజయవాడ,హైద్రాబాదు జాతీయ రహదారి లో కోదాడ ఉంది.
     
            
                                                                    ఆలయ దృశ్యం
    
                  ఆలయవేళలు. :::::          ఆలయం        ఉదయం  7 గం. నుండి 12.30 వరకు, సాయంత్రం  5 గం.నుండి 7 గం . వరకు దర్శనం లభిస్తుంది 



*********************************************************************************

No comments:

Post a Comment