Saturday 16 February 2013

మట్టపల్లి -శ్రీలక్ష్మీనరసింహస్వామి

                                  MATTAPALLI- SREE LAKHMI NARASIMHA SWAMY
                          
                                           मट्टपल्लि श्रीलक्ष्मीनरसिंहस्वामि.
                                           మట్టపల్లి  -  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.

                    
                      
                ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన నరసింహక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాని లో   సుప్రసిద్ధాలు పంచ నారసింహ క్షేత్రాలు . పంచనారసింహ క్షేత్రాల్లో ఇప్పుడు మనం మూడోదాన్ని చూడబోతున్నాం. ఈ పంచ నరసింహులకు జనులు పెట్టుకున్న ముద్దుపేర్లు ముందుగా  చెపుతాను చూడండి.
            
                  
                                             మట్టపల్లి శ్రీస్వామి వారి ఆలయ రాజగోపురం 

                        కృష్ణా నదీగర్భం లో వెలసిన  వేదాద్రి యందు వెలసిన  యోగానంద స్వామి. ఇచ్చట నున్న  స్వామి, ఉత్తర వాహిని యైన కృష్ణానది లో స్నానం చేసి  తనను దర్శిస్తే చాలు  పుల కించి పో తాడట. అందుకే  వేదాద్రి స్వామిని స్నానాలయ్య అని పిలుచు కుంటారట భక్తులు. గుంటూరు జిల్లా మంగళగిరి లో వెలసిన నృసింహస్వామి. పానకం సమర్పించే వారంటే సంతోషిస్తాడు. సగం పానకం  తీసుకొని మిగిలింది మనకే ఇచ్చేస్తాడు.అందుకే ఆ స్వామి పానకాలయ్య. ఆ జిల్లాలోనే కేతవరం లో వెలసిన స్వామి వజ్రాలయ్య. ఈ స్వామి ని త్రికరణ శుద్ధి  గా నమ్మి,కొలిస్తే వజ్రాలు లభిస్తాయి. ఈ దగ్గర లోని కోళ్ళూరు లోనే కోహినూర్ వజ్రం దొరికిందని చెపుతారు. వాడపల్లి లోని దీపాలయ్య ను చూసేశాం కదా.  ఇప్పుడు మట్టపల్లి లోని అన్నాలయ్య ను చూద్దాం పదండి. ఈ రెండు క్షేత్రాలు నల్గొండ జిల్లాలోనివే.
               
           
                                              ఆలయ ప్రవేశ ద్వారం
        
                 నల్గొండ  జిల్లా హుజూర్నగర్ కు 35 కి.మీ  దూరం లో కృష్ణా తీరం లో  శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువు తీరిన దివ్యక్షేత్రం మట్టపల్లి.
          
                            ఆలయ ధ్వజస్థంభం, శిఖరం
        
            స్థల పురాణం.::-----              పూర్వకాలమున ఈ ప్రాంతం లో  ఇచ్చటి గుహలో నరసింహుని గురించి జపిస్తూ చాలకాలం తపస్సు చేశాడు.  స్వామి ప్రత్యక్షమై  భరద్వాజుని అనుగ్రహించాడు.
            ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్
             నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.!!
                      సహస్ర శేష ఫణులతో, ధక్షిణావర్త శంఖం తో, నవసాలగ్రామాలతో, కరాళ నఖ దంష్ట్రికల తో, శంఖ చక్రగదాయుధాలతో అభయ ముద్రతో,చిరునవ్వులు చిందిస్తూ   స్వామి  ప్రత్యక్షమయ్యాడు. ఈ స్వామి స్వయంభువు .ఆ కాలంలో భరద్వాజాది మహర్షు లెందరో ఈ స్వామిని సేవించి తరించారు.  
            
            
                    
                                      గర్భాలయం లో స్వామి వారి దివ్యమంగళ రూపం
                              
                   అనంతర కాలం లో సుమారు వేయి సంవత్సరాల క్రితం కృష్ణానదీ తీరం లో మట్టపల్లి కి ఆవలి ఒడ్డున గల తంగెడ జనపదమును పాలిస్తున్న తన భక్తుడైన అనుముల మాచిరెడ్డి ప్రభువునకు స్వామి స్వప్న గోచరుడై, వత్సా సమీప కృష్ణానదీ తీరం  లో ఒకానొక గుహాగర్భం లో నా స్వయంవ్యక్త మూర్తి మునిసుర బృంద సమర్చన లందుకుంటూ  గుప్తం గా ఉంది. కలియుగం లో భక్తజన సంతరణకు నాదివ్యమూర్తి సుప్రకటితం కావలసి యున్నది.కావున ఉదయమే నీవు వెళ్ళి గుహాగర్భంలో ఉన్న నా రూపాన్ని  లోకానికి సువ్యక్త పరచి ధన్యుడవు కమ్ము అని ఆజ్ఞాపించాడు. ఆ అదృష్టశాలి మహానందభరితుడై లేచి,  వేదపండితులను రావించి వారితో తన స్వప్నవృత్తాంతము ను  వివరించినాడు. అతడు చెపితే విన్నవారై, వారు స్వామి ఆజ్ఞను శిరసావహించ వలసిందని మాచిరెడ్డి కి ఉద్బోధించారు. అనంతరం  మాచిరెడ్డి విప్ర,పుర, పరి జన సమేతుడై, స్వామి ఆదేశానుసారం మట్టపల్లి వనానికి చేరి గుహలన్నీఅన్వేషించాడు.  కాని స్వామి కన్పించలేదు. చివరకు అలసి,సొలసి అందరు చెట్ల క్రింద సొమ్మగిల్లారు. ఇంతలో  మాచిరెడ్డికి  మరలా కలలో స్వామి కన్పించి భక్తా! విచారించకు. చూడు. ఇక్కడే ఒక ఆరె చెట్టు. దానిపై  ఒక గరుడపక్షి కనబడుతుంది. ఆ చెట్టుకు సూటి గా పొదల చాటున గుహ ఉంది.  చూడ మని,అక్కడే నేనున్నానని  చెప్పాడు.తుదకు అన్వేషణ ఫలించింది.
                
                                                     శ్రీలక్ష్మీ నరసింహస్వామి
                              
                        అక్కడ  గుహాంతర్భాగంలో శ్రీ లక్ష్మీనృసింహుని దివ్య మంగళ రూపాన్ని దర్శించి,  సేవించి , అనంతర కాలం లో ఆలయ నిర్మాణాదులు చేసి , స్వామి సేవలో తరించాడు మాచిరెడ్డి.
      
              
                                శ్రీ గోదాదేవి సన్నిథి
                 
                    ఆలయ దర్శనం ::-------                      మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ గాలి గోపురం తూర్పు ముఖం గా ఉంటుంది .ఆలయం లో స్వామి పడమర ముఖం గా ఉంటారు.  స్వామి గుహాంతర్భాగం లో ఉండటం వలన  ఒక చిన్న గుహ లోకి వెళ్లి  స్వామిని దర్శించుకోవాలి. స్వామి స్వయంవ్యక్తం.   శంఖ,చక్ర గదాభయ హస్తాలతో  కరాళ దంష్ట్రికలతో, వక్షస్థల కౌస్తుభం తో,చిద్విలాసుడై కొండలోనుండి వ్యక్త రూపుడై దర్శనమిస్తాడు. ప్రక్కనే రాజ్యలక్ష్మీ దేవి కొలువు తీరి ఉంటుంది.
                  
                                        శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం
            
             ముఖమండపం నుండి ఒక చిన్న ద్వారం ద్వారా సరాసరి గర్భాలయం లోని స్వామి చెంత కే  భక్తులు చేరుకోవచ్చు.  ఆలయం ఉత్తర,దక్షిణాలు గా వ్యాపించి ఉంటుంది. తూర్పు వైపు కొండ, పడమర వైపు కృష్ణానది ఉంటాయి. శ్రీ స్వామిని దర్శించుకొని, దక్షిణ ద్వారం గుండా వెలుపలి కి రాగానే  గోదాదేవి సన్నిధి,   దర్శన మిస్తాయి. అనంతరము విఖనసాచార్య సన్నిధి, అద్దాలమందిరం, యజ్ఞశాలను చూసుకొని ఆలయప్రాగణం లోకి వస్తాము.  ధ్వజ స్థంభం వద్ద నాగశిలలు దర్శనమిస్తాయి.
           
                                         ఆలయ ప్రవేశానికి ఉన్న  చిన్న ద్వారం

                         స్వామివారి గర్భాలయం  కొండ కావున ఆలయం చుట్టు  ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గాన్నివేరుగా నిర్మించారు. ఇది స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న మెట్ల ద్వారా ప్రారంభమై స్వామి వెనుక నుండి కొండ చుట్టు తిరిగి స్వామి ముందుకు వస్తుంది. స్వామి ఆలయానికి ఉత్తరం గా కృష్ణానది లోకి స్నానఘట్టాలు ఉన్నాయి. ఫ్రహ్లాద,మార్కండేయ,బాలాజీ పేర్లతో ఈ స్నానఘట్టాలను పిలుస్తారు.



                                             ఒకనాడు వరదనీటిలో మట్టపల్లి ఆలయం

                       మెట్లపూజ చేయడం ఇక్కడ భక్తులకు సంప్రదాయం. కృష్ణానదికి వరద వస్తే స్వామి ఆలయం మునిగి పోయిన రోజులున్నాయి.  దాని నివారణ కై  ఇప్పుడు కరకట్ట పనులకు అనుమతి లభించిందని తెలుస్తోంది.
            
              32 ప్రదక్షిణాలు. ::  -------    శ్రీ స్వామి వారికి 32 ప్రదక్షిణలు చేయడం  ఇక్కడొక  ఆచారం . మట్టపల్లి లో 11 రోజులు ఉండి, రోజూ మూడు పూటలా  కృష్ణానది లో స్నానం చేస్తూ,32 ప్రదక్షిణలు చేస్తూ, మట్టపల్లి మంగళాష్టకాన్ని త్రిసంధ్యలలోను 11సార్లు పఠిస్తే భక్తులకు ఎటువంటి కోరిలున్నా తీర తాయని, ఎటువంటి మానసిక,శారీరక రుగ్మతలున్నానశిస్తాయని  భక్తుల ప్రగాఢ విశ్వాసం.  అలాగే శ్రీ మట్టపల్లి నాథం ప్రణతోస్మి నిత్యం నమ: అనే మంత్రాన్ని 32 వేల సార్లు వ్రాస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయట. ఎటువంటిరుగ్మతలైనా మాయమవుతాయట. అంతేకాదు స్వామి వారికి కట్టే ముడుపు కూడ 32 రూపాయలే కట్టి హుండీలో వేయడం కూడ ఇక్కడ సంప్రదాయం.
   

              శ్రీమాన్ ముక్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహాచార్య స్వామి  ::-------        107  శ్రీ మహా నార సింహ మహామంత్ర జపహోమతత్పరులైన      శ్రీమాన్ ముక్కూర్  శ్రీలక్ష్మీనరసింహాచార్య స్వామి  ఈ క్షేత్రం లో3 సార్లు జపహోమాలను నిర్వహించి, స్వామి దర్శన భాగ్యాన్ని పొంది ,స్వామి తనతో చెప్పిన విషయాలన్నింటినీ తమిళం లో వివరించడం మూలంగా తమిళనాడు లోకూడ ఈ క్షేత్రం ప్రాచుర్యాన్ని పొందింది. ప్రతిసంవత్సరం అక్కడనుండి కూడ భక్తులు వందలాది గా తరలి వచ్చి స్వామిని సేవించుకుంటున్నారు .చెన్నై టి.నగర్ లో శ్రీ స్వాతి నరసింహ మహాయజ్ఞ ట్రస్టు తమిళులకు అందుబాటు లో ఉంది. మట్టపల్లి  లో  శ్రీ ముక్కూర్    నృహరి      నివాసమ్ “     (శ్రీ యజ్ఞ వాటిక)  భక్తులకు సేవలందిస్తున్నారు.


              శ్రీ  ఆంజనేయుడు. ::------      శ్రీ స్వామి వారికి ఎదురుగా ఉన్నముఖమండపం  లోని ఉపాలయం లో గరుడాళ్వారు తో  పాటు  ఆంజనేయుడు కూడ మనకు దర్శనమిస్తాడు. ఈయనను గురించి ఒక ఐతిహ్యం ఇక్కడ ప్రచారం లో ఉంది. 
                    
                                                     ఆలయ ముఖమండపం

             కొంతకాలం క్రితం అర్చక స్వాములు తీర్థపుబిందె తేవడానికి ప్రాత: కాలం లో కృష్ణానది కి వెళ్లారు. అక్కడ ఎక్కడనుంచో కొట్టుకొచ్చిన ఒక ఆంజనేయ విగ్రహం కన్పించింది. దాన్ని పట్టించుకొచ్చి, ఆలయం ప్రాంగణం లో ఒక మూల ఉంచారు. కాలం గడుస్తోంది. రకరకాల మానసిక , శారీరక రుగ్మతలతో  బాధపడుతూ ,శ్రీ నరసింహుని చెంతకు చేరుతారు భక్తులు. ఆ వచ్చిన వారు కృష్ణానది లో స్నానం చేసి, పొర్లు దండాలుపెడుతూ స్వామి సన్నిథిలోనే పగలు,రాత్రి ఉండిపోయేవారు. అలా వచ్చిన భక్తులను ఈ మూలన ఉంచిన ఆంజనేయుడు  విజృభించి పిడిగుద్దులతో  వాళ్లను హింసించేవాడట. అసలే రకరకాల మానసిక  వేదనలతోవచ్చిన భక్తులు ఆ బాధలకన్నా మన ఆంజనేయుని పిడిగుద్దుల బాధలు ఎక్కువై, తాళలేక  పొయి  శ్రీ నరసింహుని తో మొర పెట్టు కున్నారట. అది విన్న స్వామి, ఆంజనేయుని తెచ్చి తన ముందు ప్రతిష్ఠించమన్నారట. అంతే. స్వామి ముందు ఫ్రతిష్ఠించ బడిన అంజనీపుత్రుడు  దాసాంజనేయుడై బుద్దిగా ఉండిపోయాడట,ఇప్పటికి కూడ మనం చూస్తే ఆంజనేయుని దృష్టి నరసింహుని పాదాలపై ఉండటాన్ని  గమనించవచ్చు. ఈయన కోసం స్వామి వారి బంటు గరుత్మంతుడు ఉపాలయం లో  కొంచెంపక్కకు జరిగి  ఈయనకు చోటిచ్చినట్టు  కన్పిస్తుంది.
         
                                    ధ్వజస్థంభం వద్ద నున్న నాగదేవతలు
         
                   అన్నాలయ్య  ::--         శ్రీ  స్వామి వారి ఆలయం లో దక్షిణావృత శంఖం ఉంది. దీనిప్రభావం అనిర్వచనీయమైనది.భరద్వాజ మహర్షి ఈ శంఖం తోటే స్వామివారికి  నిత్యం అభిషేకం చేసేవారని చెపుతారు.  ఈ శంఖం ఉండబట్టే ఇక్కడ నిత్యాన్నదానం నిరాటంకంగా జరుగు తోందని  జనశృతి.ఎక్కడా లేని విధంగా ఈ మట్టపల్లి మహా క్షేత్రం లో 23 ఎకరాల స్థలం లో ఎన్నో అన్నదాన సత్రాలు వెలిశాయి. అందరూ తమ తమ కులాల పేరున అన్నదాన సత్రాల నెలకొలిపి,  అన్న దానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. అన్నదానం శ్రీమట్టపల్లి నరసింహునికి  ప్రీతి పాత్రమవ్వటయే ఇందులకు కారణం గా కన్పిస్తుంది. ఇక్కడ  మొత్తం 13 అన్నదాన సత్రాలున్నాయి. కళ్యాణోత్సవ సమయంలో  వీరందరూ వచ్చిన యాత్రికులందరికీ భోజన ఏర్పాట్లు  చేస్తారు.
      
                         శ్రీ స్వామి వారి అద్దాలమందిరం                  

         ప్రత్యేక ఉత్సవాలు. ::----               ప్రతి శుక్రవారం అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మీ దేవి కి ప్రత్యేక కుంకుమార్చనలు, పర్వదినాలలో లక్ష మల్లికా పుష్పార్చనలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు  జరుగుతాయి. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ద చతుర్ధశి నృసింహ జయంతి సందర్భంగా  శ్రీ స్వామి  వారి కళ్యాణ మహోత్సవం పాంచాహ్నిక దీక్ష తో వైఖానసాగమాను సారం గా ఐదు రోజులు నిర్వహించ బడుతుంది.

                         ఉపాలయం లో శ్రీ విఖనసాచార్య                              

          రవాణా వసతి సౌకర్యాలు .;;----                 కోదాడ, హుజూర్ నగర్ నుండి బస్సు సౌకర్యం ఉంది. దేవాలయం వారి వసతి గదులు  ఉన్నాయి. అన్న దాన సత్రాలలో ఆయాకులాల వారికి ఆయా సత్రాలు సేవ లందిస్తూనే ఉన్నాయి . కాఫీ, టీ, టిఫిన్లు దొరుకుతాయి.
                        

                                           శ్రీ స్వామి వారి         కళ్యాణమండపం

                                రాజ్యలక్ష్మా సమేతాయ రాగద్వేష వినాశినే !
                               మట్టపల్లి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళమ్.


*****9441056609 ***********************************************************
*

No comments:

Post a Comment