Thursday 21 February 2013

వాడపల్లి -- శ్రీ మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి


          

     adapalli   -   Sri  meenakshi sameta Agastesyewara swamy Aalayam
                               
              వాడపల్లి         శ్రీ   మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం
                            
                               वाडपल्लि श्री मीनाक्षी समेत अगस्त्येस्वर आलयंम्

                      నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం  వాడపల్లి ఒకనాడు దక్షిణ భారత దేశంలోనే మహోన్నత దశ అందుకున్న ఓడరేవు పట్టణం. దీనినే ఇప్పుడు వజీరాబాద్ అని కూడ పిలుస్తున్నారు.  జగత్ప్రసిద్ది చెందిన పరిటాల, వెల్లటూరు ప్రాంతం లో లభించు వజ్రాలు, సన్నని నూలు బట్టలు, ఆహార పదార్ధాలు, ద్రాక్షరసం,రాగి ,సీసం ,వెండి,నీలిమందు మొదలైనవి వోడపల్లి రేవు నుండి ఎగుమతి చేయబడుతూ, సుగంధద్రవ్యాలు, చీనాంబ్రాలు, మొదలైనవి దిగుమతి చేసుకొనేవాళ్ళు. సార్ధ వాహులు ప్రాగ్దేశ వస్తువులను వినుకొండ ,మచిలీపట్నం, నుండి కృష్ణానది ద్వారా వాడపల్లి కి చేర్చి, ఇచ్చట నుండి  కళ్యాణి,తగర, పైఠాన్ నగరాల మీదుగా నాసిక్ కు చేరి అటునుండి బరుకచ్ఛం  చేరేవారట. ఆనాడు ఇంత చరిత్ర ,  ఇంత రవాణా సౌకర్యాలు గల వాడపల్లి ని ఈనాడు చేరాలంటే ఎంత కష్ట పడ్డామో క్రిందటి  వ్యాసం లో చెప్పాను.(  చూ.వాడపల్లి – శ్రీలక్ష్మీ నరసింహస్వామి ).
  
                                        ఆలయ శిఖరం
         
                      స్థలపురాణం. :----               ఈ వాడపల్లి   లోని ప్రసిద్ధ చెందిన మరొక ఆలయం శ్రీ మీనాక్షీ సమేత  అగస్త్యేశ్వర  స్వామి. ఈ స్వామి కూడ అగస్త్యమహర్షి ప్రతిష్ట   గా నే చెప్పబడుతోంది. కృష్ణామూసీసంగమ పవిత్ర ప్రాంత లో లోపాముద్రా సమేత అగస్త్య మహర్షి శివకేశవుల అభ్యర్ధన మేరకు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, శ్రీ మీనాక్షీ అగస్త్యేశ్వరస్వామిని ప్రతిష్టించి నట్లు స్థలపురాణం చెపుతోంది. శివకేశవులను కాశీ కావడి లో ఉంచుకొని, వారిని ప్రతిష్ఠించడానికి  పవిత్ర ప్రదేశాన్ని వెదకుతూ, ముల్లోకాలు తిరుగుతూ  అగస్త్యమహర్షి  ఈ కృష్ణా మూసీ సంగమ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ కు రాగానే  శివకేశవులు ఇరువురు ఇక్కడే ఉండ దలచినట్లు ఆ కాశ వాణి పల్కిందట. దానితో అగస్త్యుడు  శ్రీలక్ష్మీ సమేతుడు గా నరసింహుని ప్రతిష్టించి, మీనాక్షీ సమేతం గా అగస్త్యేశ్వరుని ప్రతిష్టించాడు.  శ్రీ లక్ష్మీ నరసింహుడు  ధక్షిణాభిముఖుడై ఉండగా,  ఈశ్వరుడు తూర్పు వైపు తిరిగి ఉంటాడు. ఈ స్థలమహత్య్మం ఏమోగాని ఇక్కడ నెలకొన్న శివ కేశవులిద్దరు ఫ్రత్యేకతలను సంతరించుకునే ఉన్నారు. ఇటువంటి క్షేత్రాలు ఆంధ్ర దేశం లోనే కాదు. భరతఖండం లోనే అతి తక్కువని చెప్పవచ్చు. కాని సరైన రవాణా సౌకర్యాలు,  ప్రచారం  లేక పోవడం వలన ఈ ఆలయాలు అలా మారుమూల ఉండిపోయాయని పిస్తోంది.  ఆనాటి రాజుల అంతులేని కళాతృష్ణకు, ఆనాటి శిల్పుల అద్భుత కళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు ఈ రెండు దేవాలయాలు.
                    
                          శ్రీ స్వామి వారి ఆలయ దృశ్యం
                  
                             మరొక కథనాన్ని అనుసరించి ఒకరోజున ఒక పావురాయి వేట గాని బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చి శ్రీఅగస్త్యేశ్వర స్వామిని శరణుగోరి వారి వెనుక దాక్కున్నది. దాన్ని వెతుక్కుంటూ వచ్చిన వేటగాడు  తన వేటను తనకు అప్పగించ వలసింది గా శంకరునితో వాదానికి దిగాడు. శరణు కోరిన పక్షి ని రక్షించడానికి  స్థిరచిత్తుడైన శంకరుడు పక్షి మాంసానికి బదులు అంతే  పరిమితి లో తన శిరోమాంసాన్ని  తీసుకోవలసింది గా  కిరాతుణ్ణి  కోరాడు. అందుకు నిరాకరించాడు వేటగాడు. పక్షిమాంసం తినే నేను శిరోమాంసాన్ని ఎలా తింటానని ఎదురు ప్రశ్న వేశాడు .దానికి శంకరుడు వాని పూర్వ జన్మ వృత్తాంతాన్ని వినిపించాడు.
                
              
                               కృష్ణా మూసీ సంగమ ప్రదేశం

                    పూర్వ జన్మ లో ఈ కిరాతుడు ఒక రాక్షసుడు. మనుషులను చంపి తింటూ ఉండేవాడు. అలా మనుషులను తింటున్న  వాడిలో దేవతామాంసం తినాలనే కోరిక ఉండేది. కాని అది ఆ జన్మ లో తీర లేదు. కాబట్టి ఈ జన్మలో వాడికోరిక తీర్చదలచాడు పార్వతీ నాథుడు.     తన తలలోని మాంసాన్ని తీసుకోమన్నాడు. శంకరుని  మాటలు విన్న కిరాతుడు శంకరుని శిరోమాంసాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.
          
                              శ్రీ అగస్త్యేశ్వర స్వామి

                    స్వామి దర్శనం:----         తన రెండు చేతులతో పదివేళ్లతో ఈశ్వరుని తలభాగాన్ని  గ్రుచ్చి ,లాగి,  శిరోమాంసాన్నితీసుకొని సేవించాడు. అందుమూలంగానే ఇక్కడ  అగస్త్యేశ్వర స్వామి తలపై ఇప్పటికీ పదివేళ్ల తో మాంసం తీసేసుకున్నట్లు  చారలు,  తలపై సొట్ట కన్పిస్తుంది.  అంతేకాదు ఆ వేళ్ల గాట్ల మధ్య లోనే,  కిరాతుడి ఒక బొటనవేలు, ఒక చిటికెన వేలు లోపలికి గాఢంగా గుచ్చుకోవడం మూలం గా రెండు గుంటలు ఏర్పడ్డాయి. ఒకటి  మూడు వేళ్లు పట్టేటంత ఉంటే రెండవది రెండు వేళ్లు పట్టేటంత ఉంటుంది. వానిలోనుండి అన్నికాలాల్లోను నీరు ఊరు తూనే ఉంటుంది. నీరు పొర్లడం ఉండదు. అర్చకులు భక్తులకు తలపై చల్లడానికి, తీర్థానికీ ఆ నీరే వినియోగిస్తుంటారు. 
                

                     స్వామి తలపై నున్న గంగమ్మ ను చూడవచ్చు
                             
                ఆ బిలము లోతు తెలుసుకోవడానికికొందరు (ఆది శంకరులే అని కొందరు) ప్రయత్నించారని, ఉద్దరణి కి (గుళ్లల్లో తీర్ధమిచ్చే చెంచా వంటి దాన్ని ఉద్ధరిణి అంటారు ) దారం కట్టి లోపలికి వదిలతే అది ఎంతో దూరం పోయిన తరువాత  మరల బయటకు  తీసిచూస్తే, ఆ  ఉద్ధరిణి కి  నెత్తురు అంటుకుని ఉందనే ఐతిహ్యాన్ని ఆలయం లోని పూజారి గారు  వచ్చిన భక్తులకు చెపుతున్నారు.  ఏమైనా లింగం  తలపై పది వేళ్ల గుర్తులు, రెండు రంద్రాలు , వాటిలో నుండి నీళ్లు రావడం మాత్రం నిజం. మేము ప్రత్యక్షం గా చూశాము. అందుకే నేను పై పేరాలో ఎరుపురంగు లో ఆ వాక్యాన్ని వ్రాయాల్సి వచ్చింది. కొన్నింటిని మనం కళ్లారా చూసినా నమ్మలేని స్థితి అంటే ఇదేనేమో.!
                      
                                 శ్రీ మీనాక్షీ దేవి

                      ఆలయదర్శనం.::-----                ఆలయం కృష్ణానది వైపు కు తిరిగి ఉంటుంది. ఆలయం   ముఖమండపం అంత్రాలయం, గర్భాలయం, గా మూడు  భాగాలుగా ఉంటుంది. ముఖమండపం లోనే స్వామి కి కుడివైపు మీనాక్షీ అగస్త్యేశ్వరుల ఉత్సవిగ్రహాలుంటాయి. అంతకు ముందే  ప్రసన్నగణపతి, కుమారస్వామి దర్శనమిస్తారు.  ముఖ మండపం లో శ్వామి కి వామ భాగాన  చిన్నమందిరం వంటి  అర లో మీనాక్షీ దేవి దర్శన మిస్తుంది. అక్కడే కొంచెం దూరం లో లోపాముద్ర అగస్త్య మహర్షి దంపతుల విగ్ర హాలను కూడ మనం దర్శించుకోవచ్చు.
        
                     స్నాన ఘట్టానికి దారి
              
               చారిత్రక నేపధ్యం. :::----                శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కుందూరు చోళులు   మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు ఆధారాలు లభిస్తున్నాయి.  క్రీ,శ .1050-65 మధ్య ఎఱయ తొండయ చోళుడు వాడపల్లి దుర్గాన్ని నిర్మించి ఓడరేవును అభివృద్ధి పరిచాడు.  రేచర్ల పద్మనాయకులు,రెడ్డి రాజుల అధీనం లో కూడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. వీరశైవ కాలం నాటికేఈఆలయం మహోజ్వల దశను  పొందినట్లు గా కన్పిస్తోంది.  కాకతీయుల కాలం లో నూతన నిర్మాణాలు జరిగి నట్లు  కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది.
                   
                                           ఆలయ ప్రాగణం లోని శాసనాలు
               
                     క్రీ.శ 1377( శక సం .1299 )  నాటి శాసనం లో అనవేమయ సామంతుడైన కడియం పోతినాయుడు   స్వామి అన మాచయరెడ్డి గారికి పుణ్యం కొరకు శ్రీ కృష్ణ మూసీ సంగమమైన బదరికాశ్రమమందు అగస్ధేశ్వర దేవరకు పిల్లల మర్రి బేతిరెడ్డి  కట్టించిన గర్భగృహము మీద శిఖర ప్రతిష్ట చేసి, భేరిశాలను కట్టించిరి. అని తెలియ జేయ బడింది.

                              ముఖమండపం లోని అగస్త్యమహర్షి, లోపాముద్ర
         
              రవాణాసౌకర్యాలు.:---    మిర్యాల గూడ నుంచి బస్సు సర్వీసులు కలవు.  ఉండటానికి ఎటువంటి వసతి సౌకర్యాలు ఉండవు. ఆలయ సమీపం లోనే కాఫీ, టీ, వంటివి లభిస్తాయి.
       
        ఈ ఆలయ సజీవ దృశ్యాలను you tube లో దర్శించవచ్చు.https://www.youtube.com/watch?v=IWHIgvdPNWk&feature=c4-overview&list=UUrNtnyJK1VL3MFXOAv6YdgQ



  ఆలయ వేళలు. ::---- మధ్యాహ్నం 12.30 వరకు, సాయంత్రం 4.గం.నుండి 7.30 వరకు దర్శనం లభిస్తుంది.





******************************************************************************
                

No comments:

Post a Comment