Monday, 1 July 2013

వరంగల్లు (హనుమకొండ) శ్రీ భద్రకాళీ మాత ఆలయం

           
    वरंगल्लु ( हनुमकॊंड ) श्री भद्रकाळीमात  आलयम् .          
       
                  వరంగల్లు   ( హనుమకొండ )  శ్రీ భద్రకాళీ మాత  ఆలయం.
      
             Warangal (Hanumakonda) Sree Bhadrakaali mata Temple .   
                 
            ఆంధ్రదేశం లో  నేడు వరంగల్లు అని పిలువబడే నాటి ఓరుగల్లుకు దేశ చరిత్ర లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది.  ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం ఆంధ్ర దేశాన్ని ఏకఛత్రాథిపత్యంగా పరిపాలించిన కాకతీయులకు  ఇది రాజథాని. ఏకశిలానగరంగా  కాకతీయుల శాసనాల్లోను,సమకాలీన సాహిత్యంలోను  పిలువబడిన నగరమే ఆంథ్రీకరణం చెంది ఈ ఓరుగల్లు గా, వరంగల్లు గా పరిణామం చెందింది.
                            
              వరంగల్లు,  హనుమకొండ, కలిసున్నా చారిత్రక ప్రాథాన్యం తో హనుమకొండ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటాము. కాకతీయుల ఆలయాలలో ప్రసిద్ధమైన  వేయిస్థంభాల గుడి,భధ్రకాళీ ఆలయం. హనుమకొండ లోనివే. ఆనాడు కాకతీయ విశాల సామ్రాజ్యంలో ఈ రెండు నగరాలు అవిభాజ్యంగానే ప్రస్తావించబడ్డాయి. అలాగే ఉన్నాయి కూడ.
                         

             
  
             కాకతీయ చరిత్రకు ప్రామాణికంగా లభించే గ్రంథాల్లో ప్రథానమైనవి మూడు.  మొదటిది ప్రతాపరుద్రచక్రవర్తి ఆస్థానకవి విద్యానాథుడు  రచించిన ప్రతాప రుద్రీయమ్ ( క్రీ.శ.1300) . రెండవది ఏకామ్రనాథుని ప్రతాపరుద్రచరిత్రము ( క్రీ.శ.1550-1600) .కాసె సర్వప్ప వ్రాసిన సిద్ధేశ్వర చరిత్రము (క్రీ.శ1600) మూడవది.
                    
        
                       అందమైన ఆలయ ముందు భాగం
                
           ఈ హనుమకొండ నే  కాకతీయుల కాలంలో హనుమద్గిరి అని  పిలిచేవారు.వరంగల్లు ప్రజలకు ఇలవేల్పువిరాజిల్లుతూ, పూజలందుకుంటున్నశ్రీ భద్రకాళీ మాత దేవాలయం కాకతీయుల కాలం నాటికే ప్రాభవ వైభవాలను సంతరించుకున్నట్లు  చారిత్రక ఆథారాలున్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర లోను(1వ పేజి) సిద్ధేశ్వరచరిత్రలోను( 158 వ పేజి ) భధ్రకాళీమాత ప్రస్తావన కనబడుతుంది. సిద్ధేశ్వర చరిత్రలో(24 వ పేజి ) భద్రేశ్వరి  అని కూడ ప్రస్తావించబడింది.
                       

                                   
                                      భద్రకాళి చెఱువు
                                       
         హిడింబాశ్రమము( నేటి మెట్టగుట్ట) కు ఈశాన్యభాగం లో హనుమద్గిరి ఉన్నదని, దానికి పూర్వభాగం లో భద్రకాళీ దేవి కొలువు తీరి ఉన్నదని పై గ్రంథాల్లో చెప్పబడింది. ప్రతాపరుద్రచక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరబోయే ముందు తమకు అభిమాన దేవతయైన దుర్గాదేవిని పూజించి, హనుమద్గిరి వెలుపలనున్న తోటలో సైన్యాన్ని విడిది చేయించి నట్లు ప్రతాపరుద్రీయం లో వ్రాయబడింది. (ఆంధ్ర ప్రతాపరుద్ర యశో భూషణము ,237 వ పేజి )

                            
                         

              
                        ఆలయ ప్రవేశం దగ్గర ఆశీర్వదిస్తున్నట్లున్న శ్రీ అమ్మవారి వివిథ రూపాలు
                      
        శ్రీ భద్రకాళీ ఆలయం క్రీ.శ  625 నాటికే ఉన్నట్లు స్థానికులు కొందరు చెపుతారు. పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి  వేంగీ చాళుక్యుల పైన విజయం సాథించడానికి  ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి, అర్థ సిద్ధి నందినట్లు జనశృతి. దీనికి ఆధారం గా  శ్రీ భద్రకాళీ విగ్రహం ఏకాండ శిలమీద  చెక్కబడి ఉండటాన్ని  కారణం గా  చూపిస్తున్నారు.     
                     

            
                              కొండ పై కొలువుదీరిన ఆది దంపతులు
                
          అయితే కొల్లేటి కోట లోని పెద్దింట్లమ్మ ను, భీమవరం మావుళ్లమ్మ ను చూసిన వారికి ఆ నిర్మాణ పోలికలు   శ్రీ భద్రకాళీమాత విగ్రహం లో స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. రెండు విగ్రహాలు 9X9 ఉంటాయి. రెండు ఏకాండశిలపై చెక్కినవే. అంతే కాకుండా రెండువిగ్రహాలు పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కాలం నాటివి గానే భావించబడుతున్నాయి. ఇలా చెక్కడం చాళుక్య సంప్రదాయం గా చెప్పబడుతోంది.   అంటే శ్రీ భద్రకాళీమాత చాళుక్యల కాలం నుండే పూజలందుకుంటున్నట్లు మనం అంగీకరించవచ్చు. ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్థంభాలు చతురస్రాకారంగా ఉండటం కూడ చాళుక్య నిర్మాణ  శైలి గా తద్విజ్ఞులు వ్రాస్తున్నారు.
                               
   

        
                                  ఆలయ తోరణ ద్వారము
            
                ఆం.ప్ర. పురాతత్త్వశాఖ వారు ప్రచురించిన వరంగల్లు జిల్లా శాసనాలలో 307 వ పేజి లో  శ్రీ భధ్రకాళి గుడి లో అంతరాళ స్థంభాలపై ఉన్న రెండు శాసనాలను ప్రకటించారు.
                     మహేశశ్చారు సంధత్తే మార్గణం కనకాచలే
                     మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచలే” !!
 కొద్ది తేడాతో మరొక శ్లోకం  వేరొకస్థంభం మీద కన్పిస్తోంది. వీటిని సమన్వయించి చూస్తే  10 వ  శతాబ్దం నాటికే ఈ ఆలయనిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.
                            

                                                                                                                                                    
                                      అమ్మ ఆలయ శిఖరం
   
             ప్రతాపరుద్రుని కాలానికే శ్రీభద్రకాళీమాత భక్తులను అనుగ్రహించిన లీలలు కథలు,కథలు గా ప్రచారం లోఉన్నాయి.- అందులో ఒకటి. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు వందమంది విద్వాంసులు  తనను అనుసరించు చుండగా అంబారీపై ఊరేగుతూ, ప్రతాప రుద్ర చక్రవర్తి ఆస్థానానికి వచ్చి, అచ్చటి విద్వాంసులను తనతో శాస్త్ర చర్చకు రావలసింది గా ఆహ్వానించాడట. కాని ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసులు అతనిని అవమానించి పంపించారట.
               


                                శ్రీ భద్రేశ్వరుని ఆలయ ప్రవేశద్వారం
          
                    అహం దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను  ఏదోవిథం గా  ఓడించాలనే ఉద్దేశ్యం తో – ఈ రోజు కృష్ణ చతుర్థశి.రేపు అమావాస్య .మీరు కాదంటారా”?.అని ప్రశ్నించాడట.  ఆస్థాన విద్వాంసులు ఇరకాటం లో పడ్డారు. ఔనంటే సుదర్శనమిత్రుని వాదాన్ని అంగీకరించినట్లవుతుంది. కాదంటేనే అతన్ని ఓడించినట్లు అవుతుంది – అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని  వాదించారట.   విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సిఉంది. ఈ సంకటస్థితి నుండి తమను కాపాడమని మల్లిఖార్జునభట్టు ఆ రాత్రి భద్రకాళీ ఆలయానికి వెళ్లి   ఆ అమ్మను పూజించి, పరిపరి విథాల ప్రార్థించి, పదకొండు శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై  నీమాటలనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండుపున్నమి లాగా  వెలుగొందిన చంద్రుని చూచి, సుదర్శనగుప్తుడు విద్వాంసులను క్షమాపణ వేడుకున్నాడట. ఇది నిజంగా దైవీశక్తి గాని,మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట.
                   


            
                                               ఆలయ ఆవరణ లోని శంకరుడు




                                                                      ఆది శంకరుడు

                     ఈ వృత్తాంతంలో ప్రస్తావించబడిన శాఖవెల్లి మల్లిఖార్జునభట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు.  కాబట్టి ప్రతాపరుద్రుని కాలం నాటికే శ్రీ భద్రకాళీమాత ప్రసిద్ధమై ఉన్నట్లు, భక్తలపాలిట కల్పవల్లియై ఆదుకొంటున్నట్లు మనకు అర్థమౌతోంది.  
                        
              
                  


                                                        ఆలయం వద్ద ప్రకృతి దృశ్యం          
                 
         శ్రీ భద్రకాళీ ఆలయం ఓరుగల్లు నగర ప్రధాన రహదారికి  ఒక కిలోమీటరు దూరం లో జలాశయం ప్రక్కన, కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణం  లో అలరారుతోంది. భధ్రకాళీదేవి  విగ్రహం  సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పు  కలిగి భయద గంభీరం గా భక్తులను కటాక్షిస్తూ, కన్పిస్తుంది.
                   
                     

                                   శ్రీ భద్రకాళీమాత దివ్యరూపం
               
            అమ్మవారు అష్టబాహువులతో,ప్రేతాసీనయై ఉంటుంది. కుడివైపున ఉన్ననాలుగు చేతులలో వరుసగా-ఖడ్గము,ఛురిక, జపమాల,డమరుకమును, ఎడమవైపున ఉన్న నాలుగుచేతులలో –ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము,(నరికిన తల ) పానపాత్ర  ఉన్నాయి.ఈ తల్లి పశ్చిమాభిముఖం గా ఉంటుంది.
           
                       https://www.youtube.com/watch?v=tfH30Ug_124
             
        ఆలయ ముఖమండపము ఆథునిక నిర్మాణము.  దీనిలో ధ్వజస్థంభము, సింహవాహనము,బలిపీఠము, ఉంటాయి.  ముఖమండపం లో ఆంజనేయ, సుబ్రమణ్యేశ్వర, నవగ్రహప్రతిష్టలున్నాయి. మహామండంపం లో దక్షిణవైపున భద్రేశ్వర  ఆలయ మున్నది.ఇందులో  లింగము వెనుక పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఏకశిలపై చెక్కిఉండటాన్ని మనము గమనించవచ్చు. శ్రీ వల్లభ గణపతి ఆలయాన్ని పతిత్రపరిక్రమ ను నూతనం గా నిర్మించారు.       
                     

              
                                                          జ్వలిస్తున్న   పవిత్ర పరిక్రమ
                   

                        క్రీ. శ 1323 లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంత,విజయనగర రాజ్య పతనానంతరం పూర్తిగాను, ఈ ఆలయప్రాభవం కోల్పోయినట్లు చరిత్ర చెపుతోంది. క్రీ.శ 1950 లో  ఆలయాన్నితిరిగి పునరుద్ధరణ చేయడానికి   ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేశ్ శాస్త్రి, శ్రీ వైష్ణవపండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజా చార్యులవారు సంకల్పించి, అందుకు సహకరించవలసిందిగా  నగరం లో ప్రముఖవ్యాపారిగా నున్న శ్రీ మగన్ లాల్ సమేజా  వద్దకు మరునాడు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నారట. కాని అదే రోజు రాత్రి శ్రీ మగన్లాల్ సమేజా గారి  కలలో శ్రీ అమ్మవారు కనిపించి, రేపు నీదగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు. వారితో పాటు నీవు నాఆలయానికివచ్చి నన్ను సేవించు అని ఆదేశించిందట.
                          
              
           
                                           అమ్మవారి ఆలయం ప్రక్కనే ఉన్న ఆది శంకరుని ఆలయం
          
                     మరునాడు తన ఇంటికి వచ్చిన  ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా నమ్మిన ఆ ప్రముఖుడు, వారి వెంట ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి,  నా కుమార్తె కు పడిపోయిన మాట తిరిగొస్తే  ఆలయ పునరుద్ధరణకు సహకరిస్తానని శ్రీ గణేశ శాస్త్రి తో అనడం, శ్రీ శాస్త్రి గారు నెలరోజులవాటు ప్రతిరోజు శ్రీ అమ్మవారి అభిషేక జలాన్ని, శ్రీ మగన్ లాల్ గారి కుమార్తె కు తీర్థం గా ఇవ్వడం, ఆమెకు మాట రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. అమ్మవారి మహిమకు ముగ్థుడైన శ్రీ మగన్ లాల్ సమేజా ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు.  
      

                                                                         స్థల పురాణం

                                    ఆ యనంతరం ఎందరో మహానుభావుల సహాయ సహకారాలతో 29.7 1950 న మహాసంప్రోక్షణ కార్యక్రమాలతో  ఆలయం పునరుద్ధరించబడి, దిన దిన ప్రవర్థమాన మౌతోంది.
                       
  
                                                          ఆలయ ప్రవేశ మార్గం
          ఆ సమయం లోనే వ్రేలాడతున్న నాలుక తో రౌద్రరూపిణి గా ఉన్న శ్రీ అమ్మవారి  నాలుక పై అమృత బీజాలను వ్రాసి,యంత్రాన్ని ప్రతిష్టించి,  భీకరం గా ఉన్న ముఖాన్ని ప్రసన్నంగా మార్చారని, దక్షిణాచార సంప్రదాయం లో పూజించబడే మూర్తి శాంతరూపిణి గా ఉండాలనేది శాస్త్రవిథి యని స్థల పురాణం లో వ్రాయబడింది. అంతేకాక అమ్మవారి ఆలయం లో చండీ యంత్రాన్ని  ప్రతిష్టించి, ప్రతిసంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులను నిర్వహిస్తూ, నిత్యధూప దీప నైవేద్యాలను ఆచరిస్తున్నారు. జంతుబలులను పూర్తిగా నిషేధించారు.

                                              శ్రీ శాకంభరీ దేవి గా భద్రకాళీమాత
            
                         శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆశ్వయుజ మాసం లో శరన్నవరాత్రులు, చైత్రమాసం లో వసంత రాత్రులు వైభవం గా నిర్వహిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారిని శాకంభరీదేవి గా అలంకరిస్తారు.
            పూర్వకాలం లో హిరణ్యాక్షుని వంశం లో దుర్గముడనే వాడు,పుట్టి తపస్సుతో బ్రహ్మను మెప్పించి, బ్రాహ్మణుల వద్ద నున్న వేదాలు, మంత్రాలు తనకు కావాలని, దేవతలు అపజయం కలగాలని , వరం కోరుకున్నాడు. బ్రహ్మ సరేనన్నాడు. దానితో బ్రాహ్మణులు  వేదాథ్యయనము,జపహోమాదులు  వదిలివేశారు. దానివలన దేవతలకు అందవలసిన హవిర్భాగము లందక వారు శక్తిహీనులయ్యారు. యజ్ఞాలు  జపతపాలు లేక ప్కృతి లో ధర్మం నశించింది. అనావృష్టి వలన మనుష్యులు, పశుపక్ష్యాదులు పెద్దఎత్తున మరణించసాగారు.  భూమండలమంతా మృతకళేబరాలతో నిండిపోయింది. ఆసమయం లో బ్రాహ్మణుల హిమాలయాలకు వెళ్లి పరాశక్తి ని ప్రార్థించారు. అమ్మవారు కటాక్షించి తొలకరి మబ్బువంటి శరీరఛాయ, నూరు కన్నులు,కోటిసూర్యుల తేజస్సు తో లోకోత్తర లావణ్య రూపిణియై ఆవిర్భవించింది. ఆ తల్లి చేతులలో మథుర రస భరితములైన పండ్లు,ఫలాలు,  రకరకాల భక్ష్యభోజ్య పదార్థాలను ధరించి ఉంది. ఆమె నేత్రాలు పూర్ణకుంభాల్లాగ నిండుగా ఉన్నాయి. ఆ కండ్లనుండి తొమ్మిది రోజులపాటు ఏకథాటిగా కారిన నీటితో ఓషథులన్నీ జీవకళతో ప్రకాశించాయి. నదీనదాలు,చెఱువులు జలసమృధ్ధి తో కళకళలాడి జగత్తు చల్లబడింది. ఆమె శరీరమునుండి ఫలశాక సమూహాలు, అన్నపాన అమృతాలు అవిర్భవించి లోకంలోని  కరువు రూపు మాపబడింది. కావున ఆమె శాకంభరి అయ్యింది. ( - శ్రీదేవీభాగవతం – సప్తమ స్కంథము   )
            
           

            
         శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపం లో అలంకరించబడి సేవించబడుతోంది. వైశాఖ శుద్ధ పంచమి శంకరజయంతి రోజున శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు(బ్రహ్మోత్సవాలు) కన్నుల పండువు గా జరుగుతాయి.
                        



 శ్రీ  పెద్దింట్లమ్మ                                                   శ్రీ భద్రకాళీ మాత                                        శ్రీ మావుళ్ళమ్మ                              
                                    
                                            ముగురమ్మలు
                 
                 



                
                    నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ: !
                             నమ: ప్రకృత్యై భద్రాయై నియతా:ప్రణతాస్మ్యహం !!





   ******************************************************************************


Wednesday, 26 June 2013

కొడవటంచ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం

   

                                    Kodavatancha   
  
         Sree Sree  Sree Lakshmi nrusimha swamy   Aalayam       
              

                                కొడవటంచ  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం.
       कॊडवटंच श्री श्री श्री लक्ष्मीनृसिंहस्वामि आलयम्.
                     
            వరంగల్లు జిల్లా రేగొండ మండలం లోని కొడవటంచ గ్రామం శ్రీ లక్ష్మీ నృసింహుని దివ్యథామం.  రేగొండ మండల కేంద్రానికి 9కి.మీ. దూరం లో కొడవటంచ లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయంభువు గా వెలసి, భక్తులను కరుణిస్తున్న దివ్యక్షేత్రమిది.
                   
            శ్రీ స్వామి వారు యోగముద్ర లో నుండగా వామాంకముపై నిత్యానపాయిని యైన లక్ష్మీదేవి   వెలసియుండుట  ఈ క్షేత్ర విశిష్టత గా చెప్పబడుతోంది.
                     

            
                                                           ఆలయ రాజగోపురం

             హిరణ్యకశ్యపుని  వథానంతరం ఉగ్రరూపుడైన శ్రీ నృసింహుని శాంతపరచ డానికి కాదు గదా   ఆయనను  సమీపించడానికి కూడ ఎవ్వరు సాహసించలేక పోయారు. ఆ సమయం లో   ఆయన వక్షస్థలం పై నిత్యం విలసిల్లే  శ్రీ లక్ష్మీదేవి కూడ శ్రీ స్వామి  వారి ఉగ్ర రూపాన్ని చూచి, కొంచెం జంకి దూరంగానే నిలబడిపోయిందట.
                 అప్పుడు సనకసనందనాది మహర్షులు,దేవతాగణము కలిసి పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదకుమారుని వేడుకొనగా, ప్రహ్లాదుడు శ్రీ స్వామి చెంతకు వెళ్లి వివిథస్తోత్రాలతో ఆయనను శాంతపరచాడు. శాంత స్వరూపుడై, యోగముద్రలో నున్న శ్రీ స్వామి వారి వామాంకమున కలుములజవరాలు  శ్రీ లక్ష్మీదేవి ఆసీనురాలైంది.శ్రీ స్వామి అదే రూపంతో  అర్చావతారుడై ఈక్షేత్రం లో వెలసి  భక్తజనులను కటాక్షిస్తున్నారు.
                  

         
                                                                            ధ్వజస్థంభం
             
            మాంథాత కాలం నాటికే ఈ క్షేత్రము ఉన్నదనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి కొంచెం దూరములో మాంథాత బండ అని పిలువబడే ఒక శిల నేటికి కన్పిస్తుంది.
                       (మాంథాత భాగవత శేఖరుడైన అంబరీషుని యొక్క తండ్రి .  మాంథాత తండ్రి యువనాశ్వుడు. యువనాశ్వుడు సంతానం కోస పుత్రకామేష్టి యాగం చేశాడు. భగీరథుడు యువనాశ్వుని భార్యలకోసం యాగ జలాన్ని భద్రపరుచగా, ఆ విషయం తెలియని యువనాశ్వుడు ఆ నీటిని త్రాగి వేయడం తో అతను గర్భం ధరించాడు.అతని కడుపు చీల్చుకొని మాంథాత  బైట కొచ్చాడు.) (భాగవతం)
                       కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశీకుడైన శ్రీమాన్  తూపురాణి రంగాచార్యులు గారు ఒకరోజు  ఇప్పుడు ఆలయ ప్రాంగణము నందు గల  బావిలో నుండి నీరు తోడుచుండగా చేద (దీనినే కొన్ని ప్రాంతాల్లో బక్కెట అంటారు) లో అంగుష్ట ప్రమాణంలో ఉన్న శ్రీ స్వామి వారి ప్రతిమ ఒకటి  వచ్చింది.  పరమనిష్టాగరిష్ఠుడు,అకుంఠిత నృసింహదీక్షాతత్పరుడునైన శ్రీ ఆచార్యుల వారు ఆ ప్రతిమను చూచి, మిక్కిలి ఆశ్చర్యానందాలకు లోనైన వారై, తన పూజామందిరములో ఆ ప్రతిమ ను ఉంచి పూజించుచుండిరి. కాని ఆచార్యులవారికి ఏదో ఒక అసంతృప్తి. ఆ స్వామి దర్శనం అందరికీ కల్గింప చేయాలనే తపన.  అందుకే శ్రీ స్వామి వారిని అర్చాస్వరూపముతో వెలసి,భక్తుల పూజలందుకొని తనను కృతార్థుని చేయవలసింది గా ప్రతిరోజు అనుష్టానసమయం లో శ్రీ స్వామివారిని  వేడుకొనసాగారు ఆచార్యులవారు.
                          

    
                                        ధ్వజస్థంభ  పూర్వదృశ్యం
           
                ఆచార్యులవారి కోరిక తీరే సమయమాసన్నమైంది.ఒకరోజు శ్రీ రంగాచార్యుల వారికి శ్రీ నృసింహస్వామి  స్వప్నము నందు సాక్షాత్కరించి  చిన్నప్రతిమ లభించిన బావికి సమీపం లో తాను అర్చారూపంగా వెలసినట్లు చెప్పి అంతర్థానమయ్యారు.  శ్రీ ఆచార్యుల వారు మేల్కొని, ఆ ప్రాంతమంతయు ఎంతవెతికినను   శ్రీ స్వామి వారి విగ్రహము ఆచూకి లభించలేదు. అలసిపోయి, నిరాశ తో కొద్దిగా విశ్రమించిన ఆచార్యుల వారికి స్వప్నములో మరల స్వామి ప్రత్యక్షమైనారు. తన అర్చారూపము గల ప్రదేశమునకు ఆనవాలు గా ఇటుక ఆకారమున్న శిలపై శ్రీ ఆంజనేయుని విగ్రహము కన్పించగలదని చెప్పారట. మరల ఆ ప్రదేశమున వెతగ్గా శ్రీ ఆంజనేయవిగ్రహము, దాని సమీపం లో ఒక మట్టి దిబ్బ కనిపించాయి. అప్పుడు ఆచార్యుల వారు తన చేతిలో నున్న కొడవలి  తో ఆ మట్టి దిబ్బ ను పెళ్ళగించగా, శ్రీ స్వామివారి పరమాద్భుత విగ్రహం వెలుగు చూసింది. కొడవలి వంచిన శ్రీ స్వామివారి పేర ఈ క్షేత్రం కొడవటి వంచ  అయి, క్రమంగా ప్రజల వాడుకలో కొడవటంచ  గా పిలువబడుతోంది.
             
           ప్రస్తుతం పరిసర గ్రామాల ప్రజలు దీన్ని  కొడంచ  అనే పిలుస్తున్నారు. మేము యాత్రలో భాగం గా గణపూర్ దగ్గర కొడవటంచ అని అడిగితే, వాళ్లు కొడంచ అనడం మాకు మొదట్లో ఆశ్చర్యాన్ని కల్గించింది. కాని పరకాల రోడ్డు మలుపులో మార్గసూచిక గా కొడంచ అనే బోర్డు కన్పించడం తో  మారిన ఊరు పేరు మాకు అప్పుడు అర్థమైంది.
                       

               
                                                    ముఖమండపం లో కొలువుతీరిన ఆంజనేయుడు

              ఆనాడు బావి చేదలో దొరికిన చిన్నప్రతిమ ఈనాటికి సాలగ్రామాల మథ్య  ఆలయం లో పూజించబడుతోంది. ఆనాడు స్వామి విగ్రహము వెలసిన ప్రదేశమందే ఆలయ నిర్మాణం జరిగి,దిన దిన ప్రవర్థమానమౌతోంది.

                        
                    ఆలయం ముఖమండపం,అంత్రాలయం,గర్భాలయం గా మూడుభాగాలుగా నిర్మించచబడింది. ముఖమండపం లో ఉత్తరాభిముఖుడుగా ఉన్న ఆంజనేయుడు భక్తుల మొఱలను స్వామికి నివేదిస్తున్నట్లు స్వామి వైపుకు ముకుళిత హస్తుడై దర్శనమిస్తాడు. అంత్రాలయానికి రెండువైపులా జయవిజయులు కొలువుతీరిఉన్నారు. శ్రీ స్వామి వారికి ఎదురుగా ముఖమండపం లో గరుడాళ్వరు వేంచేసియున్నాడు.
                                   


                         
                            
                            శ్రీలక్ష్మీ నృసింహుని దివ్యరూపం        
                        
                   గర్భాలయం లో శ్రీ నృసింహుడు  వామాంకస్థిత లక్ష్మీ  యుతుడై దర్శనమిస్తున్నారు. వారి చుట్టు ఆళ్వారులు పరివేష్టించి ఉన్నారు. శ్రీ రామానుజుల వారి దివ్య విగ్రహం  ప్రత్యేకంగా  ఉత్సవమూర్తుల చెంత దృశ్యమానమౌతోంది. 

                                   ఆలయ శిఖర దర్శనం
                  ఆదివారం,పర్వదినాల్లో ఇక్కడకు భక్తులు అధికసంఖ్య లో వస్తారు.ఆలయానికి ముందు ఉన్న విశాలమైన ఖాళీస్థలం లో, చెట్ల క్రింద వంటలు చేసుకొని, దేవునికి చూపించి,  అయినవారితో పాటు అక్కడికొచ్చిన వారికి కూడ వడ్డించి ఆత్మతృప్తి తో తిరిగి వెడుతుంటారు.
                       
            
                                                 శ్రీ స్వామి వారి వాహనశాల
                            
     ఈ క్షేత్రం లో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని మానసికరోగము లను నివారించే పరమాద్భుతమూర్తి గా భక్తులు విశ్వసిస్తారు.  తీవ్రమైన మానసిక  వ్యాధు లతో బాధపడుతూ,గొలుసులతో బంధింపబడి,ఈ క్షేత్త్రానికి తీసుకురాబడిన వ్యాధిగ్రస్తులు అనేకమంది ప్రతిరోజు  ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారికి ప్రదక్షిణలు శ్రీ స్వామి తీర్థాన్ని సేవించి, సాంబ్రాణి పొగ వేసుకుంటూ మండలం రోజులు సేవిస్తే  వారు ఆరోగ్యవంతులైన నిదర్శనాలు కొల్లలుగా ఉన్నాయట.   దారిద్య్ర,ఋణబాధలు  స్వామి  వారి దర్శన మాత్రముననే దూరమౌతాయని భక్తుల దృఢవిశ్వాసం. సంతానం లేని వారు మండలం రోజులు ఆలయ ప్రదక్షిణ చేస్తే సంతాన వంతు లౌతారని నమ్మకం.
                          

          
                                         గుడి ముందు విశాలమైన ప్రదేశంలో కళ్యాణ మండపం

                 ఈ ఆలయం లో పాంచరాత్రాగమ సంప్రదాయానుసారముగా  పూజలు నిర్వహించ బడుతున్నాయి.ప్రతి సంవత్సరం వృషభసంక్రమణ మాసం లో  శ్రీ నృసింహుని జయంత్యుత్సవాలు,ఫాల్గుణ మాసం లో పాంచాహ్నిక దీక్ష తో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ స్వామి వారి శకటోత్సవం జరుగుతుంది. ఆ రోజున ఆలయం చుట్టు వివిధ రకాల ప్రభలతో అలంకరించిన బోనాలు, ఎడ్లబండ్లు తిరగటం విశేష ఆకర్షణ. ఈ సందర్భంగా దాదాపు రెండు లక్షలమంది యాత్రికులు శ్రీస్వామి వారిని దర్శించుకుంటారు.
                            
             

                                                       ఆలయ ఉత్తర ద్వారం   

          శ్రీ స్వామివారికి  ఉగాది, శ్రీరామనవమి, తొలిఏకాదశి,ఆండాళ్ తిరునక్షత్రం, శ్రీకృష్ణ     జన్మాష్టమి,దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి, ధనుర్మాసము లో అధ్యయనోత్సవం, మొదలైన పర్వదినాల సందర్భంగా విశేషపూజలు,సేవలు జరుగుతాయి.
           
              “  కరవీర సుమాభూషా చక్షురానందమూర్తయే !
              కొడవటంచ నివాసాయ  శ్రీ నృసింహాయ మంగళమ్ !!”



*************************************************************** *****************      

Tuesday, 25 June 2013

పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం

                     Palakurthy Sri Someswara LakshminarasimhaSwamy Aalayam
            పాలకుర్తి   శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం .       
                      पालकुर्ति श्री सोमेश्वर लक्ष्मीनरसिंहस्वामि आलयम्     
                   

              వరంగల్లు జిల్లా పాలకుర్తి శివకేశవులు ఇరువురు స్వయంభువు లుగా ఒకే కొండపై  వెలసిన దివ్యక్షేత్రం. దట్టమైన చెట్ల మధ్య కొండ పై భాగాన రెండు గుహలు. ఒక గుహలో సోమేశ్వరుడు, ప్రక్కనే వేరొక గుహలో లక్ష్మీనరసింహుడు కొలువు తీరి  కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజనాలందుకుంటున్నారు.

     క్షేత్ర మహత్మ్యం :---         ఈ కొండరాళ్లకు ,చెట్లకొమ్మలకు పదుల కొద్ది తేనెపట్టు లుంటాయి. శుభ్రత పాటించకుండా ఆలయానికి కొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానంచేసేవరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి, ఆపదలు తీరిన తరువాత మర్చిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తుంటారట.
                           

          
                       ఎత్తైన కొండ రెండు గా చీలి, ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడటం చూపరులకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.ఒక భక్తురాలి కోరిక మేరకు కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్ ఏర్పడినట్లు భక్తులు చెప్పుకుంటారు. అది సహజసిద్ధంగా ఏర్పడినా ఒక సహజ ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తించ దగ్గది.  కొండపై నున్న  శిఖరదర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ళ మథ్యనుండి పైకి మెట్ల మార్గం ఉంది.

 
          

       గండదీపం




 గండదీపం. :--         ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి  తమ మొక్కులను తీర్చుకుంటారు. కొంచె బరువైన శరీరం కలిగిన వాళ్ళు, చీకటికి భయపడేవారు, ఆథునికంగా నిర్మించిన వేరే మెట్ల దారి ద్వారా పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు.  అయితే శిఖర ప్రదక్షిణం చేయాలంటే మాత్రం  రాళ్ళమథ్య, నిలువుమెట్ల పై ప్రయాణం చేయాల్సిందే.


                                                 ప్రదక్షిణ మెట్లమార్గం

   క్షేత్ర ప్రాథాన్యం .:       ఈ మెట్ల మార్గం శ్రీ స్వామి రెండు గుహలకు  కొంచెం దక్షిణంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గానికి ఆనుకొని కొండ లోపలికి క సొరంగ మార్గం ఉంది. దీనిని నేలబొయ్యారం ని పిలుస్తారు. ఇప్పుడు దీనిని మూసివేశారు. చిత్రంలో చూడవచ్చు. ఇది జన సంచారం పెరిగే మొన్న మొన్నటి కాలం వరకు మహర్షులు తపస్సుకు, యజ్ఞ యాగాదులకు ఎంచుకున్న ఏకాంత పుణ్య రహస్య స్థలంగా భావించబడుతోంది.  ఇప్పటికీ ఈ కొండలో నుండి రాత్రి వేళల్లో ఓంకారం వినిపించడం, శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరపడం విశేషంగా భక్తులు చెపుతుంటారు.
                    
                
             

                                        నేలబొయ్యారం

   చాలాకాలం క్రితం  నేలబొయ్యారం లోని విశేషం తెలుసుకుందామని భావించిన అర్చకులు, కొందరు గ్రామ పెద్దలు కలిసి సొరంగం లోకి కొంతదూరం ప్రయాణం చేసి, ఇరుకైన, గాలి రాని, గబ్బిలాల వాసనతో నిండిన దారిలో ముందుకు సాగ లేక వెనక్కి వచ్చేశారని స్థలపురాణం చెపుతోంది.
                                                                                                                                             
                                                                                                                                                   ఈ గుహకు ప్రక్కనుంచి  పై నున్న  వీరాంజనేయస్వామి  ఆలయానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడ నిలువుగా పెద్ద కొండ రాళ్ళమథ్య నుంచి సాగిపోతాయి. ఈ ఆంజనేయుని దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాలనుండిభక్తులు వచ్చి ఉప్పురాశి గా పోసి ,దాని పై  ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు.   ఎటువంటి భూత , ప్రేత,పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని  భక్తుల నమ్మకం.


                     రెండుగా చీలి ప్రదక్షిణ మార్గాన్నిచ్చినకొండ
  
పాలేరు>పాలకురికి>పాలకుర్తి   :--. వేల సంవత్సరాల చరిత్ర గల  ఈ కొండ గుహల నుండి పాల లాంటి నీరు ప్రవహించేదట. ఆ నీరు చెరువులో కలసి పాలేరు గా ప్రవహించి, గోదావరి లో కలుస్తుంది.  అందువలన  పాలేరు కు జన్మనిచ్చిన ఈ మహాక్షేత్రమే పాలకుర్తి గా ప్రసిద్ధిపొందింది. పాలకురికి గ్రామమే క్రమంగా పాలకుర్తి అయ్యింది. దీనినే పండితులు క్షీరగిరి అని కూడ పిలుస్తారు.


   
                               మెట్లమార్గం లో రెండవ మలుపు

శ్రీ సోమేశ్వర, లక్ష్మీనరసింహ దర్శనం.:---    ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి, దానిలో నుండి  స్వామికి ఎడమవైపుకు ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోనికి దారి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తరస్థానం లో కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది.
                      

                                శ్రీ సోమేశ్మవర స్వామి వారి దివ్యరూపం

  శ్రీ సోమేశ్వరుడు గుహలోపలికి ఎత్తైన తిన్నె పై స్వచ్ఛధవళ కాంతులనీనుతూ సుమారు అడుగున్నర ప్రమాణం లో పానమట్టం పై వెలసి, భక్తులకు దర్శన మిస్తున్నాడు.ఆర్జితసేవ లో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంది.
                  

                                          శ్రీ  పార్వతీ మాత       

శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతుడై  ఎత్తైన తిన్నెపై సుమారు మూడడుగుల విగ్రహం లో కొలువు తీరి చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత జనరక్షకుడు నై భక్తమందారుడు గా భక్త జనుల పూజలనందుకుంటున్నాడు. మానసిక రోగాలు,శారీరక బాథలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయని భక్తులనమ్మకం.  అందుకేనేమో.! స్వామిని దర్శించిన ప్రతి భక్తుని,అర్చకులవారు,  స్వామి పాదాల చెంత నున్న చిన్న బెత్తాన్ని తీసుకొని,   భక్తుని వీపు పై నెమ్మదిగా తాటించడం ఈ ఆలయం లో కన్పిస్తుంది.
                       
           



                               శ్రీలక్ష్మీనరసింహుని దివ్య గంభీర రూపం
            
     ఈ ఆలయానికి ముఖమండపము, లోపలికి వెడితే గుహ లో తిన్నెపై స్వామి దర్శనము తప్పితే అంత్రాలయము ,గర్భాలయము వంటివి వేరు గా కన్పించవు. ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందాన్ని కల్గిస్తోంది.
      ******   ఈ ఆలయ పూర్తి చిత్రాన్ని YOU TUBE  లో "  Palakurthy sri someswara lakshminarasimha swamy darsanam "     ద్వారా చూడవచ్చు.******                
     
                 https://www.youtube.com/watch?v=h9ls7TCSoO4
                    
                     ఈ పుణ్యభూమి లోనే 12 వ శతాబ్దానికి  చెందిన వీరశైవ కావ్య నిర్మాణ థౌరేయుడు, బసవ పురాణ కావ్యకర్త,  మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. శ్రీ విష్ణురామిదేవుడు, శ్రియా దేవమ్మ దంపతులకు  శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదం గా ఆమహానుభావుడు జన్మించాడు. అందుకే తల్లిదండ్రులు ఆయనకు  సోమనాథుడని పేరు పెట్టుకున్నారు. శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని  స్తుతిస్తూ సోమనాథుని స్వవాలు వ్రాశాడని చెపుతారు.             అనుభవసారము,బసవపురాణము,పండితారాథ్యచరిత్ర, చతుర్వేద సారము  మొదలైన అనేక గ్రంథాలను, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు. ఈ గ్రామం లో సోమనాథుని స్మృతి చిహ్నం గా నిర్మించిన శివాలయం ఉంది.
                      


           
                                                  శ్రీ వినాయకుడు
          
               శ్రీ  ఆంథ్ర  మహాభాగవత మందార మకరందాన్ని తెలుగు వారి కందించిన భక్తకవి పోతన నివాస గ్రామం బమ్మెర ఈ పాలకురికి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు  ఈ సోమేశ్వరుని, లక్ష్మీ నర సింహు ని దర్శనానికి వచ్చి వెడుతుండే వాడనడానికి గ్రంథాల్లో  ఆథారాలున్నాయని స్థలపురాణం లో వ్రాశారు.
                       
  


                                    విహంగవీక్షణం
             
            వాల్మీకి మహర్షి  కూడ పాలకుర్తి కి ఐదు కిలోమీటర్ల దూరం లోగల వల్మిడి(వాల్మీకి పురం) లో గల కొండల్లో నివసించే వాడని ప్రతీతి.
                     
              ఇక్కడికొచ్చే భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టడం, గండదీపాలు వెలిగించడం, అన్నదానం, తలనీలాలుసమర్పించడం,కోడెలను కట్టివేయడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన తర్వాత స్వామి వారి కళ్యాణం చేయిస్తారు. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకం.

                         
                                       శ్రీ సోమేశ్వర గుహ ముఖద్వారం
           
         సంతానం లేని వారు మొదట కొబ్బరి కాయలు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణ చేస్తారు. ల్లు కడితే బంగారు,వెండి, కర్ర ఇల్లు చేయించి       శ్రీ స్వామి వారికి సమర్పిస్తారు.అనారోగ్యం తో బాధపడేవారు  అవయవాలను వెండితో చేయించి  తెచ్చి సమర్పించడం  కూడ ఈ ఆలయం లో కన్పిస్తుంది.   
     


                                     నందీశ్వరుడు

 ఉత్సవాలు : ---            మహాశివరాత్రి కి శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి,జాతర కు  రాష్ట్రం నలుమూలలనుండే కాక కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలనుండి కూడ లక్షలాది గా భక్తులు  తరలివస్తారు.ఉత్సవాలలో భాగం గా యజ్ఞ యాగాదులతో పాటు,  దివ్యరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.కొండచుట్టు ప్రభలు కట్టిన ఎడ్లబండ్లు పరుగులు తీస్తాయి. చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది.
                    
    
                శ్రావణ మాసం లో శత చండీ హవనం, రుద్రహవనం,లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, మార్గశిర మాసం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్గళి ప్రాత: కాలార్చనలు,నైవేద్యాలు, ప్రసాదవినియోగం ఉంటాయి. శ్రీ సోమనాథ మహాకవి శివైక్యం పొందిన    ఫాల్గుణ మాసం లో ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ప్రతి మాస శివరాత్రికి  శ్రీ  స్వామివారి కళ్యాణం నిర్వహించ  బడుతుంది.

                      
                                      కొండ దిగువన ఉత్సవ మండపం     
  
         శివ కేశవ అభేదానికి ప్రతీకగా కన్పించే ఈ ఆలయం లో  శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం లో శైవాచార్యులే ( శివారాథకులు) అర్చకులు గా ఉండటం నిజంగా అభినందించ దగ్గ విషయం.
                   
         జిల్లా కేంద్రమైన వరంగల్లు కు 60 కి .మీ. దూరం లో ఈ పాలకుర్తి పుణ్యక్షేత్రం ఉంది.   కొండపైకి చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. యాత్రీకులకు కనీస వసతులు ఉన్నాయి. హైద్రాబాద్ , హన్మకొండ. వరంగల్, ష్టేషన్ ఘనాపూర్, జనగామ, తొర్రూరుల నుండి రవాణా సౌకర్యాలున్నాయి.
                      
                      ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రాచీన దివ్యక్షేత్రం పాలకుర్తి.







****** క్షీరాద్రి శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే ***** ****************************************