Wednesday 10 July 2013

కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వరఆలయం

     
                          Keesaragutta Sri Bhavani Ramalingeswara Aalayam.
  
                                కీసరగుట్ట  శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయం.
                
                       कीसरगुट्ट् श्री भवानी रामलिंगेश्वर आलयम् !

                      ఆంథ్రప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట   శ్రీ రామలింగేశ్వరుడు  స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం.  క్రీ.శ 4-5 శతాబ్దాల్లో ఆంథ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన ప్రభువైన రెండవ మాథవవర్మ రాజథాని యైన  ఇంద్రపాలనగరం  ఇదే నని చారిత్రక ఆథారాల ద్వారా  తెలుస్తోంది. పదకొండు అశ్వమేథయాగాలు చేసి,తన సామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింపజేసిన మహావీరుడు  రెండవమాథవవర్మ. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర భూమి  ఈ కీసరగుట్ట .ఈ పుణ్యక్షేత్రం  నేటి ఆంథ్రుల రాజథాని భాగ్యనగరానికి 40 కి.మీ దూరంలో ఉంది. 
  

                      
                        ఘాటురోడ్డు వద్ద తోరణద్వారం
           
                శ్రీ రామచంద్రుడు రావణ సంహరణానంతరం అయోథ్యానగరానికి మరలి వెడుతూ,మార్గమథ్యం లో ఈ కొండ మీద కొద్దిసేపు ఆగాడట.  ఈ ప్రదేశ ప్రభావ మేమో కాని   శ్రీ రామచంద్రుని మనస్సులో ఒక ఆలోచన కలిగింది. రావణ బ్రహ్మ సంహరణానంతరం  తాను నిర్వర్తిస్తున్న శివలింగాల ప్రతిష్ఠ ల్లో భాగం గా ఈ కొండపై  శివలింగ ప్రతిష్ఠ చేయాలనే ఆలోచన కలిగింది. మహర్షులు ముహూర్తం నిర్ణయించారు.వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుండి  శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు కౌసల్యానందనుడు. రామాజ్ఞ కావడమే ఆలస్యం రివ్వుమని ఆకాశం లోకి ఎగిరాడు మారుతి. 
                  
                              
                             ఆలయ రాజగోపురం
            
            కాని ముహూర్తసమయం సమీపిస్తున్నా కేసరీనందనుని జాడేలేదు. ఆలస్య మౌతోందని ఆలోచిస్తున్న శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. ముహూర్త సమయానికి ప్రతిష్ఠాకార్యక్రమాన్ని ముగించి థన్యో2హం అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంతలో నూటొక్క శివలింగాలను భుజాలమీద మోసుకుంటూ  రామచంద్రుని ముందు నేలకు దిగాడు ఆంజనేయుడు.
                      

            
                                      ఆలయశిఖరం

          పరిసరాలను చూచి, పరిస్థితిని అర్థంచేసుకున్నాడు మారుతి. తాను పడిన శ్రమంతా వృథా అయిందని అలిగి, బాధతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన  చెల్లాచెదరుగా విసిరేశాడు. ( ఆ శివలింగాలే ఈనాడు కొండమీద    ఆలయ ప్రాంగణం వెలుపల దర్శనమిస్తుంటాయి) . మారుతి చేష్టలను చూచి చిరునవ్వు తో అనుగ్రహించాడు సీతా మనోభిరాముడు.  తన భక్తుల మనోభవాలను మన్నించగల మహనీయుడు కదా  మన శ్రీరాముడు. మారుతిని చెంతకు పిలిచి ఇలా అన్నాడు.     
                    
                    

                  
                                              నాగ దేవత ఆలయం వద్ద ఆంజనేయుడు  
          
        “ ఆలయం లోని ఈశ్వర దర్శనానికంటే ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను, నిన్ను భక్తులు దర్శిస్తారని , ఆ తరువాతే శ్రీ రామలింగేశ్వరుని దర్శిస్తారని వరమిచ్చాడు.  అంతే కాదు. మారుతి తెచ్చిన శివలింగాల్లో ఒక దానిని  ప్రధాన ఆలయానికి  ఎడమవైపు కొద్దిదూరం లో శ్రీ రామలింగేశ్వరునికి అభిముఖం గా ప్రతిష్ఠించాడు. (ఆశివలింగాన్నే శ్రీమారుతి కాశీవిశ్వేశ్వరుడు గా భక్తులు సేవించు కుంటున్నారు.) . అంతే కాకుండా ఇక నుండి ఈ కొండ కేసరి గిరి గా పిలువబడుతుందని కూడ అనుగ్రహించాడు ఆంజనేయుని శ్రీరామచంద్రుడు.   కేసరి ఆంజనేయుని తండ్రి కదా.!  ఆనాటి నుండి ఆ పేరు తోనే  ఈ కొండ కేసరి గిరి>  కీసర గిరి >కీసర> కీసరగుట్ట గా వ్యవహరించబడుతోంది. ఇదంతా స్వామి తనను అనుగ్రహించడానికి చేసిన పనే నని తెలియని వాడు కాదు గదా మన నవ వ్యాకరణ పండితుడు, జ్ఞాన గుణ సాగరుడైన హనుమంతుడు. అందుకే వినయంగా చేతులు జోడించి, స్వామి ముందు నిలబడి పోయాడు భక్తాంజనేయుడై.
                          

                                  శ్రీ మారుతి కాశీవిశ్వేశ్వరుడు
              
             ప్రథాన ఆలయం పశ్చిమాభిముఖం గా ఉంటుంది.ఇందలి ఫ్రథాన దైవం శ్రీ రామలింగేశ్వరుడు. ఈశ్వర ప్రసాదితమై , శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడుటవలన ఇది స్వయంభూలింగమై పూజలందుకుంటోంది. ప్రథానాలయం ముఖమండప, అంత్రాలయ, గర్భాలయాలు గా నిర్మించబడింది. మహామండపాన్ని  ఇటీవల నిర్మించారు.

                           మహామండప దృశ్యం
            
        
     
  ******** (ఈ ఆలయ పూర్తి  దృశ్యాలను you tube లో  నాచే  చేర్చబడిన "  Keesaragutta Sri Bhavani Rama lingeswara Swamy Darsanam part -1 & 2"    అని  Login  చేయడం ద్వారా చూడవచ్చు)

              ముఖ మండపంలో శ్రీస్వామి వారికి కుడి ఎడమలుగా రెండు ఉపాలయాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న ఉపాలయం లో పార్వతీదేవి, ఎడమవైపు పాలయం లో శివగంగాదేవి దర్శనమిస్తారు. ముఖమండపం లో స్వామికి కుడివైవున ఉన్న వేదికపైన ఆంజనేయుడు, వినాయకుడు, శివలింగము, ఎడమవైపున ఉన్నవేదిక పైన  వల్లీ దేవసేనా సమేత కుమారస్వామి కొలువుతీరి ఉన్నారు.
              

              
                           ఒక శిథిలమండపం లో శివుడు
    
                  థ్వజస్థంభము చెంత కాలభైరవమూర్తి ని మనం సేవించుకోవచ్చు.  శ్రీ స్వామికి ఎదురుగా భక్తులు  ఇచ్చేముడుపులను కాపలాకాస్తూ, ప్రభువు ఆజ్ఞ కు దివారాత్రాలు ఎదురుచూసే నందీశ్వరుడు ప్రత్యేకమండపం లో   గంభీరముద్రలో దర్శనమిస్తాడు. కోరికలు తీర్చే తండ్రి గా భక్తులు ఈ స్వామిని సేవిస్తారు. రాహుకేతు పూజలు ఇక్కడ ప్రత్యేకం. శ్రీ రాముని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు గా ఈయన  శ్రీ రామలింగేశ్వరుడైనాడు.
                   
     
       

                              అక్కన్న-మాదన్న ఆలయాల థ్వజస్థంభము
           
          ప్రదక్షిణ మార్గం చూసుకొని, శ్రీ స్వామివారి ఎడమవైపుకు రాగానే కొంచెం  దూరంలో శ్రీ మారుతి కాశీవిశ్వేశ్వరాలయం   ఆహ్వానం పలుకుతుంది.  ఆ స్వామిని దర్శించుకొని, కొద్దిగా ఎడమకు నడిస్తే  ప్రత్యేకప్రాంగణంలో అక్కన్న- మాదన్న ఆలయాలు కనిపిస్తాయి. (అక్కన్న-మాదన్నలు  గోల్కొండ(గొల్లకొండ) సంస్థానం లో మంత్రులు.)
                   
    


                    ఈ ఆలయాల ముందున్న  సహజ రమణీయ దృశ్యం                       

              ఒకే కప్పుక్రింద నిర్మించబడిన మూడు ఆలయాలు ఇవి.  వీటికి క్రీ.శ 2005 లో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి.  గర్భాలయం,అంత్రాలయం, వేరువేరుగా ముఖమండపం  కలిపి నిర్మాణం జరిగింది. ఈ ఆలయాల్లో మథ్యగుడి లో శివపంచాయతనాన్ని, వారికి కుడివైపు శ్రీలక్ష్మీనరసింహస్వామిని, ఎడమవైపు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తిని ప్రతిష్ఠించారు. ముఖమండపం లో చిన్నమందిరాలలో  వివిథ దేవీ, దేవతా మూర్తుల విగ్రహాలను  మనం చూడవచ్చు.
         

                                                                 శ్రీ ఆంజనేయుడు


           
        


        శ్రీ విఘ్నేశ్వరుడు
  శ్రీ సరస్వతీదేవి






శ్రీ లక్ష్మీదేవి

  

 ఈ ఆలయాలకు వెనుక వైపు నాగదేవత ఆలయం నిర్మించబడింది. సంతానార్థులైన సువాసినులు ఇక్కడ ప్రత్యేక పూజలు, ముడుపులు చెల్లిస్తారు. సంతానవతులైన అనంతరం మొక్కులు తీర్చుకుంటారు. 

                                                       శ్రీ  నాగదేవత

            ఆలయానికి ఎదురుగా మరొక ఆంజనేయ ఫలకం కన్పిస్తుంది. దీని ప్రక్కనే  అక్కన్న-మాదన్నలు వేయించింది గా చెపుతున్న భక్తాంజనేయ ముద్ర కల్గిన ఏకశిలా జయస్థంభాన్ని చూడవచ్చు.
                  
       
   
                                     ఏకశిలా జయస్థంభం                    

                ఆలయ ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసినా శివలింగాలే కన్పిస్తాయి. శివరాత్రి పర్వదినాల్లో భక్తులు  వేలకొలది ఈ క్షేత్రానికి తరలివస్తారు.  ఆనాడు భక్తులు ఎవరికి వారు  ఒక్కొక్క శివలింగాన్ని ఎన్నుకొని స్వహస్తాలతో ఆ స్వామికి అభిషేకం చేసి, విభూతి పూసి.బొట్టుపెట్టి, పూమాలలు వేసి, టెంకాయకొట్టి   పూజించేటప్పుడు వాళ్ల ముఖాల్లో కన్పించే ఆనందం అనిర్వచనీయమైంది.
                          

      
             కొండమీద  కొలువు తీరిన   శివలింగాలు 

              ఆలయానికి అభిముఖం గా దూరం గా కొండమీద మరొక భక్తాంజనేయ మందిరం కన్పిస్తుంది.  దీనికి వెనుక భాగం లో పన్నెండడుగుల అడుగుల ఎత్తైన వేదికపై ముకుళితహస్తుడైన  మరొక శ్రీ ఆంజనేయమూర్తి స్వామికి అభిముఖం గా దర్శనమిస్తాడు.
                          
       

            ఆం.ప్ర. పురావస్తుశాఖ వారు  ఈ కొండమీద జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రదేశ పవిత్రత ను ఇనుమడింప చేసే విశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. క్రీ.శ  4-5 శతాబ్దాల్లో ఆంథ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధుడైన రెండవమాథవవర్మ రాజథాని ఇంద్రపాలనగరము ఇదేననడానికి ఆథారాలు లభించాయి. ఈ మహారాజు వేయికి పైగా యజ్ఞ యాగాదులను నిర్వహించిన మహాపురుషుడు. పదకొండు అశ్వమేథ యాగాలను చేసి, ఆంథ్రసామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింప చేసిన మహావీరుడు.
                             

           ఆలయసమీపం లో చారిత్రక సాక్ష్యాలు


     
   ఈ ప్రదేశం లో జరిపిన త్రవ్వకాలలో  ఈ కొండచుట్టు విస్తృతపరిథిలో పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించిన కోటగోడ పునాదులు, రాజప్రాసాదం, పూజామందిరాలు,వివిథ కట్టడాలు బయటపడ్డాయి. శివలింగాలు, నంది, గణేశుడు మొదలైన దేవతా ప్రతిమలు. పాత్రలు, నాణేలు, పూసలు మొదలైనవి వెలుగుచూశాయి.  ఇప్పటికీ  పరిక్షగా చూస్తే అక్కడక్కడ కొన్ని శిథిల కట్టడాలు మనకు కన్పిస్తున్నాయి    
                      
       



                  చారిత్రక ప్రదేశం నుండి ఆలయదృశ్యం




                       ఈ శిథిలనిర్మాణంలో ఇటుకసైజును గమనించండి

        ఈ పవిత్రత ను గమనించే ఈ సంవత్సరం  అనగా 2013 –ఏప్రియల్-13-24 వరకు  అతిరాత్ర యాగం  ఈ చారిత్రక విశేషాలకు సమీపం లోనే అతి ధర్మ,కర్మ నిష్టతో నిర్వహించబడింది. ఆ  నాటి గుర్తులు ఇప్పటికీ అక్కడ మిగిలే ఉన్నాయి. ఇటువంటి పుణ్యభూమి ఈ కీసరగుట్ట. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలకు జాతర గా జనం వస్తారు. ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది.
                

       

                  
                                    శ్రీ స్వామి వారి కళ్యాణమండపం
            
       ఆలయం వరకు చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది  హైద్రాబాద్ నుండి 40 కి.మీ దూరం లో ఉన్నఈ ఆలయానికి ఇ.సి.ఐల్ నుండి, నగరం లో వివిథ ప్రాంతాలనుండి రవాణాసౌకర్యాలున్నాయి. కొండమీద  భోజన, ఫలహార , తేనీరు కు  హోటల్సు ఉన్నాయి.  అన్న దానసత్రాలు కూడ కొన్ని ఉన్నాయి. చక్కని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణం లో వెలసిన శ్రీ రామలింగేశ్వరుని కీసరగుట్ట ఛూడదగిన దివ్యక్షేత్రం.











********   హరహర మహాదేవ   శంభోశంకర***************************



                        

No comments:

Post a Comment