Sunday 23 December 2012

నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం


               
                Nemali Sri VenugopalaSwamy Aalayam.


                     నెమలి   శ్రీ     వేణుగోపాల స్వామి ఆలయం.
                  नेमलि श्री वेणुगोपालस्वामि आलयम्.
                 నెమలి క్షేత్రం వేణుగోపాలుని నిలయం.ఇచ్చటి వేణుగోపాలుడు ముగ్ధమోహన సౌందర్యమూర్తి. వేణుగానలోలునిఁ గన రెండుకనులు చాలవులే "అన్నపలుకు అక్షర సత్యమనిపిస్తుంది.
                            
                          స్వామి వారి దివ్యరూపం
               త్రిభంగి ఆకృతి లో  వ్యత్యస్త పాదారవిందుడై (అనగా ఎడమ పాదము పై నిలబడి ,కుడిపాదమును ఎడమపాదము పైనుండి మునివేళ్ల పై నిలిపి) సన్నని నడుము,శిరస్సు ను చక్కని వంపులతో  విశాలమైన నేత్రాలతో, తిరు నామం  తో ,  మౌళి పై పింఛం తో, చల్లని చూపు తో ,చిరునవ్వు లు చిందిస్తూ,వయ్యారం గా నిలిచి, మురళి వాయించుచున్నభంగిమ లో నున్న ఆ నల్లనయ్య భువన మోహనరూపం  గర్భాలయం లో  కనులముందు కన్పించ గానే నల్లని వాడు పద్మనయనంబుల వాడు , కృపారసంబు పై జల్లెడి వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు ,నవ్వు రాజిల్లెడి మోమువాడు   అన్న పోతన గారి పద్యం  రూపుకట్టి  కనుల ముందు  సాక్షాత్కరిస్తుంది. నిజం గా ఆ  భువన మోహన రూపుని కనులముందు కాంచి ఘంటం కదిలించిన ఆ భక్త కవి ఎంత అదృష్ట వంతు డో కదా అని పిస్తోంది
      
                              ఆలయ  ముఖద్వారం
                మూడడుగుల ఎత్తుకలిగి, ముద్దులోలికే రూపం తో, పాదాలచెంత  వింజామరలు  వీచు గోపికలు, గోవులతో ఉన్న  ఏకశిలా విగ్రహమైన ఈ మూర్తి స్వయంభువు గా వెలిసి నట్లు స్దలపురాణం చెపుతోంది.  విగ్రహ మంతా సాలగ్రామ శిల అవ్వడం వలన నీలము,నలుపు కలసిన  విచిత్ర కాంతి  తో ప్రకాశిస్తూ ఉంటుంది.
          
                                                             ఆలయ గాలిగోపురం

        స్థల పురాణం   . :----       ద్వాపరం లో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ , తన అవతారాన్ని చాలిస్తూ, తన నెమలి పింఛాన్ని  ఇచ్చట వదిలి వెళ్లాడని , ఆ ప్రదేశం లోనే  స్వామి భూగర్భం లో  ఉండేవాడని, ఎందరో మహర్షులు ఈయనను సేవించి ,తరించారని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని నెమలి గ్రామం గా పిలుస్తున్నారు.
                  మరొక కధనాన్ని------ అనుసరించి,    
                         అదృశ్యో వ్యక్త రూపశ్చ అని కదా విష్ణుసహస్రనామము. ఈ స్వామి వ్యక్త రూపుడైన విధము ఈ విషయాన్నే నిరూపిస్తోంది.
                     ఇంతకు పూర్వము ఈ ప్రాంతం లో తపస్సు చేసుకున్న మహర్షులు , మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలి వెడుతూ,  ఈ సుందర సుకుమారమూర్తి ని  భూగృహం లో భద్రపరచి వెళ్లి వుంటారని, స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తున్నారు.
                      
                 
                               శ్రీ వేణుగోపాలుని దివ్య మంగళ విగ్రహం

            
               ఆ రోజు 23.3.1953 వ తేది శ్రీ రామనవమి .  ఊరంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో  మునిగి వుంది. అదే సమయం లో ఒకరైతు  పొలం లోకి మేరువు తోలించు కుంటున్నాడు. పలుగు వేసిన మొదటి దెబ్బ కే ఖంగుమన్న శబ్దం వచ్చింది.  చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు. మళ్లీ అదే ధ్వని. ఈ సారి రెండు ఘాతాల మధ్య పలుగు వేయబోవు నంతలో  మిఱుమిట్లు గొలిపే ఒక మెరుపు వెలువడింది. దానితో  ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపర్యలు చేయగా, కోలుకున్నాడు కాని అతని చూపు పోయింది. మిగిలిన వారందరు అక్కడ త్రవ్వి చూడగా స్వామి   వారి విగ్రహము,  ప్రక్కనే హోమగుండము,ప్రమిదలు.ఒక శంఖము,మొదలైనవి లభించినవి. అదృశ్య రూపం లో ఉన్నస్వామి ఈ విధం గా వ్యక్త రూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న  యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శన మిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశం లోనే ఆలయ నిర్మాణం గావించారు.
                    
                                   గో శాల ప్రవేశ ద్వారం
                   
              చుట్టుప్రక్కల అరవై గ్రామాల ప్రజల్లో ఎంతోమంది స్వామి తమకు కలలో కన్పించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయాన్ని నిర్మించి, ఉత్తరాభిముఖం గా వెలసిన స్వామిని తూర్పు ముఖంగా ప్రతిష్టించ ప్రయత్నించారు. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి, వేసిన పందిళ్లు,  చేసిన ఏర్పాట్లు ఛిన్నాభిన్నమైనాయి. చేసిన తప్పును తెలిసి కొని, స్వామిని ఉత్తరాభిముఖుని చేయడం తో సామాన్య పరిస్ధితి ఏర్పడిందిట. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికీ  ఉత్తర ముఖం గానే ఉంటుంది. 6.2.1957 లో స్వామి ని ఇప్పుడున్న ఆలయం లో ప్రతిష్టించారు.
      
         
        

                  శ్రీ  స్వామి వారి కుడివైపు ఉపాలయం లో శ్రీ రాజ్యలక్ష్మీ దేవి, ఎడమవైపున్న ఉపాలయం లో శ్రీ గోదాదేవి (ఆండాళ్) కొలువు తీరి ఉన్నారు.
            ఆలయ ప్రత్యేకత.: -----                    శ్రీ వేణుగోపాల స్వామి మహిమలు కొల్లలుగా చెప్పుకుంటున్నారు. స్వామి వారి పై గునపము వేయబోయి కళ్లు పోగొట్టుకున్న కఠారు వెంకటేశ్వర్లు  తల్లి దండ్రులు స్వామి వారి ని పరి పరి విధాల వేడుకొని, తమ శక్తి కొలది  వెండి కడియాలు చేయించగలమని మొక్కుకున్న వెంటనే అతనికి కళ్లు కన్పించసాగాయి. ఆ కుటుంబము  జీవితాంతము స్వామి సేవ లోనే తరించారు. ఆ కడియాలు ఇప్పటికీ స్వామి వారి  కాళ్లకు అలంకరిస్తూనే ఉన్నారు.
                 
                    ఆలయవిమానం పై కొలువు తీరిన రాజ్యలక్ష్మీ దేవి              
             
                స్వామి వారి అనుగ్రహం తో ఎందరో కుంటివారు నడవ గలిగినట్లు,మూగవారు మాట్లాడ గలిగినట్లు,సంతానం లేని వారు  పు త్రవతులైనట్టు, కుష్టుమొదలైన వ్యాధులు   బాగైనట్లు ఊరిపేర్లు, చిరునామా లతో సహా స్ధలపురాణం  లో వ్రాయబడి ఉంది.
         
               ఆలయ విమాన,ధ్వజస్ధంభ, గోపుర దృశ్యం


  ప్రత్యేక ఉత్సవాలు. :------  శ్రీ స్వామి వారికి   ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి రోజున స్వామి  అవతరించిన రోజు కావున అభిషేకము మొదలైన ప్రత్యేక పూజలు, తొలి ఏకాదశి రోజున ఏకాహము, శ్రీ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టుట, గ్రామోత్సవము,విజయ దశమి  శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, దసరా రోజున శమీపూజ జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున శేషవాహనముపై ఉత్తర ద్వార దర్శనము, అనంరము తిరువీథుల గ్రామోత్సవము, నిర్వహిస్తారు.
          
                            పూలవనం లో గోపికలు, శ్రీకృష్ణుడు

               ధనుర్మాసం  నెలరోజులు శ్రీ ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు,  సంక్రాంతి రోజున గ్రామోత్సవము, అనంతరము గోదాకల్యాణము నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి రోజున  సహస్ర కలశ స్నపన, లక్షతులసి పూజామఙోత్సవము మూడు రోజులు జరుగుతాయి. అఖండ దీపారాధన, ఏకనామము ఉంటాయి.
                 ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియ వరకు శ్రీ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రాత్రి 10 గంటలకు స్వామి వారి తిరుక్కళ్యాణమహోత్సవము జరుగుతుంది. ఫై అన్ని  కార్యక్రమాల్లోను చుట్టు ప్రక్కల  గ్రామాల ప్రజలే కాక దూర ప్రాంతాల నుండి కూడ వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
             
                                     కళ్యాణమండపం

               ఆలయ పర్యవేక్షణ లో  గోశాల,  నిత్యాన్నదాన పథకం నడప బడుతోంది.ప్రతి సోమ  శుక్ర వారాలు,పునర్వసు నక్షత్రం రోజున,  శుద్ధఏకాదశి, మరియు పర్వదినాలలో స్వామివారికి   ఉ .6.00 గం.లకు విశేష అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమి కి  స్వామి వారికి కళ్యాణోత్సవము నిర్వహిస్తారు.
 రవాణా సౌకర్యాలు.:------  మధిర నుండి 15కి.మీ  దూరం లో  ఈ క్షేత్రం ఉంది. తిరువూరు, మథిర నుండి ఆర్టీసీ బస్సులున్నాయి.కాని స్వంతవాహనం మీద ప్రయాణం సులభం. గ్రామీణ  కాఫీ హోటల్స్  ఉంటాయి. ఆలయం లోపల  విశాల మండపం విశ్రాంతి తీసుకోవడానికి వీలుగానే ఉంటుంది.

*****************ఓం నమో భగవతే వాసుదేవాయ ****************************************

No comments:

Post a Comment