Tuesday 18 December 2012

హంసలదీవి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం


                                      హంసలదీవి శ్రీ వేణుగోపాలస్వామి  ఆలయం.
       
                  Hamsaladeevi Sri Venugopala Swamy Aalayam.
              

           हंसलदीवि श्री वेणुगोपालस्वामि आलयम्.

                           హంసలదీవి కృష్ణానది సముద్రం లో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం. ఈ పవిత్ర సాగర సంగమ ప్రదేశం లో స్నానం చేస్తే కాకులు కూడ హంసలు గా మారి పోతాయన్న  కథనం ఈ ప్రాంతం లో ప్రబలంగా విన్పిస్తోంది.

                      
                          ఆలయ గాలిగోపురం
           
         స్ధలపురాణం:-------. పూర్వకాలం లో కలుషహారిణి యైన గంగామాత  తనలో స్నానం చేసిన వారందరి పాపాలను  నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకిలాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశ తో ఉద్భవించిన  కృష్ణానది సముద్రం లో  కలిసే సంగమ ప్రదేశం లో కాకి రూపం లో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాపతమస్సు ను కాకివలె ధరించి కృష్ణా సాగరసంగమ పవిత్ర ప్రదే శం లో మునిగింది. పాపప్రక్షాళన  పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి .
            
    
           ఎందరో మునులు ఈ ప్రాంతం లో  తపస్సు చేసుకుంటూ  సంచరించేవారని ,అటువంటి పరమహంస లు సంచరించిన  ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి  అన్నారని ఒక కథనం.

              
              శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి వారు

 ఆలయప్రత్యేకత    :-----          ఈ తీర్ధక్షేత్రం  లో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి.  ఈ ఆలయం ఒక రాత్రి లో దేవతలు నిర్మించింది గా  స్ధలపురాణం.  దేవాలయ నిర్మాణం పూర్తయి,  గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని  దేవతలు వెళ్లి పోయారని ,అందువల్ల అది సంపూర్తి గా మిగిలి పోయిందని చెప్పేవారు.  ఆ తరువాత దానిని ఐదంతస్తుల గాలిగోపురం గా నిర్మించారు .  1977 లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు దీన్ని ప్రారంభించారు.
                       మౌర్య చక్రవర్తుల కాలం లో ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని  చరిత్ర కారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్ధంభాలమీద అనేక శాసనాలు మనకు కన్పిస్తాయి.
                  శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రాదుర్భావాన్ని గూర్చి కథ ఒకటి  జనశృతి గా ప్రాచుర్యం లో ఉంది.
                   
             
                                
                             ఆలయ శిఖర దర్శనం

              పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దు లో ఉండేవాడట.  మేతమేసిన ఆవులు ఆపుట్ట దగ్గరకు వచ్చి స్వామి కి ఫుట్టలోకి పాలు కార్చేవట. సాయంత్రం ఆవులు పాలు ఇవ్వకపోవడం తో అనుమానమొచ్చి, మాటువేసి కారణం కనిపెట్టారు గోపాలురు. ఆవులు పుట్ట పైకి వెళ్లి పాలుకార్చడం చూచి, కోపం ఆపుకోలేక,చెత్తంతా పోగు చేసి పుట్టమీద  వేసి నిప్పుపెట్టారట.
                    
        
                             గుడి వెనుక ఆంజనేయవిగ్రహం
            
             పుట్ట లోని స్వామికి  వేడితగలడం , ఇంతలో ఒకరికి పూనకం వచ్చి స్వామి ఉన్న విషయాన్ని చెప్పడం,  క్షమాభిక్ష కోరుకున్న భక్తులు స్వామివారి  విగ్రహాన్ని ప్రతిష్టించి  పూజలు  నిర్వహించడం జరిగి పొయింది .
       
          
             
                             గుడి ముందు  గరుడాళ్వారు

              కాలాంతరం లో ఆ విగ్ర హం భిన్నమై పోగా, స్వామి గ్రామస్తులకు కలలో కన్పించి కాకరపఱ్ఱు మునసబు గారి దొడ్లో  ఉన్నానని చెప్పడం తో గ్రామస్తులు వెళ్లి ఊరేగింపు గా స్వామి వారిని తీసుకొచ్చి ప్రతిష్టించారట. ఆవిగ్రహమే ఇప్పుడు పూజలందుకుంటున్నది. భిన్నమైన విగ్రహం ఇప్పటి క్కూడ   అలంకరించబడి మూలవిరాట్   ప్రక్కనే మనకు దర్శనమిస్తోంది.
            
                                   ఆలయ ధ్వజస్ధంభం
             
       ఈ ఆలయం లో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదేశం లో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖం గా నూరేళ్ళు  జీవిస్తారనేది భక్తుల విశ్వాసం.
   ఈ ఆలయం లో నిద్ర చేస్తే  సంతానం లేని వారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు.

                
                            సరిగంగ స్నానాలు   
               
        ఆలయం చుట్టు ఉన్న కుడ్యాలలో ఎన్నో అందమైన శిల్పాలు కొలువు తీరి ఉన్నాయి. ఆలయానికి ఈశాన్యం లో పురాతన కట్టుబడి తో కళ్యాణమండపం కన్పిస్తుంది.
                             
                        కుడ్య చిత్రం కాళీయమర్ధనము

             ప్రత్యేక ఉత్సవాలు.;------       మాఘపౌర్ణమి కి స్వామి వారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు.  కార్తీక మాసం లో  సముద్ర స్నానం చేసిన వేలాది మంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.
   ప్రత్యేకత లు :----          ఈ ఆలయం  తుఫానులు, ఉప్పెన లనుండి గ్రామస్తులను కాపాడుతూ వస్తోంది. 1864, 1977 ఉప్పెన ల నుండి  ఎందరో గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘన చరిత్ర ఈ ఆలయానిది. సుమారు 6,7 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే యైనా ఉప్పెనలకు చెక్కుచెదరకుండా నిలబడటమే కాకుండా, కొన్నివందల ప్రాణాలను నిలబట్టిన ఘనత ఈ ఆలయ సొంతం. ఇటువంటి   గట్టి కట్టడాన్ని నిర్మించిన ఆ శిల్పులను ఒక్కసారి గుర్తుచేసుకొని జోహార్లు అర్పించాలి.
              శ్రీజనార్ధనస్వామి, శ్రీ రాజ్యలక్ష్మి , శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉపాలయాలు కూడ ఈ ఆలయం లో ఉన్నాయి.
       ఈ ఆలయానికి   సమీపం లోనే  బాలాత్రిపురసుందరి,అన్నపూర్ణ సమేత    కాశీ విశ్వేశ్వరాలయం కూడ ఉంది .
              
      
           ఆలయ ప్రాంగణం లో అక్కడక్కడ పడి ఉన్న కొన్ని శిథిల శిల్పాలు చెదిరిన మన చరిత్ర కు సజీవ సాక్ష్యాలు గా  కనబడతాయి.     



                                  శిథిల శిల్పాలు

  రవాణాసౌకర్యాలు :-----               కృష్ణాజిల్లా కోడూరునుండి 15 కి.మీ దూరం లోను,మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను  బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.


...................   జయ కృష్ణ ముకుంద మురారి .......................................  ***************************                           

No comments:

Post a Comment