Showing posts with label dwajastambham. Show all posts
Showing posts with label dwajastambham. Show all posts

Saturday, 1 February 2014

బొంతపల్లి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం

           

  Bontapalli Sri Bhadrakali sameta VeerabhadraSwamy Aalayam.


 बॊंतपल्लि श्री भद्रकाळी समेत वीरभद्रस्वामि आलयम्.


                            బొంతపల్లి   శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం
                

                         మెదక్ జిల్లా  జిన్నారం మండలం లోని బొంతపల్లి లో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువు తీరి ఉన్నాడు   హైదరాబాద్ నుండి 40 కి.మీ దూరం లోను, మెదక్ నుండి 68 కి.మీ దూరం లోను ఈ క్షేత్రం అలరారుతోంది. ఆధునిక కాలం లో  ఈ ఆలయానికి  సాధారణ భక్తులు విరివిగా వస్తున్నప్పటికీ  తొలినాళ్ల  లో మాత్రం వీరశైవులు, లింగథారులు, అనంతరం ఆర్య వైశ్యులు  ఈ వీరభద్రుని పరదైవతంగా కొలిచి,తరించినట్లు, వారి పాలిట ఈ క్షేత్రం  పుణ్య ధామం గా విలసిల్లినట్లు  తెలుస్తోంది. ఆలయ ప్రధానద్వారం ముందు దర్శనమిచ్చే నిప్పులగుండం ఇక్కడ జరిగే వీరాచార సాంప్రదాయానికి ప్రతీక గా కన్పిస్తోంది.
              
                                          దీపపు కాంతి లో తోరణద్వారం
                                             
                      స్థలపురాణం :-                                   పూర్వకాలం లో ఈ ఆలయం  చాల చిన్నది గా ఉండేదట. ఒక రాత్రి సమయం లో ఓ గొఱ్ఱెలకాపరి గొంగళి భుజాన సర్దుకుంటూ  ఆలయం ముందు నుంచి వెడుతున్నాడు. ఇంతలో ఎవరో తనను పిలిచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు గొఱ్ఱెల కాపరి. ఎదురుగా వీరభద్రస్వామి దివ్యమూర్తి. భయపడిపోయాడు కాపరి. నెమ్మదిగా పల్కరించాడు స్వామి. అతని లోని భయాన్ని పోగొట్టాడు.  మాటల్లోకి దించాడు. నాకు ఇక్కడ నచ్చలేదు. వేరేచోటుకు వెళ్ళాలనుకుంటున్నాను .కాబట్టి నన్ను    నీ భుజాలమీద ఎక్కించుకొని నువ్వు అలసిపోయినంతదూరం తీసుకెళ్లి అక్కడ దించమని అడిగాడట వీరభద్రుడు.. అది ఆ కాపరి చేసుకున్న పుణ్యఫలం అనుకోవాలి.


                                                                  ఆలయ రాజ గోపురం                     
                       
                    ఆ గొఱ్ఱెల కాపరి   వీరభద్రస్వామి చెప్పినట్లే స్వామిని భుజాలమీద ఎక్కించుకొని కొన్ని మైళ్లు నడిచి ఇప్పుడు ఆలయమున్నప్రదేశానికి వచ్చేసరికి అలసిపోయి వీరభద్రుని క్రిందకు దించాడు.  ఆ విధంగా ఆ కాపరిని అనుగ్రహించారు వీరభద్రస్వామి.  

                                 తనను భూమి మీదకు దించి, సొక్కుతీర్చుకుంటున్న కాపరి తో వీరభద్రస్వామి  ఇక నీవు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లు.  వెనక్కి తిరిగితే  శిల గా మారిపోతావని చెప్పాడు.( కోటప్పకొండ స్థలపురాణం లో  ఆనందవల్లి (గొల్లభామ ) వృత్తాంతం లో కూడ ఇదే మాట అన్నాడు  ఈశ్వరుడు). పురాణాలలో ముఖ్యం గా స్థల పురాణాలలో ఇటువంటి గాథలు కోకొల్లలు గా విన్పిస్తాయి.             
                                           
                                                 ఆలయం ఎదురు గా శంకరుడు
                 
                                   లోతుగా ఆలోచిస్తే ఇక్కడొక చిద్రహస్యం దాగి ఉందని పిస్తుంది. ఎందుకంటే  ఆ  ఈశ్వరుని సుందర మనోహరము , పరమాద్భుతమైన రూపాన్ని చూసిన తర్వాత ఇక ఐహిక వాంఛల మీద మక్కువ ఉండదు. ఇంకొక రూపాన్ని చూడాలనే ఆతృత ఉండదు. ఒక్కమాట లో చెప్పాలంటే ఆ  స్వామి దివ్యరూపాన్ని దర్శించిన తరువాత మరొక ఆలోచనే ఉండదు. ఆ స్థితి లో  మహనీయుల సంగతి వేరు గాని సామాన్యుడు మాత్రం సామాన్యం గా మనజాలడు. మతిభ్రమణం తో  పిచ్చివాడన్నా అయిపోతాడు. మ్రాన్పడి పోయి స్థాణువు గా ( శిల )నన్నా  మారిపోతాడు.

                     నిండుసభలో శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించిన జాత్యంథుడైన ధృతరాష్ట్రుడు భగవానుని దివ్యదర్శనానంతరం  తిరిగి అంథత్వాన్నే కోరుకున్నాడంటే కనులతో త్రాగి మది లో నింపుకున్న ఆ రూపాన్ని ఎంత భద్రంగా పదిల పరుచు కోవాలని ఆయన కోరుకున్నాడో   అర్ధం చేసుకోవచ్చు.  యోగులు, మహర్షులు,   సంయమీంద్రులు మాత్రమే ఆ  మహాద్భుత రూపాన్ని దర్శించి . మనసులో బంధించి,  పున : పున : దర్శిస్తూ అమందానందసందోహ కందళిత స్వాంతులై, అనిర్వచనీయానంద సాగరం లో తేలియాడగలరు.  అందుకే భీష్మ పితామహుడు  చిన్మయరూపుడు శ్రీకృష్ణుని  విశ్వరూపాన్ని దర్శించి,  సేవించి, తలంచి, వేచి తరించాడు.

శ్రీ వీరభద్రుని  దివ్యదర్శనం
                                 
తన కన్నయ్య నోటిలో సమస్త విశ్వంభరా వలయాన్ని సందర్శించిన యశోదామాత స్పృహ కోల్పోయింది. కలయో ! వైష్ణవ మాయయో ! ఇతర సంకల్పార్ధమో !  సత్యమో ? ఎరుగన్నేరక ఉన్న దానను నే యశోదాదేవి కానో  ?” అనే విచికిత్స కు లోనైంది. అనంతరం విష్ణుమాయ తో అంతా సర్దుకుపోయింది. కురుక్షేత్ర రణక్షేత్రం  లో  శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం  చేసిన అర్జునుని మన: స్థితి ఎలా ఉందో భగవద్గీత  మనకు చెపుతుంది.. మహాయోగి పుంగవుడు, గురువులకే గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రతిరోజు కాళీమాత ను దర్శిస్తూ ఆవిడ తో సంభాషిస్తూ, ఆ ధ్యాస లోనే,  ఆ ధ్యానం లో ఉండిపోయేవాడు. ఆయనను పిచ్చివాడని  ఆనాటి జనం పిలిచేవారట.

                              ఆలయదృశ్యాలను you tube  లో కూడ చూడవచ్చు.

                   ఉపాసనలు, అనుష్ఠానాలు అంటూ హరిద్వార్, హృషీకేశ్ వెళ్లిన కొంతమంది తమలో సంభవించే తరంగ సంచలనాలను, తట్టుకోలేక కవులు గా మిగిలిపోయిన వారు,  మతిభ్రష్టులైన వారు  ఉన్నారని చెపుతుంటారు..

                                         శాస్త్రేషు హీనాశ్చ కవయో భవంతి
                                          కవిత్వ హీనాశ్చ పురాణభట్టా :
                                          పురాణ హీనాశ్చ కృషీవలా స్యు :
                                            భ్రష్టారథా  భాగవతా భవన్తి

                             అనేది ప్రాచీనోక్తి. పురాణేతిహాసాల్లోకి చూస్తే ఇటువంటి గాథలు మనకు కొల్లలు గా కనిపిస్తాయి. ఆ భగవానుని దివ్యసుందర విగ్రహాన్ని  దర్శించిన   కన్ను లతో   మరల ఈ   లోకాన్ని చూడటానికి ఇష్టపడక పోవడమే అన్నింటికీ మూలకారణం.

                                   ఆలయ పురోభాగ దృశ్యం        

                             శ్రీ వీరభద్రుని ఆజ్ఞానుసారం తన ఇంటికి బయలుదేరిన  గొఱ్ఱెలకాపరి  కొంతదూరం వెళ్ళి మానవ సంబంధమైన లక్షణం తో ఉత్సుకత ను ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు.  వెంటనే శిల గా మారిపోయాడట.

                                                                     ఆలయ ప్రదక్షిణమార్గం

                    అనంతరం శ్రీ వీరభద్ర స్వామి  ఒక అర్చకునకు కలలో కన్పించాడు. ఆయన గ్రామపెద్దలకు ఆ విషయాన్ని విన్నవించాడు. పెద్దలు పూనుకున్నారు. బొంతపల్లి లో వీరభద్ర స్వామి కి అందమైన ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం శ్రీ స్వామి వారి ఆలయానికి వెనుకభాగం లో భద్రకాళీమాత ఆలయనిర్మాణం చేశారు . శ్రీ స్వామివారి ఆలయం ఇరవైనాలుగుస్థంభాలు గల ముఖమండపం తో  విశాలం గా  నిర్మించబడింది.  ఈ ఆలయం కాకతీయుల కాలం లో నిర్మించబడిందని జనశృతి. కాని అందుకు సాక్ష్యం గాఎటువంటి శాసనాద్యాధారాలు లభించడం లేదు.

                                                             ఆలయవిమాన దర్శనం

                  ఇంకొక గాథ ననుసరించి శివాగ్రహం జటలు విదిలించింది.  వీరభద్రుని ప్రాదుర్భావం , దక్షయజ్ఞ విధ్వంసం పూర్తయ్యింది. ఆ సమయం లో  ఆ దక్ష ప్రజాపతి అనుచరులు  ప్రాణాలు అఱచేత  పెట్టుకొని ,భయం తో పారిపోయి వచ్చి, భూలోకం లోని దండకారణ్యప్రాంతంలో మంజీర, ముచికుంద (మూసీనది )  నదుల  మధ్యభాగం లోకి వచ్చి స్థిరపడ్డారు. ఆ విధం గా స్థిరపడిన వారు అక్కడ స్థానికం గా ఉన్న శివభక్తులను హింసించ సాగారు . వారి ఆక్రందనలను విని వారిని రక్షించడానికి  మరల  అక్కడకు  చేరుకున్నాడు  వీరభద్రుడు.  దుష్టశిక్షణ పూర్తయ్యింది.   అనంతరం  బొంతవలే దట్టంగా పెరిగిన బిల్వవృక్ష సమూహాలతో శోభాయమానం గా ఉన్న ఆ ప్రదేశం తనకు నచ్చడం మూలంగా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడట వీరభద్రుడు . కాకతీయుల కాలం నాటికే ఈ ఆలయం     ప్రసిధ్ది లో ఉన్నట్లు తెలుస్తోంది .  ఈ స్వామిని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి.

                                             ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం
      
                                ఉత్సవాలు :-       ఫాల్గుణ  శుద్ధ దశమి నాడు  భద్రకాళీ వీరభద్రుల కళ్యాణోత్సవం అంగరంగవైభవం గా నిర్వహిస్తారు. మరునాడు రధోత్సవం కనులపండువు గా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవం లో పాల్గొంటారు. శ్రావణ మాసం లో ప్రతిరోజు శ్రీ స్వామివారి కి  లక్షబిల్వార్చన చేస్తారు.     

                                         


      









                                                           శ్రీ వారి రథం
శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం                                                 

                                           

                                           బొంతపల్లి   లో అనేక పరిశ్రమలు   నెలకొల్పబడ్డాయి. ప్రతి ఆదివారం  ఇక్కడ జరిగే సంత  ఒక ప్రత్యేక ఆకర్షణ .





                                                             
***************************************************** ****************************  

Monday, 15 July 2013

బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం


           Beechupalli Sri Anjaneya Swamy Temple.
        
                          బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం.
               
                  बीचुपल्लि श्री आंजनेयस्वामि आलयम्   
         
             
           మహబూబ్ నగర్ జిల్లా  ఇటిక్యాల మండలం లో కృష్ణానదీ తీరాన వెలసిన ఆంజనేయ క్షేత్రం బీచుపల్లి.    రాష్ట్రం లోని అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ దేవాలయాలలో   ఒకటి గా ప్రఖ్యాతి గాంచిన ఆలయం  ఈ బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం.
                        
               
           
 
                                ఆలయ మార్గ తోరణ ద్వారము
            
                ఈ ఆంజనేయస్వామిని శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెపుతోంది. 16వ శతాబ్దం నుండి ప్రసిద్ధమైన ఈ స్వామిని అనంతర కాలం లో వచ్చిన రాజులు, సంస్థానాథీశులు సేవించి తరించినట్లు చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. గద్వాల సంస్థానాథీశులు ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించుకొనేవారని  చరిత్ర చెపుతోంది.
                       

                  
                      ఆలయ మార్గ  నిర్గమన తోరణ ద్వారము
             
              శ్రీ కృష్ణదేవరాయల వారి గురువు గారైన శ్రీ వ్యాసరాయల వారికి ఒక పవిత్రమైన నియమం ఉండేదట.  అదేమిటంటే వీరు ప్రతిరోజు ఒక ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ చేయక పోతే   నిదురించే వారు కాదట. అంతే కాదు .వీరు ప్రతిష్ఠించే   ప్రతి ఆంజనేయ విగ్రహానికి ఇరువైపుల శంఖ చక్రాలు ఉండటం ఒక ప్రత్యేక లక్షణ మని చరిత్రకారులు గుర్తించారు. ఆంజనేయ విగ్రహానికి  కుడు ఎడమల శంఖ చక్రాలుండటం శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠ గా  గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ స్వామి 16వ శతాబ్దం లోని ప్రతిష్ఠ గా గుర్తించబడింది.
                
  

   
                         ఆలయము ముందున్న రాతి థ్వజస్థంభము
  
                ఒక రోజు  శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి , అక్కడే నిద్రకు ఉపక్రమించిన   శ్రీ వ్యాసరాయల వారికి శ్రీ స్వామి  కలలో కన్పించి రేపు ఉదయం నన్ను దర్శించుకోవడానికి ముందుగా ఎవరు వస్తారో  వారినే  నాకు ప్రతిరోజు పూజలు చేయడానికి నియమించమని ఆదేశించారు. మరుసటి రోజు  ఉదయము ముందుగా దర్శనానికి  ఒక పశువుల కాపరి పశువులను మేపుతూ అటువచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. శ్రీ స్వామి ఆదేశం మేరకు శ్రీ వ్యాసరాయలు అతనినే ఫూజారి గా నియమించారు.
                       

             
                            ఆలయ ప్రవేశ ద్వారము
                 అతడు బోయ కులస్తుడు. అతని పేరు బీచుపల్లి. అదే సంప్రదాయం ప్పటికీ కొనసాగుతోంది అందువల్లనే  క్రమంగా ఈ ఆలయం లోని ఆంజనేయునకు బీచుపల్లి రాయుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు .ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి చాల మందికి బీచుపల్లి అని పేర్లు ఉంటాయట.
                         

           

                                ఆలయ మండప ముందు దృశ్యం
           ఆలయం లోని ముఖమండపం లో శ్రీ స్వామివారికి కుడివైపున ఉన్న చిన్నవేదిక మీద శ్రీ భవానీమాత, శివలింగం, విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉంటారు. కుడివైపున  ఉన్న చిన్నవేదిక మీద శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
            

     
                               శ్రీస్వామివారి పాదుకలు
    
       ఆలయానికి  ప్రథాన గాలి గోపురం నిర్మాణం లో ఉన్నట్లుంది. ధానికి  ఆలయానికి మథ్యలో  రాతి థ్వజస్థంభము, దానిపై అందమైన ఆంజనేయరూపం గంగ సింథూరం పూత తో కాంతులీనుతుంటాయి.

   
                                శ్రీ స్వామి వారి దివ్యరూపం
              
     ఇది కాక ఆలయ ప్రథాన ద్వారానికి ఎదురుగా ప్రతిష్ఠించబడిన దారు థ్వజస్థంభము దేవతలకు ఆహ్వానం పలుకుతూ, భక్తులను ఆశీర్వదిస్తూ , ఉన్నతంగా దర్శనమిస్తుంది. థ్వజస్థంభానికి కుడివైపు కూడ శ్రీ స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి.
                       

     
                                   ఆలయ ముఖమండప ప్రవేశం
         
              ఈ ఆలయానికి  కృష్ణానది కూత వేటు దూరం లో ఉండటం తో భక్తులు పర్వదినాల్లో, పుష్కర సమయాల్లోను,  కార్తీక మాసం లోను స్నానాలకు విరివిగా వస్తారు. నదిలోకి పుష్కర స్నానఘట్టాలు భద్రంగా నిర్మించబడ్డాయి.  ఇక్కడొక శివాలయం కూడ ఉంది కృష్ణానది కి  నిండుగా  నీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నశివలింగం మీద నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది .  ఇచ్చట  1992 ప్రాంతంలో ఒక రామాలయం కూడ నిర్మించబడింది.
                        

         



                                
         











 శ్రీస్వామి వారి రథము                                      ఉత్సవమండపము

               హైదరాబాదు – బెంగుళూరు   జాతీయరహదారి కి ప్రక్కగా ఉండటం వలన భక్తులు చేరుకోవడానికి కూడ సౌకర్యం గా ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 170 కి.మీ దూరం లోను, జూరాల ప్రాజక్టు నుండి 30 కి.మీ దూరం లోను ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది .   









******  జయ హనుమాన జ్ఞానగుణ సాగర******************