Friday 22 March 2013

పరిటాల- శ్రీ అభయాంజనేయస్వామి


                         Paritala     Sri Abhayanjaneya Swamy Darsanam. 
                 
                                పరిటాల   శ్రీ అభయాంజనేయస్వామి దర్శనం.
                        
                     परिटाल श्री अभयांजनेयस्वामि दर्शनम्.
           

                                      కృష్ణాజిల్లా  పరిటాల భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర లో తొలి రిపబ్లిక్  గా  ప్రకటించుకొన్న విశిష్ఠ  గ్రామము. అటువంటి పరిటాల మళ్లీ ఇప్పుడు  135 అడుగుల             శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ తో తిరిగి  ప్రజల దృష్టిని ఆకర్షించింది.
                        
        

 విజయవాడ- హైదరాబాద్  జాతీయ రహదారి  ప్రక్కన పరిటాల బైపాస్ రోడ్డు ప్రారంభంలో ఎడమ వైపున మనకు  దివ్య మంగళరూపుడైన  శ్రీ అభయాంజనేయుడు  దర్శనమిస్తాడు. 135 అడుగుల ఎత్తు గల  శ్రీ ఆంజనేయుని సమున్నత విగ్రహం   కి.మీ దూరం నుండే ప్రయాణీకుల దృష్టిని ఆకర్షించి,అక్కడ ఏమిటో ననే ఉత్సుకత ను రేకెత్తిస్తుంది..
     
           
                             తోరణ ద్వారం
             
            స్వామి దర్శనం  ::----            కుడి చేతిలో అభయ ముద్రతో, ఎడమ చేతిని గదాయుధం పై  నిలిపి,  మీకు నేనున్నానే అభయమిస్తూ, ఆశ్రిత జన రక్షకుడు గా వెలసిన ఈ అంజనీ సుతుడు భక్తజన మందారుడై ఎందరో యాత్రికుల పూజలందు కుంటున్నాడు. కేవలం  భక్తుల భూరి విరాళాలతో రూపు దిద్దుకున్న ఈ ఆభయాంజనేయుడు  ఆవిష్కరించి బడిన కొద్ది కాలం లో ప్రసిద్ది ,ప్రాభవాలను సంపాదించాడు. విశాఖ,సర్కారు తదితర జిల్లాల నుండి రాజధాని పరిసర ప్రాంతాలకు స్వంత  వాహనాల్లో  వెళ్లే ప్రయాణకులకు ఈ  ప్రదేశం  భద్రత కలిగిన ఒక  యాత్రా స్థలం గానే కాక ఒక మజిలీ గా,  ఒక విడిది ప్రదేశంగా   సౌకర్యవంతంగా ఉంటోంది.
   
    
              
                       స్వామివారి దివ్యమంగళ రూపం

                విశ్రాంత విహారం ::------     చల్లని చెట్ల క్రింద కూర్చోవడానికి వసతి, త్రాగటానికి మంచినీరు వంటివి దొరకటంతో ప్రయాణీకులు ఇచ్చట తప్పని సరిగా ఆగి, దైవాన్ని దర్శించుకొని ,ప్రసాదాన్ని స్వీకరించి,  తాము వెంట తెచ్చుకున్న  అల్పాహారాన్ని సేవించి, సేద దీరి, తిరిగి  తమ ఫ్రయాణాన్ని కొనసాగించడాన్ని  అలవాటు  గా చేసుకున్నారు.
    
       
           ఇది యాత్రాస్థలం గానే కాకుండా ఒక   విహార యాత్ర స్థలం  గా కూడ  పెద్దల్ని, పిల్లల్ని ఆకర్షిస్తోంది. 135 అడుగుల  ఎత్తులో  ధవళ వర్ణ ప్రభా భాసమాను డైన  అంజనీ తనయుని  దర్శనం, స్పర్శనం, ఒక అద్బుతమైన అనుభవం గా యాత్రికులు, ముఖ్యంగా పిల్లలు భావిస్తారు.
                   
                               శ్రీ స్వామి చెంతకు నిర్మించబడిన మెట్ల మార్గం
                  
               శ్రీఆంజనేయస్వామి వారి క్రింద నిర్మించ బడిన పాద మండపం లో   ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీ స్వామి వారికి నిత్యార్చన ధూప దీపనైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి..  నిత్యము హనుమాన్ చాలీసా పారాయణల తో, రామభజనలతో ఈ మందిరమంతా మార్మ్రోగుతుంటుంది.
   
                        ఆవరణ లోని ఉపాలయాల దృశ్యం
         
             ఉపాలయాలు  ::--            ఇదే ఆవరణలో శ్రీ రేణుకాదేవి  ఆలయం,  శ్రీ సీతా లక్ష్మణహనుమత్సమేత  రామచంద్రుని ఆలయం  ఉన్నాయి. 
  




                           ఆవరణ లోని శ్రీ స్వామి వారి  రూపక మూర్తి

                 ఈ ఆలయాల సందర్శన వలన  యాత్రికులకు మార్గాయాసం ఉపశమించడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడ చేకూరుతుందనడంలో ఎటువంటి  అతిశయోక్తి లేదు.    
        
                           శ్రీ   సీతారామచంద్రస్వామి ఆలయ ముఖ ద్వారం
             

                శ్రీకాళహస్తి  శ్రీ శుకబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామువారి దివ్యాశీస్సులతో  ఫ్రారంభమైన  ఈ పవిత్ర కార్యక్రమం ఎందరో భాగవత శేఖరుల,భక్తవరేణ్యుల అండదండలతో ముందుకు సాగుతోంది.   జ్ఞాన గుణ సాగరుడైన   శ్రీ ఆంజనేయుని   అనుగ్రహం  అందరికీ అన్ని వేళలా లభించాలనేదే ఈ నిర్మాతల, దాతల 
ఆకాంక్ష.
******************************************************************************************************************************************

No comments:

Post a Comment