Wednesday 26 June 2013

కొడవటంచ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం

   

                                    Kodavatancha   
  
         Sree Sree  Sree Lakshmi nrusimha swamy   Aalayam       
              

                                కొడవటంచ  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం.
       कॊडवटंच श्री श्री श्री लक्ष्मीनृसिंहस्वामि आलयम्.
                     
            వరంగల్లు జిల్లా రేగొండ మండలం లోని కొడవటంచ గ్రామం శ్రీ లక్ష్మీ నృసింహుని దివ్యథామం.  రేగొండ మండల కేంద్రానికి 9కి.మీ. దూరం లో కొడవటంచ లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయంభువు గా వెలసి, భక్తులను కరుణిస్తున్న దివ్యక్షేత్రమిది.
                   
            శ్రీ స్వామి వారు యోగముద్ర లో నుండగా వామాంకముపై నిత్యానపాయిని యైన లక్ష్మీదేవి   వెలసియుండుట  ఈ క్షేత్ర విశిష్టత గా చెప్పబడుతోంది.
                     

            
                                                           ఆలయ రాజగోపురం

             హిరణ్యకశ్యపుని  వథానంతరం ఉగ్రరూపుడైన శ్రీ నృసింహుని శాంతపరచ డానికి కాదు గదా   ఆయనను  సమీపించడానికి కూడ ఎవ్వరు సాహసించలేక పోయారు. ఆ సమయం లో   ఆయన వక్షస్థలం పై నిత్యం విలసిల్లే  శ్రీ లక్ష్మీదేవి కూడ శ్రీ స్వామి  వారి ఉగ్ర రూపాన్ని చూచి, కొంచెం జంకి దూరంగానే నిలబడిపోయిందట.
                 అప్పుడు సనకసనందనాది మహర్షులు,దేవతాగణము కలిసి పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదకుమారుని వేడుకొనగా, ప్రహ్లాదుడు శ్రీ స్వామి చెంతకు వెళ్లి వివిథస్తోత్రాలతో ఆయనను శాంతపరచాడు. శాంత స్వరూపుడై, యోగముద్రలో నున్న శ్రీ స్వామి వారి వామాంకమున కలుములజవరాలు  శ్రీ లక్ష్మీదేవి ఆసీనురాలైంది.శ్రీ స్వామి అదే రూపంతో  అర్చావతారుడై ఈక్షేత్రం లో వెలసి  భక్తజనులను కటాక్షిస్తున్నారు.
                  

         
                                                                            ధ్వజస్థంభం
             
            మాంథాత కాలం నాటికే ఈ క్షేత్రము ఉన్నదనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి కొంచెం దూరములో మాంథాత బండ అని పిలువబడే ఒక శిల నేటికి కన్పిస్తుంది.
                       (మాంథాత భాగవత శేఖరుడైన అంబరీషుని యొక్క తండ్రి .  మాంథాత తండ్రి యువనాశ్వుడు. యువనాశ్వుడు సంతానం కోస పుత్రకామేష్టి యాగం చేశాడు. భగీరథుడు యువనాశ్వుని భార్యలకోసం యాగ జలాన్ని భద్రపరుచగా, ఆ విషయం తెలియని యువనాశ్వుడు ఆ నీటిని త్రాగి వేయడం తో అతను గర్భం ధరించాడు.అతని కడుపు చీల్చుకొని మాంథాత  బైట కొచ్చాడు.) (భాగవతం)
                       కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశీకుడైన శ్రీమాన్  తూపురాణి రంగాచార్యులు గారు ఒకరోజు  ఇప్పుడు ఆలయ ప్రాంగణము నందు గల  బావిలో నుండి నీరు తోడుచుండగా చేద (దీనినే కొన్ని ప్రాంతాల్లో బక్కెట అంటారు) లో అంగుష్ట ప్రమాణంలో ఉన్న శ్రీ స్వామి వారి ప్రతిమ ఒకటి  వచ్చింది.  పరమనిష్టాగరిష్ఠుడు,అకుంఠిత నృసింహదీక్షాతత్పరుడునైన శ్రీ ఆచార్యుల వారు ఆ ప్రతిమను చూచి, మిక్కిలి ఆశ్చర్యానందాలకు లోనైన వారై, తన పూజామందిరములో ఆ ప్రతిమ ను ఉంచి పూజించుచుండిరి. కాని ఆచార్యులవారికి ఏదో ఒక అసంతృప్తి. ఆ స్వామి దర్శనం అందరికీ కల్గింప చేయాలనే తపన.  అందుకే శ్రీ స్వామి వారిని అర్చాస్వరూపముతో వెలసి,భక్తుల పూజలందుకొని తనను కృతార్థుని చేయవలసింది గా ప్రతిరోజు అనుష్టానసమయం లో శ్రీ స్వామివారిని  వేడుకొనసాగారు ఆచార్యులవారు.
                          

    
                                        ధ్వజస్థంభ  పూర్వదృశ్యం
           
                ఆచార్యులవారి కోరిక తీరే సమయమాసన్నమైంది.ఒకరోజు శ్రీ రంగాచార్యుల వారికి శ్రీ నృసింహస్వామి  స్వప్నము నందు సాక్షాత్కరించి  చిన్నప్రతిమ లభించిన బావికి సమీపం లో తాను అర్చారూపంగా వెలసినట్లు చెప్పి అంతర్థానమయ్యారు.  శ్రీ ఆచార్యుల వారు మేల్కొని, ఆ ప్రాంతమంతయు ఎంతవెతికినను   శ్రీ స్వామి వారి విగ్రహము ఆచూకి లభించలేదు. అలసిపోయి, నిరాశ తో కొద్దిగా విశ్రమించిన ఆచార్యుల వారికి స్వప్నములో మరల స్వామి ప్రత్యక్షమైనారు. తన అర్చారూపము గల ప్రదేశమునకు ఆనవాలు గా ఇటుక ఆకారమున్న శిలపై శ్రీ ఆంజనేయుని విగ్రహము కన్పించగలదని చెప్పారట. మరల ఆ ప్రదేశమున వెతగ్గా శ్రీ ఆంజనేయవిగ్రహము, దాని సమీపం లో ఒక మట్టి దిబ్బ కనిపించాయి. అప్పుడు ఆచార్యుల వారు తన చేతిలో నున్న కొడవలి  తో ఆ మట్టి దిబ్బ ను పెళ్ళగించగా, శ్రీ స్వామివారి పరమాద్భుత విగ్రహం వెలుగు చూసింది. కొడవలి వంచిన శ్రీ స్వామివారి పేర ఈ క్షేత్రం కొడవటి వంచ  అయి, క్రమంగా ప్రజల వాడుకలో కొడవటంచ  గా పిలువబడుతోంది.
             
           ప్రస్తుతం పరిసర గ్రామాల ప్రజలు దీన్ని  కొడంచ  అనే పిలుస్తున్నారు. మేము యాత్రలో భాగం గా గణపూర్ దగ్గర కొడవటంచ అని అడిగితే, వాళ్లు కొడంచ అనడం మాకు మొదట్లో ఆశ్చర్యాన్ని కల్గించింది. కాని పరకాల రోడ్డు మలుపులో మార్గసూచిక గా కొడంచ అనే బోర్డు కన్పించడం తో  మారిన ఊరు పేరు మాకు అప్పుడు అర్థమైంది.
                       

               
                                                    ముఖమండపం లో కొలువుతీరిన ఆంజనేయుడు

              ఆనాడు బావి చేదలో దొరికిన చిన్నప్రతిమ ఈనాటికి సాలగ్రామాల మథ్య  ఆలయం లో పూజించబడుతోంది. ఆనాడు స్వామి విగ్రహము వెలసిన ప్రదేశమందే ఆలయ నిర్మాణం జరిగి,దిన దిన ప్రవర్థమానమౌతోంది.

                        
                    ఆలయం ముఖమండపం,అంత్రాలయం,గర్భాలయం గా మూడుభాగాలుగా నిర్మించచబడింది. ముఖమండపం లో ఉత్తరాభిముఖుడుగా ఉన్న ఆంజనేయుడు భక్తుల మొఱలను స్వామికి నివేదిస్తున్నట్లు స్వామి వైపుకు ముకుళిత హస్తుడై దర్శనమిస్తాడు. అంత్రాలయానికి రెండువైపులా జయవిజయులు కొలువుతీరిఉన్నారు. శ్రీ స్వామి వారికి ఎదురుగా ముఖమండపం లో గరుడాళ్వరు వేంచేసియున్నాడు.
                                   


                         
                            
                            శ్రీలక్ష్మీ నృసింహుని దివ్యరూపం        
                        
                   గర్భాలయం లో శ్రీ నృసింహుడు  వామాంకస్థిత లక్ష్మీ  యుతుడై దర్శనమిస్తున్నారు. వారి చుట్టు ఆళ్వారులు పరివేష్టించి ఉన్నారు. శ్రీ రామానుజుల వారి దివ్య విగ్రహం  ప్రత్యేకంగా  ఉత్సవమూర్తుల చెంత దృశ్యమానమౌతోంది. 

                                   ఆలయ శిఖర దర్శనం
                  ఆదివారం,పర్వదినాల్లో ఇక్కడకు భక్తులు అధికసంఖ్య లో వస్తారు.ఆలయానికి ముందు ఉన్న విశాలమైన ఖాళీస్థలం లో, చెట్ల క్రింద వంటలు చేసుకొని, దేవునికి చూపించి,  అయినవారితో పాటు అక్కడికొచ్చిన వారికి కూడ వడ్డించి ఆత్మతృప్తి తో తిరిగి వెడుతుంటారు.
                       
            
                                                 శ్రీ స్వామి వారి వాహనశాల
                            
     ఈ క్షేత్రం లో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని మానసికరోగము లను నివారించే పరమాద్భుతమూర్తి గా భక్తులు విశ్వసిస్తారు.  తీవ్రమైన మానసిక  వ్యాధు లతో బాధపడుతూ,గొలుసులతో బంధింపబడి,ఈ క్షేత్త్రానికి తీసుకురాబడిన వ్యాధిగ్రస్తులు అనేకమంది ప్రతిరోజు  ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారికి ప్రదక్షిణలు శ్రీ స్వామి తీర్థాన్ని సేవించి, సాంబ్రాణి పొగ వేసుకుంటూ మండలం రోజులు సేవిస్తే  వారు ఆరోగ్యవంతులైన నిదర్శనాలు కొల్లలుగా ఉన్నాయట.   దారిద్య్ర,ఋణబాధలు  స్వామి  వారి దర్శన మాత్రముననే దూరమౌతాయని భక్తుల దృఢవిశ్వాసం. సంతానం లేని వారు మండలం రోజులు ఆలయ ప్రదక్షిణ చేస్తే సంతాన వంతు లౌతారని నమ్మకం.
                          

          
                                         గుడి ముందు విశాలమైన ప్రదేశంలో కళ్యాణ మండపం

                 ఈ ఆలయం లో పాంచరాత్రాగమ సంప్రదాయానుసారముగా  పూజలు నిర్వహించ బడుతున్నాయి.ప్రతి సంవత్సరం వృషభసంక్రమణ మాసం లో  శ్రీ నృసింహుని జయంత్యుత్సవాలు,ఫాల్గుణ మాసం లో పాంచాహ్నిక దీక్ష తో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ స్వామి వారి శకటోత్సవం జరుగుతుంది. ఆ రోజున ఆలయం చుట్టు వివిధ రకాల ప్రభలతో అలంకరించిన బోనాలు, ఎడ్లబండ్లు తిరగటం విశేష ఆకర్షణ. ఈ సందర్భంగా దాదాపు రెండు లక్షలమంది యాత్రికులు శ్రీస్వామి వారిని దర్శించుకుంటారు.
                            
             

                                                       ఆలయ ఉత్తర ద్వారం   

          శ్రీ స్వామివారికి  ఉగాది, శ్రీరామనవమి, తొలిఏకాదశి,ఆండాళ్ తిరునక్షత్రం, శ్రీకృష్ణ     జన్మాష్టమి,దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి, ధనుర్మాసము లో అధ్యయనోత్సవం, మొదలైన పర్వదినాల సందర్భంగా విశేషపూజలు,సేవలు జరుగుతాయి.
           
              “  కరవీర సుమాభూషా చక్షురానందమూర్తయే !
              కొడవటంచ నివాసాయ  శ్రీ నృసింహాయ మంగళమ్ !!”



*************************************************************** *****************      

Tuesday 25 June 2013

పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం

                     Palakurthy Sri Someswara LakshminarasimhaSwamy Aalayam
            పాలకుర్తి   శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం .       
                      पालकुर्ति श्री सोमेश्वर लक्ष्मीनरसिंहस्वामि आलयम्     
                   

              వరంగల్లు జిల్లా పాలకుర్తి శివకేశవులు ఇరువురు స్వయంభువు లుగా ఒకే కొండపై  వెలసిన దివ్యక్షేత్రం. దట్టమైన చెట్ల మధ్య కొండ పై భాగాన రెండు గుహలు. ఒక గుహలో సోమేశ్వరుడు, ప్రక్కనే వేరొక గుహలో లక్ష్మీనరసింహుడు కొలువు తీరి  కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజనాలందుకుంటున్నారు.

     క్షేత్ర మహత్మ్యం :---         ఈ కొండరాళ్లకు ,చెట్లకొమ్మలకు పదుల కొద్ది తేనెపట్టు లుంటాయి. శుభ్రత పాటించకుండా ఆలయానికి కొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానంచేసేవరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి, ఆపదలు తీరిన తరువాత మర్చిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తుంటారట.
                           

          
                       ఎత్తైన కొండ రెండు గా చీలి, ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడటం చూపరులకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.ఒక భక్తురాలి కోరిక మేరకు కొండ రెండుగా చీలి ప్రదక్షిణ మార్ ఏర్పడినట్లు భక్తులు చెప్పుకుంటారు. అది సహజసిద్ధంగా ఏర్పడినా ఒక సహజ ప్రకృతి రమణీయ ప్రదేశంగా గుర్తించ దగ్గది.  కొండపై నున్న  శిఖరదర్శనం చేసుకోవడానికి పెద్దపెద్ద రాళ్ళ మథ్యనుండి పైకి మెట్ల మార్గం ఉంది.

 
          

       గండదీపం




 గండదీపం. :--         ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి  తమ మొక్కులను తీర్చుకుంటారు. కొంచె బరువైన శరీరం కలిగిన వాళ్ళు, చీకటికి భయపడేవారు, ఆథునికంగా నిర్మించిన వేరే మెట్ల దారి ద్వారా పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు.  అయితే శిఖర ప్రదక్షిణం చేయాలంటే మాత్రం  రాళ్ళమథ్య, నిలువుమెట్ల పై ప్రయాణం చేయాల్సిందే.


                                                 ప్రదక్షిణ మెట్లమార్గం

   క్షేత్ర ప్రాథాన్యం .:       ఈ మెట్ల మార్గం శ్రీ స్వామి రెండు గుహలకు  కొంచెం దక్షిణంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గానికి ఆనుకొని కొండ లోపలికి క సొరంగ మార్గం ఉంది. దీనిని నేలబొయ్యారం ని పిలుస్తారు. ఇప్పుడు దీనిని మూసివేశారు. చిత్రంలో చూడవచ్చు. ఇది జన సంచారం పెరిగే మొన్న మొన్నటి కాలం వరకు మహర్షులు తపస్సుకు, యజ్ఞ యాగాదులకు ఎంచుకున్న ఏకాంత పుణ్య రహస్య స్థలంగా భావించబడుతోంది.  ఇప్పటికీ ఈ కొండలో నుండి రాత్రి వేళల్లో ఓంకారం వినిపించడం, శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరపడం విశేషంగా భక్తులు చెపుతుంటారు.
                    
                
             

                                        నేలబొయ్యారం

   చాలాకాలం క్రితం  నేలబొయ్యారం లోని విశేషం తెలుసుకుందామని భావించిన అర్చకులు, కొందరు గ్రామ పెద్దలు కలిసి సొరంగం లోకి కొంతదూరం ప్రయాణం చేసి, ఇరుకైన, గాలి రాని, గబ్బిలాల వాసనతో నిండిన దారిలో ముందుకు సాగ లేక వెనక్కి వచ్చేశారని స్థలపురాణం చెపుతోంది.
                                                                                                                                             
                                                                                                                                                   ఈ గుహకు ప్రక్కనుంచి  పై నున్న  వీరాంజనేయస్వామి  ఆలయానికి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు కూడ నిలువుగా పెద్ద కొండ రాళ్ళమథ్య నుంచి సాగిపోతాయి. ఈ ఆంజనేయుని దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాలనుండిభక్తులు వచ్చి ఉప్పురాశి గా పోసి ,దాని పై  ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు.   ఎటువంటి భూత , ప్రేత,పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని  భక్తుల నమ్మకం.


                     రెండుగా చీలి ప్రదక్షిణ మార్గాన్నిచ్చినకొండ
  
పాలేరు>పాలకురికి>పాలకుర్తి   :--. వేల సంవత్సరాల చరిత్ర గల  ఈ కొండ గుహల నుండి పాల లాంటి నీరు ప్రవహించేదట. ఆ నీరు చెరువులో కలసి పాలేరు గా ప్రవహించి, గోదావరి లో కలుస్తుంది.  అందువలన  పాలేరు కు జన్మనిచ్చిన ఈ మహాక్షేత్రమే పాలకుర్తి గా ప్రసిద్ధిపొందింది. పాలకురికి గ్రామమే క్రమంగా పాలకుర్తి అయ్యింది. దీనినే పండితులు క్షీరగిరి అని కూడ పిలుస్తారు.


   
                               మెట్లమార్గం లో రెండవ మలుపు

శ్రీ సోమేశ్వర, లక్ష్మీనరసింహ దర్శనం.:---    ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి, దానిలో నుండి  స్వామికి ఎడమవైపుకు ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోనికి దారి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తరస్థానం లో కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది.
                      

                                శ్రీ సోమేశ్మవర స్వామి వారి దివ్యరూపం

  శ్రీ సోమేశ్వరుడు గుహలోపలికి ఎత్తైన తిన్నె పై స్వచ్ఛధవళ కాంతులనీనుతూ సుమారు అడుగున్నర ప్రమాణం లో పానమట్టం పై వెలసి, భక్తులకు దర్శన మిస్తున్నాడు.ఆర్జితసేవ లో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంది.
                  

                                          శ్రీ  పార్వతీ మాత       

శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతుడై  ఎత్తైన తిన్నెపై సుమారు మూడడుగుల విగ్రహం లో కొలువు తీరి చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత జనరక్షకుడు నై భక్తమందారుడు గా భక్త జనుల పూజలనందుకుంటున్నాడు. మానసిక రోగాలు,శారీరక బాథలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయని భక్తులనమ్మకం.  అందుకేనేమో.! స్వామిని దర్శించిన ప్రతి భక్తుని,అర్చకులవారు,  స్వామి పాదాల చెంత నున్న చిన్న బెత్తాన్ని తీసుకొని,   భక్తుని వీపు పై నెమ్మదిగా తాటించడం ఈ ఆలయం లో కన్పిస్తుంది.
                       
           



                               శ్రీలక్ష్మీనరసింహుని దివ్య గంభీర రూపం
            
     ఈ ఆలయానికి ముఖమండపము, లోపలికి వెడితే గుహ లో తిన్నెపై స్వామి దర్శనము తప్పితే అంత్రాలయము ,గర్భాలయము వంటివి వేరు గా కన్పించవు. ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందాన్ని కల్గిస్తోంది.
      ******   ఈ ఆలయ పూర్తి చిత్రాన్ని YOU TUBE  లో "  Palakurthy sri someswara lakshminarasimha swamy darsanam "     ద్వారా చూడవచ్చు.******                
     
                 https://www.youtube.com/watch?v=h9ls7TCSoO4
                    
                     ఈ పుణ్యభూమి లోనే 12 వ శతాబ్దానికి  చెందిన వీరశైవ కావ్య నిర్మాణ థౌరేయుడు, బసవ పురాణ కావ్యకర్త,  మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. శ్రీ విష్ణురామిదేవుడు, శ్రియా దేవమ్మ దంపతులకు  శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదం గా ఆమహానుభావుడు జన్మించాడు. అందుకే తల్లిదండ్రులు ఆయనకు  సోమనాథుడని పేరు పెట్టుకున్నారు. శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని  స్తుతిస్తూ సోమనాథుని స్వవాలు వ్రాశాడని చెపుతారు.             అనుభవసారము,బసవపురాణము,పండితారాథ్యచరిత్ర, చతుర్వేద సారము  మొదలైన అనేక గ్రంథాలను, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు. ఈ గ్రామం లో సోమనాథుని స్మృతి చిహ్నం గా నిర్మించిన శివాలయం ఉంది.
                      


           
                                                  శ్రీ వినాయకుడు
          
               శ్రీ  ఆంథ్ర  మహాభాగవత మందార మకరందాన్ని తెలుగు వారి కందించిన భక్తకవి పోతన నివాస గ్రామం బమ్మెర ఈ పాలకురికి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు  ఈ సోమేశ్వరుని, లక్ష్మీ నర సింహు ని దర్శనానికి వచ్చి వెడుతుండే వాడనడానికి గ్రంథాల్లో  ఆథారాలున్నాయని స్థలపురాణం లో వ్రాశారు.
                       
  


                                    విహంగవీక్షణం
             
            వాల్మీకి మహర్షి  కూడ పాలకుర్తి కి ఐదు కిలోమీటర్ల దూరం లోగల వల్మిడి(వాల్మీకి పురం) లో గల కొండల్లో నివసించే వాడని ప్రతీతి.
                     
              ఇక్కడికొచ్చే భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టడం, గండదీపాలు వెలిగించడం, అన్నదానం, తలనీలాలుసమర్పించడం,కోడెలను కట్టివేయడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్లయిన తర్వాత స్వామి వారి కళ్యాణం చేయిస్తారు. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకం.

                         
                                       శ్రీ సోమేశ్వర గుహ ముఖద్వారం
           
         సంతానం లేని వారు మొదట కొబ్బరి కాయలు కడతారు. సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణ చేస్తారు. ల్లు కడితే బంగారు,వెండి, కర్ర ఇల్లు చేయించి       శ్రీ స్వామి వారికి సమర్పిస్తారు.అనారోగ్యం తో బాధపడేవారు  అవయవాలను వెండితో చేయించి  తెచ్చి సమర్పించడం  కూడ ఈ ఆలయం లో కన్పిస్తుంది.   
     


                                     నందీశ్వరుడు

 ఉత్సవాలు : ---            మహాశివరాత్రి కి శ్రీ సోమేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి,జాతర కు  రాష్ట్రం నలుమూలలనుండే కాక కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలనుండి కూడ లక్షలాది గా భక్తులు  తరలివస్తారు.ఉత్సవాలలో భాగం గా యజ్ఞ యాగాదులతో పాటు,  దివ్యరథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.కొండచుట్టు ప్రభలు కట్టిన ఎడ్లబండ్లు పరుగులు తీస్తాయి. చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది.
                    
    
                శ్రావణ మాసం లో శత చండీ హవనం, రుద్రహవనం,లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక దీపోత్సవం, మార్గశిర మాసం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్గళి ప్రాత: కాలార్చనలు,నైవేద్యాలు, ప్రసాదవినియోగం ఉంటాయి. శ్రీ సోమనాథ మహాకవి శివైక్యం పొందిన    ఫాల్గుణ మాసం లో ప్రత్యేక ఉత్సవాలుంటాయి. ప్రతి మాస శివరాత్రికి  శ్రీ  స్వామివారి కళ్యాణం నిర్వహించ  బడుతుంది.

                      
                                      కొండ దిగువన ఉత్సవ మండపం     
  
         శివ కేశవ అభేదానికి ప్రతీకగా కన్పించే ఈ ఆలయం లో  శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం లో శైవాచార్యులే ( శివారాథకులు) అర్చకులు గా ఉండటం నిజంగా అభినందించ దగ్గ విషయం.
                   
         జిల్లా కేంద్రమైన వరంగల్లు కు 60 కి .మీ. దూరం లో ఈ పాలకుర్తి పుణ్యక్షేత్రం ఉంది.   కొండపైకి చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. యాత్రీకులకు కనీస వసతులు ఉన్నాయి. హైద్రాబాద్ , హన్మకొండ. వరంగల్, ష్టేషన్ ఘనాపూర్, జనగామ, తొర్రూరుల నుండి రవాణా సౌకర్యాలున్నాయి.
                      
                      ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రాచీన దివ్యక్షేత్రం పాలకుర్తి.







****** క్షీరాద్రి శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే ***** ****************************************    

Monday 10 June 2013

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వరస్వామి క్షేత్రం

     Kolanupaka sri chandee sameta someswaraswamy Temple.
                       
              కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామిక్షేత్రం                                     कॊलनुपाक श्री चंडी समेत सोमेश्वरस्वामि क्षेत्रम्.          
                         
              నల్గొండజిల్లా ఆలేరు మండలం లోని   కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడు గా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య  ఇచ్చటనే లింగోద్భవము పొంది  వేయి సంవత్సరాలు భూమండలం మీద  శైవ మతప్రచారము చేసి,  మరల ఇచ్చటనే లింగైక్యమందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి.  దేవాలయ ప్రాంగణాన్ని , ప్రాకార మండపాలనే మ్యూజియం గా ఏర్పాటుచేశారు పురావస్తు శాఖ వారు.

                           ఈ ఆలయం క్రీ.శ 1070 -  1126 మథ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని  చరిత్ర కారులు భావిస్తున్నారు.
      

             
                                    శ్రీ రేవణ సిద్ధేశ్వరుడు
                పూర్వచరిత్ర. :----          ఈ కొలనుపాక నే పూర్వం దక్షిణ కాశి,బింబావతి పట్నం, పంచకోశ నగరం గా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక,  కొల్లిపాకేయ మొదలైన పేర్ల తో పిలిచే వారట.  ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
                     

       
                                     ఆలయ ప్రవేశ ద్వారం

                         ఇచ్చట సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం, లేక స్వయంభూలింగం గా చెపుతున్నారు.  ఈ లింగం నాలుగు యుగాలనాడే వెలసింది. కృతయుగం లో స్వర్ణలింగం  గాను, త్రేతాయుగం లో రజితలింగం గాను, ద్వాపరయుగం లో  తామ్రలింగం గాను, పూజలంది కలియుగం లో శిలాలింగం గా దర్శనమిస్తున్నట్లు స్థలపురాణం.

                       
                                              
                                                                 ప్రవేశ ద్వారం ఎదురుగా వినాయకుడు

                        లింగమే రెండు గా  చీలి, దానిలో నుండి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించి,1000 సం.రాలు భూమిపై  వీరశైవ మతప్రచారం చేసి, మరల తిరిగి ఇదే లింగం లో లీనమైనట్లు చెప్పబడుతోంది. ఈయనకే రేణుకుడు, రేవణ, నేవణ, నేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి.
                                  శ్రీమత్ రేవణ సిద్దస్య కుల్యపాక పురోత్తమే !
                                  సోమేశ లింగ జననం  నివాసే కదళీ పురీ !!
అని  రేణుకాచార్య  స్తుతి.
పంచపీఠాలు :        ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిది గా వీరశైవులు పూజిస్తారు.               
                 1. సోమేశ్వరస్వామి కొలనుపాక             2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని
                       3.భీమనాథస్వామి - కేదారనాథ్               4. మల్లిఖార్జున స్వామి శ్రీశైలమ్
                                                   5. విశ్వేశ్వరస్వామి కాశి
                   

                                                         మ్యూజియం లోని గజలక్ష్మి
            
                         అతి పురాతనమైన  ఈ ఆలయప్రాగణం లోకి ప్రవేశించిన భక్తులకు అనిర్వచ నీయమైన భక్తితో పాటు ఏదో ఒక ఆవేశంవంటిది కలుగుతుంది. దీనినే వీరశైవం లో భక్త్యావేశం అని పిలిచేవారేమో అనిపిస్తుంది. అక్కడ కన్పించే భక్తులు కూడ ఎక్కువగా కర్నాటకనుండి వచ్చినవారే ఎక్కువగా కన్పిస్తారు. తలస్నానాలు చేసి, జుట్టు ఆరబోసుకొని, ముఖంమీద బండారు, కుంకుమ, విభూతులను దట్టంగా అలంకరించుకున్న ఆడవారిలో అక్కడ చండీమాతే  కన్పిస్తుంది.
                     

                
                                   మ్యూజియం లోని ఒక శిథిల శిల్పం
                
                     ఆలయప్రవేశం తోరణ ద్వారంతో  చాలాఎత్తుగా కన్పిస్తుంది.  తోరణ ద్వారానికి అటునిటు ద్వారపాలకులు,  ఎడమ వైపు నలుచదరపు కందకంలో నంది శివలింగాలు. ఆ పైన దూరంగా కొన్ని శాసనాలు   దర్శనమిస్తాయి. తోరణ ద్వారానికి కుడి వైపు కొంచెం దూరం లో నేల లోపలికి నలభై,ఏభై   మెట్ల తో మెలికలు తిరిగిన నేలమాళిగ ఉంటుంది. ఆ మార్గాన్ని   మూసివేయడం జరిగింది.
     

                                         కోష్ట పంజరం లో శ్రీ పార్వతీ పరమేశ్వరులు
                  ప్రథానాలయం. ;----            మ్యూజియం ను, వీరభద్ర మండపాన్ని దాటి వెళితే  ప్రథానాలయాన్ని చేరుకుంటాం. ఈ నడుమ ప్రమాణ మండపం లో నందీశ్వరుడు మనల్ని పల్కరిస్తున్నట్లు గా కన్పిస్తున్నాడు.    ప్రథానాలయం ప్రాకార మండపాలనుండి వేరుగా నిర్మించబడింది. ముఖమండపం లో మనకు  పంచముఖేశ్వరుడు దర్శనమిస్తాడు.

        
                     ఆయనంతరం గర్భాలయంలో స్వయంభువుడైన సోమేశ్వరుని  లింగరూపం, ఆ వెనుక లింగోద్భవమూర్తిగా రేణుకాచార్య విగ్రహం దర్శన మిస్తాయి. 
                             

                     స్వయంభువు డైన సోమేశ్వరుడు , వెనుక ఆదిజగద్గురు రేణుకాచార్య ఆవిర్భావ దృశ్యం
                     
                         చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు, అందువలన ఈ స్వామి సోమేశ్వరుడుగా పిలువబడబతున్నట్లు స్థలపురాణం.
   
             చండీమాత .:--                            ఎడమవైపు ఉపాలయంలో మల్లిఖార్జునుడు ఆ ప్రక్కనే నాలుగుమెట్లు ఎ క్కి కుడువైపుకు తిరిగితే ఉపాలయం లో చండీమాత  కొలువు తీరి ఉంది.
       

                                                 
                                                 శ్రీ చండీమాత           
        
                    ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ  దివ్యమంగళవిగ్రహం కన్పిస్తుంది.. చండీమాత భక్తులు ముడుపులు కట్టి, కోరికలు తీరిన తరువాత మొక్కులు చెల్లించుకుంటారు.



     అందుకే చండీమాత ముఖమండపం పైకప్పంతా ఈ ముడుపుల మూటలతో నిండి   ఉండటాన్ని మనం గమనించవచ్చు.
  


                                                                                    చండీమాత ఆలయ ద్వారం వద్ద ఉన్న వినాయకుడు

          కోటిలింగేశ్వరాలయం:;---.                    ఎడమవైపు ద్వారం నుండి వెలుపలికి వస్తే నైరుతి లో కన్పిస్తుంది కోటిలింగేశ్వరాలయం.  పంచకోసు నగరం గా పిలువబడే ఈక్షేత్రం లో  కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యిలింగాలు  తక్కువ అవడం తో ఒకే రాయి పై  వేయిలింగాలను చెక్కి ప్రథిష్టించారట. అదే ఈ కోటిలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి  కెక్కింది.
     

 సూర్యగంగ.:--             ప్రథానాలయ ముఖమండపము యొక్క కుడివైపు  ద్వారం  నుండి వెలుపలి కొస్తే కన్పించేది సూర్యగంగ గా పిలువబడే అత్యంత లోతైన కోనేరు.


         ********** ఈ ఆలయ పూర్తి దృశ్యాలను You tube ల నాచే ఉంచబడిన  kolanupaka sree chandeemaata sameta someswara darsanam part -1,part -2  ద్వారా చూడవచ్చు.
     ps://www.youtube.com/watch?v=DoyDyY0idpY
    https://www.youtube.com/watch?v=yrd6R9UtMIM  
                     ఏకాదశ రుద్రులు. :---         టునుంచి తిరిగి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశరుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది. ప్రక్కనే కొంచెందూరం లో ఉత్తరాభిముఖుడై  విఘ్నరాజు కొలువు తీరి ఉన్నాడు. 

            
            ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే  కాకతీయ కళాసంప్రదాయం తో నిర్మితమైన మరో శిథిల శివాలయం మన కంటపడుతుంది. సోమేశ్వర ఆలయమంతా చాళుక్య, హోయసల  నిర్మాణ సంప్రదాయం  కన్పిస్తే,  ఈ ఆలయం  నిర్మాణం లో కాకతీయ  శైలి ప్రతిబింబిస్తోంది.  దీనలో శివలింగం, ముఖమండపం లో నంది మిగిలున్నాయి, ఆ ప్రక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణం  గా కన్పిస్తోంది.
            


              అలాగే కనుచూపుమేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన  ఆలయ సముదాయాలే  ఇక్కడ  మనకు గోచరమౌతాయి. ఉపాలయాల్లో  కాలభైరవుడు, వీరభద్రుడు, కుమారస్వామి  రూపాలతో పాటు, ఒక మండపం లో ఆంజనేయుడు కూడ కొలువు తీరి ఉన్నాడు.
            

       ఇక్కడే కాదు. ప్రథాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న నంది స్థంభం దగ్గర కూడ మనకు చాలా ఎత్తైన ఆంజనేయ విగ్రహం వినాయక ,కార్తికేయులతో కలసి కన్పిస్తుంది.
        

           వీరశైవ క్షేత్రాల్లో ఆంజ నేయుడు కన్పడటం ఆంజనేయుడు శివాంశ సంభూతుడు గా పూజించ బడటమే కారణమై ఉండవచ్చు.   ఇంకా ఎక్కువ సమాచారం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి అక్కడ సరైన  గైడ్ కాని, ముద్రిత సమాచారం కాని  లేకపోవడం కొంచెం బాధ కల్గిస్తుంది.
                            

         
                 మ్యూజియం లోని అపురూపమైన కోదండరాముని విగ్రహం

  సుదూర ప్రాంతాలనుంచి అంటే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడ కొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. యాత్రికుల వసతి సముదాయం ఇటువంటి వారికోసం అందుబాటులో ఉంది.

            శ్రీ మహాలక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి :;-- .  ఈ సోమేశ్వరాలయానికి  దక్షిణం గా కొద్దిదూరం లో ఉన్నమరొక ప్రాచీన ప్రసిద్ధ ఆలయం   శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం.
   


               పురాణం:--               కొన్ని వందల  సం.రాల క్రితం ఒక వీరుడు  శతృవులను ఓడించి తన విజయానికి కారకుడైన నారాయణుని స్మరిస్తూ నూరుమెట్ల పెద్దకొలనును తవ్వించి  ,దాని లో స్నానంచేసి. ఒక్కోక్క మెట్టుకు ఒక్క పద్యం చెప్పుకుంటూ పైకి వచ్చి, ఆకొలను ఒడ్డున పాక ను నిర్మించుకొని తపస్సు చేసి,  తరించాడు. తనకు సాక్షాత్కరించిన నారాయణుని మహాలక్ష్మీ సమేతం గా అచ్చటనే ప్రతిష్ఠించి  , ముక్తిని పొందాడట.  కొలను గట్టున పాక వేసుకున్న వీరుని తప: ఫలితం గా ఈ గ్రామం కొలనుపాక అయ్యిందట. ఆ వీరుడు ప్రతిష్ఠించిన నారాయణుడే  ఈ వీరనారయణుడై, మహాలక్ష్మీ సమేతం గా పూజలందుకుంటున్నాడు.
                           
       

                               వీరనారాయణ స్వామి ఆలయ శిఖరం
                   చాళుక్య సంప్రదాయశైలిలో నిర్మితమైన ప్రాచీన దేవాలయం ఇది. శ్రీ వీరనారాయణ స్వామి, ప్రక్కనే   స్వామికి ఎడమవైపులక్ష్మీ దేవి ఒకే పీఠం పై నిలుచుని కన్పిస్తారు.  చాలా అందమైన విగ్రహాలు. అయితే పైన కథలో చెప్పినట్లు ఇక్కడ వందమెట్ల కోనేరు మాత్రం లేదు. ఆలయానికి ప్రాకారం  కూడలేని స్థితిలో వీరనారాయణుడున్నాడు. దీని వెనుకనే  నూతనంగా రేణుకామాత ఆలయం, ఆ ప్రక్కనే షిర్డీ సాయి ఆలయం నిర్మించబడ్డాయి.
   

                         
                                                              రేణుకా మాత దివ్యవిగ్రహం
     
              జైన మందిరం. :---                      కొలనుపాక అనగానే  వినిపించే  మరొక ఆలయం జైన దేవాలయం.  రాజస్థాన్, మహారాష్ట్ర భక్తుల ప్రభావంతోనే కొలనుపాక గూగుల్ మ్యాప్ లో కుల్ పాక్ గా మారిపోయిందేమో. 2000 సం.రాల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న జైనభక్తులు వందసంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం  ప్రారంభించారు. గత ఇరవై ఏళ్ల లో చాలా అందమైన ఆలయాన్ని నిర్మించారు. యాత్రిక వసతి ఏర్పాటు ఉంది. వర్థమాన మహావీరుని విగ్రహాలు  సోమేశ్వర ఆలయ మ్యూజియం లో  కూడ మనకు కన్పిస్తాయి.
             

             
           కొలనుపాక  హైదరాబాద్ వరంగల్లు మార్గంలో ఆలేరు నుండి బచ్చన్నపేటకు వెళ్లే దారిలో 8 కి.మీ దూరం లో ఉంది. హైదరాబాదు నుండి సుమారు 80 కి.మీ  దూరం లో ఉంది.


**************************************************** *****************************