Sunday 23 December 2012

నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం


               
                Nemali Sri VenugopalaSwamy Aalayam.


                     నెమలి   శ్రీ     వేణుగోపాల స్వామి ఆలయం.
                  नेमलि श्री वेणुगोपालस्वामि आलयम्.
                 నెమలి క్షేత్రం వేణుగోపాలుని నిలయం.ఇచ్చటి వేణుగోపాలుడు ముగ్ధమోహన సౌందర్యమూర్తి. వేణుగానలోలునిఁ గన రెండుకనులు చాలవులే "అన్నపలుకు అక్షర సత్యమనిపిస్తుంది.
                            
                          స్వామి వారి దివ్యరూపం
               త్రిభంగి ఆకృతి లో  వ్యత్యస్త పాదారవిందుడై (అనగా ఎడమ పాదము పై నిలబడి ,కుడిపాదమును ఎడమపాదము పైనుండి మునివేళ్ల పై నిలిపి) సన్నని నడుము,శిరస్సు ను చక్కని వంపులతో  విశాలమైన నేత్రాలతో, తిరు నామం  తో ,  మౌళి పై పింఛం తో, చల్లని చూపు తో ,చిరునవ్వు లు చిందిస్తూ,వయ్యారం గా నిలిచి, మురళి వాయించుచున్నభంగిమ లో నున్న ఆ నల్లనయ్య భువన మోహనరూపం  గర్భాలయం లో  కనులముందు కన్పించ గానే నల్లని వాడు పద్మనయనంబుల వాడు , కృపారసంబు పై జల్లెడి వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు ,నవ్వు రాజిల్లెడి మోమువాడు   అన్న పోతన గారి పద్యం  రూపుకట్టి  కనుల ముందు  సాక్షాత్కరిస్తుంది. నిజం గా ఆ  భువన మోహన రూపుని కనులముందు కాంచి ఘంటం కదిలించిన ఆ భక్త కవి ఎంత అదృష్ట వంతు డో కదా అని పిస్తోంది
      
                              ఆలయ  ముఖద్వారం
                మూడడుగుల ఎత్తుకలిగి, ముద్దులోలికే రూపం తో, పాదాలచెంత  వింజామరలు  వీచు గోపికలు, గోవులతో ఉన్న  ఏకశిలా విగ్రహమైన ఈ మూర్తి స్వయంభువు గా వెలిసి నట్లు స్దలపురాణం చెపుతోంది.  విగ్రహ మంతా సాలగ్రామ శిల అవ్వడం వలన నీలము,నలుపు కలసిన  విచిత్ర కాంతి  తో ప్రకాశిస్తూ ఉంటుంది.
          
                                                             ఆలయ గాలిగోపురం

        స్థల పురాణం   . :----       ద్వాపరం లో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ , తన అవతారాన్ని చాలిస్తూ, తన నెమలి పింఛాన్ని  ఇచ్చట వదిలి వెళ్లాడని , ఆ ప్రదేశం లోనే  స్వామి భూగర్భం లో  ఉండేవాడని, ఎందరో మహర్షులు ఈయనను సేవించి ,తరించారని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని నెమలి గ్రామం గా పిలుస్తున్నారు.
                  మరొక కధనాన్ని------ అనుసరించి,    
                         అదృశ్యో వ్యక్త రూపశ్చ అని కదా విష్ణుసహస్రనామము. ఈ స్వామి వ్యక్త రూపుడైన విధము ఈ విషయాన్నే నిరూపిస్తోంది.
                     ఇంతకు పూర్వము ఈ ప్రాంతం లో తపస్సు చేసుకున్న మహర్షులు , మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలి వెడుతూ,  ఈ సుందర సుకుమారమూర్తి ని  భూగృహం లో భద్రపరచి వెళ్లి వుంటారని, స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తున్నారు.
                      
                 
                               శ్రీ వేణుగోపాలుని దివ్య మంగళ విగ్రహం

            
               ఆ రోజు 23.3.1953 వ తేది శ్రీ రామనవమి .  ఊరంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో  మునిగి వుంది. అదే సమయం లో ఒకరైతు  పొలం లోకి మేరువు తోలించు కుంటున్నాడు. పలుగు వేసిన మొదటి దెబ్బ కే ఖంగుమన్న శబ్దం వచ్చింది.  చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు. మళ్లీ అదే ధ్వని. ఈ సారి రెండు ఘాతాల మధ్య పలుగు వేయబోవు నంతలో  మిఱుమిట్లు గొలిపే ఒక మెరుపు వెలువడింది. దానితో  ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపర్యలు చేయగా, కోలుకున్నాడు కాని అతని చూపు పోయింది. మిగిలిన వారందరు అక్కడ త్రవ్వి చూడగా స్వామి   వారి విగ్రహము,  ప్రక్కనే హోమగుండము,ప్రమిదలు.ఒక శంఖము,మొదలైనవి లభించినవి. అదృశ్య రూపం లో ఉన్నస్వామి ఈ విధం గా వ్యక్త రూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న  యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శన మిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశం లోనే ఆలయ నిర్మాణం గావించారు.
                    
                                   గో శాల ప్రవేశ ద్వారం
                   
              చుట్టుప్రక్కల అరవై గ్రామాల ప్రజల్లో ఎంతోమంది స్వామి తమకు కలలో కన్పించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయాన్ని నిర్మించి, ఉత్తరాభిముఖం గా వెలసిన స్వామిని తూర్పు ముఖంగా ప్రతిష్టించ ప్రయత్నించారు. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి, వేసిన పందిళ్లు,  చేసిన ఏర్పాట్లు ఛిన్నాభిన్నమైనాయి. చేసిన తప్పును తెలిసి కొని, స్వామిని ఉత్తరాభిముఖుని చేయడం తో సామాన్య పరిస్ధితి ఏర్పడిందిట. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికీ  ఉత్తర ముఖం గానే ఉంటుంది. 6.2.1957 లో స్వామి ని ఇప్పుడున్న ఆలయం లో ప్రతిష్టించారు.
      
         
        

                  శ్రీ  స్వామి వారి కుడివైపు ఉపాలయం లో శ్రీ రాజ్యలక్ష్మీ దేవి, ఎడమవైపున్న ఉపాలయం లో శ్రీ గోదాదేవి (ఆండాళ్) కొలువు తీరి ఉన్నారు.
            ఆలయ ప్రత్యేకత.: -----                    శ్రీ వేణుగోపాల స్వామి మహిమలు కొల్లలుగా చెప్పుకుంటున్నారు. స్వామి వారి పై గునపము వేయబోయి కళ్లు పోగొట్టుకున్న కఠారు వెంకటేశ్వర్లు  తల్లి దండ్రులు స్వామి వారి ని పరి పరి విధాల వేడుకొని, తమ శక్తి కొలది  వెండి కడియాలు చేయించగలమని మొక్కుకున్న వెంటనే అతనికి కళ్లు కన్పించసాగాయి. ఆ కుటుంబము  జీవితాంతము స్వామి సేవ లోనే తరించారు. ఆ కడియాలు ఇప్పటికీ స్వామి వారి  కాళ్లకు అలంకరిస్తూనే ఉన్నారు.
                 
                    ఆలయవిమానం పై కొలువు తీరిన రాజ్యలక్ష్మీ దేవి              
             
                స్వామి వారి అనుగ్రహం తో ఎందరో కుంటివారు నడవ గలిగినట్లు,మూగవారు మాట్లాడ గలిగినట్లు,సంతానం లేని వారు  పు త్రవతులైనట్టు, కుష్టుమొదలైన వ్యాధులు   బాగైనట్లు ఊరిపేర్లు, చిరునామా లతో సహా స్ధలపురాణం  లో వ్రాయబడి ఉంది.
         
               ఆలయ విమాన,ధ్వజస్ధంభ, గోపుర దృశ్యం


  ప్రత్యేక ఉత్సవాలు. :------  శ్రీ స్వామి వారికి   ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి రోజున స్వామి  అవతరించిన రోజు కావున అభిషేకము మొదలైన ప్రత్యేక పూజలు, తొలి ఏకాదశి రోజున ఏకాహము, శ్రీ కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టుట, గ్రామోత్సవము,విజయ దశమి  శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, దసరా రోజున శమీపూజ జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున శేషవాహనముపై ఉత్తర ద్వార దర్శనము, అనంరము తిరువీథుల గ్రామోత్సవము, నిర్వహిస్తారు.
          
                            పూలవనం లో గోపికలు, శ్రీకృష్ణుడు

               ధనుర్మాసం  నెలరోజులు శ్రీ ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు,  సంక్రాంతి రోజున గ్రామోత్సవము, అనంతరము గోదాకల్యాణము నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి రోజున  సహస్ర కలశ స్నపన, లక్షతులసి పూజామఙోత్సవము మూడు రోజులు జరుగుతాయి. అఖండ దీపారాధన, ఏకనామము ఉంటాయి.
                 ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియ వరకు శ్రీ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రాత్రి 10 గంటలకు స్వామి వారి తిరుక్కళ్యాణమహోత్సవము జరుగుతుంది. ఫై అన్ని  కార్యక్రమాల్లోను చుట్టు ప్రక్కల  గ్రామాల ప్రజలే కాక దూర ప్రాంతాల నుండి కూడ వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
             
                                     కళ్యాణమండపం

               ఆలయ పర్యవేక్షణ లో  గోశాల,  నిత్యాన్నదాన పథకం నడప బడుతోంది.ప్రతి సోమ  శుక్ర వారాలు,పునర్వసు నక్షత్రం రోజున,  శుద్ధఏకాదశి, మరియు పర్వదినాలలో స్వామివారికి   ఉ .6.00 గం.లకు విశేష అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమి కి  స్వామి వారికి కళ్యాణోత్సవము నిర్వహిస్తారు.
 రవాణా సౌకర్యాలు.:------  మధిర నుండి 15కి.మీ  దూరం లో  ఈ క్షేత్రం ఉంది. తిరువూరు, మథిర నుండి ఆర్టీసీ బస్సులున్నాయి.కాని స్వంతవాహనం మీద ప్రయాణం సులభం. గ్రామీణ  కాఫీ హోటల్స్  ఉంటాయి. ఆలయం లోపల  విశాల మండపం విశ్రాంతి తీసుకోవడానికి వీలుగానే ఉంటుంది.

*****************ఓం నమో భగవతే వాసుదేవాయ ****************************************

Friday 21 December 2012

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం


                    Mopidevi Sri Subramanyeswara Swamy Aalayam.


                                    మోపిదేవి    శ్రీ   సుబ్రహ్మణ్యేశ్వర  ఆలయం
                    मोपिदेवि श्री सुब्रमम्येश्वर स्वामि आलयम्.
                
                                      కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి  దేవస్థానం  దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది.


                           ఆలయ ముఖద్వారం

        స్థల పురాణం:------                   స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం  లో మోపిదేవి  క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.
                అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారం తో  విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి  మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు.

                           శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు
            
             యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం  మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది.  తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
                   పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని  పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని  వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
                     వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్  సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్  అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు.  ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే సుబ్రమణ్య క్షేత్రమని  ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు.   కుమారమూర్తి కే సుబ్రమణ్య మనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
   కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని  ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.



                                   స్వామివారి కళ్యాణ మూర్తులు
                
             “ సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.వారు ఒక పర్యాయం  పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల  తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.
                  కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది.  ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా   పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా  ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
                   ఈ విషయాన్నంతటిని  దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ  నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని  దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా   శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
                   
                              ఆలయ ముఖమండపం
       
              కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే  కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి,  లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని  తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో  శిథిలమై పోగా  మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా  ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
              ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.


                      కళ్యాణ మండపం లోని నంది,గుఱ్ఱము          

      ఆలయప్రత్యేకత.:-----               స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో  పాము చుట్టల మీద లింగం ఉంటుంది.  ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.
               ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి  సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
                          స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.
         

                         స్వామి వారి ఊరేగింపు దృశ్యం
    
      విశేష పూజలు :------.  నాగులచవితి,  సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని  భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.
                       స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు ,సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ఉగాది ప్రవదినం,దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రో త్సవము  విశేషంగా జరుగుతాయి.
                     మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం,వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
       భక్తుల సౌకర్యార్ధం  నిత్యాన్నదాన  పథకం ఇటీవలె ప్రారంభించబడింది


                  
                 ఆలయం లోని నాగ దేవతా ప్రతిమలు

రవాణా సౌకర్యాలు . :-------        కృష్ణాజిల్లా లో విజయవాడ కు 70 కి. మీ దూరం లోను,మచిలీపట్టణానికి 35 కి.మీ దూరం లోను, గుంటూరు జిల్లా రేపల్లె కు        8 కి. మీ  దూరం లోను మోపి దేవి క్షేత్రం ఉంది.అతి సమీపం లోని రైల్వేష్టేషన్ రేపల్లె.
             ఇక్కడ ఉండటానికి ఎటువంటి  హోటల్ సౌకర్యాలు ఉండవు. గ్రామీణ స్థాయి కాఫీహోటల్స్ మాత్రం ఉంటాయి. అవనిగడ్డ, రేపల్లె, చల్లపల్లి లో ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి. 214 ఎ జాతీయ రహదారిపై చల్లపల్లి – పులిగడ్డ మధ్య మోపిదేవి క్షేత్రం ఉంది.
         నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు  ,జ్ఞానవృద్ధికి,  కుజదోష నివారణకు  సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా  శాస్త్రాలు చెపుతున్నాయి.


 **************   శ్రీ   వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్ ***********************************