Wednesday 28 November 2012

పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి


               పెదకళ్లేపల్లి       శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి
                     
                      
                         
                                      రాజగోపురం
      
              కృష్ణానదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలలో దక్షిణకాశీ గా పిలువబడుతున్న పుణ్యక్షేత్రం పెదకళ్లేపల్లి. బౌద్ధుల కాలం లో ఈ క్షేత్రాన్ని కడలిపల్లి గా పిలిచేవారు. ఇచ్చట స్వయంభువు గా కొలువుతీరిన మూర్తి శ్రీ  దుర్గా నాగేశ్వర స్వామి.

    స్ధలపురాణం.:::--      యత్ర నాగేశ్వరో దేవ: కృష్ణాచోత్తర వాహినీ,
                                 తత్ర స్నాత్వా చ పీత్వా చ పునర్జన్మ నవిద్యతే.!!”

                
                                నాగేశ్వరస్వామి

                 “ ఎక్కడ నాగేశ్వరుడు దైవంగా నిలిచి, కృష్ణ ఉత్తర వాహిని గా ప్రవహిస్తోందో, అక్కడ స్నానం చేసినా, ఆ నీరు త్రాగినా వారికి పునర్జన్మ  ఉండద ని స్కాంద పురాణోక్తి.  
        
              
                
                                   అంత్రాలయ ప్రవేశద్వారం
    
                 
                 పెదకళ్ళేపల్లి క్షేత్రమహిమ ను గూర్చి స్కాంద పురాణం  లో  వివరంగా ప్రస్తావించ బడింది. ఈ క్షేత్రమహాత్మ్యం గురించి అగస్త్యుడు శ్రీరామునికి చెప్పినట్లు పద్మపురాణం లో కనపడుతోంది. అనేకమైన సమాన ధర్మాలు ఉత్తరాన ఉన్నకాశీ క్షేత్రానికి దక్షిణాన ఉన్న పెదకళ్ళేపల్లి కి  ఉన్నట్లు చెపుతున్నారు.


కాశీలో విశ్వేశ్వరస్వామి ----కళ్ళేపల్లి లో నాగేశ్వరస్వామి
క్షేత్రజ్ఞుడు కాలభైరవుడు   ---- క్షేత్రజ్ఞుడు కాలబైరవుడు
క్షేత్ర పాలకుడు బిందుమాధవస్వామి  ------ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి
 ఆనంద వనం ---- కదళీవనం
 మణికర్ణికా ఘట్టం ------ పరికర్ణికా ఘట్టం.
గంగానదీ తీరం ------కృష్ణానదీ తీరం.
 అందుకే దీన్ని దక్షిణ కాశి గా పిలుస్తున్నారని స్ధలపురాణం.
                         
                  బదరిక,కేదార,నైమిశ,దారుక,ఉత్సల,పుష్కల, ఆనంద, సైంధవ, గుహా, మహాదండక, బృందకామిక, చంప, వింధ్య , వీక్ష మొదలైన అరణ్యాలతో పాటు 18 వ అరణ్యంగా కదళికారణ్యం ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది.ఆ కదళీకారణ్య మే ఈ కదళీపుర క్షేత్రమని అంటారు.
                              జనమేజయుడు సర్పయాగం చేసిన స్ధలం  కూడ ఇదే నని  పురాణాలు పేర్కొన్నాయి. ఈ క్షేత్రానికి కదళీపురమనే పేరు రావడానికి మరో కథ కూడ ఉన్నట్లు పెద్దలు చెపుతారు.
                      

నాగసరస్సు                                                          

                            ఈ క్షేత్రం లో పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులైన కర్కోటక,వాసుకి,తక్షక,శంఖచూడ,ధృతరాష్ట్ర ,శంఖపాల, ధనుంజయ, హింగళు లన పేరు గల అష్టఫణి రాజుల తల్లి కద్రువ. కద్రువ శాపవిముక్తి కై ఒకవేదిక ను నిర్మించి , ఆచ్ఛాదనకై నాలుగువైపులా కదళీతరువుల నెలకొల్పి, ఈశాన్య భాగం లో గోముఖాకారంలో ఒక తటాకాన్ని త్రవ్వి, దానిలో స్నాన మాచరిస్తూ  నియమ నిష్టలతో పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది. ఒకరోజున ఆమె పూజలో ఉండగా ప్రక్క నున్నకదళీ తరువులు ఒక్కసారి గా ఫెళ ఫెళార్భాటాలతో విరిగి పడ్డాయి. అందులో నుండి దుర్గా సమేత నాగేశ్వర స్వామి లింగరూపం లో దర్శనమిచ్చారు. అంతట వారు  కంగారు గా కదళీ,! కదళీ!’ అని  కేకలు వేయడం తో  పరమేశ్వరుడు ప్రత్యక్షమై, వారితో భోగులారా!  నేను ఉద్భవించే సమయాన మీరు వేసిన కేకలు ఆచంద్రతారార్కం  నిలిచి ఉండునట్లు గా,  ఈ ప్రాంతం కదళీపురం గా పిలువ బడుతుందని వరమిచ్చాడు . ఆ కదళీపురమే కాలక్రమేణ పెదకళ్లేపల్లి గా రూపాంతరం చెందింది.

    పరికర్ణికా ఘట్టం.:-----     ఈఆలయానికి ఈశాన్యం లో నాగకుండం అనే సరస్సు ఉంది. దీనినే నాగహ్రద మని, నాగ సరోవరమని  పిలుస్తారు. ఉత్తమ తీర్ధాలన్నీ దీనిలో సంగమించడం వలన దీనిని పరికర్ణికా”” తీర్ధమని పిలుస్తున్నారు. ఇక్కడ నాగ,రుద్ర,బ్రహ్మ, బైరవ ,కుముద్వతి, అంబిక శారద మొదలైన పేర్ల తో కుండాలున్నాయి. ఇక్కడ శకు తీర్ధము, చంద్రకుండము కూడ ప్రసిద్ధి చెందినవే.



                       
                             సత్యస్ధంభం పై నాగరాజు

           ఆలయప్రత్యేకత. :------                 ఈ క్షేత్రం లోని లింగము కర్కోటకము అనే సర్పరూపమున స్పటికలింగముగా దర్శనమిస్తుంది.  ఇక్కడ స్వామి వారు స్వయంభువు.
                    
                                      సత్యస్ధంభం
         
         ఆలయప్రదక్షిణ మార్గం లో  సత్యస్ధంభం ఉంది. ఇది పాలరాతి స్ధంభం. బౌద్ధ చిహ్నాలతో అస్పష్టంగా కన్పించే బ్రాహ్మీలిపి తో ఉన్న ఈ స్ధంభం ధగ్గర ప్రమాణం  సత్యమైందిగా నమ్మకం. ప్రమాణం సమయంలో అబద్ధం చెప్పిన వ్యక్తి పై స్ధంభం విరగిపడటంతో ఆవ్యక్తి మరణించాడు. నేటికీ ఈ స్ధంభం లో సగం మాత్రమే కన్పిస్తూ ఉంటుంది. యాత్రీకులు ముందుగా ఈ సత్యస్ధంభాన్ని దర్శించిన తరువాతే స్వామివారిని సేవిస్తారు.
           
                                  
                      
                                   పంచముఖ గణపతి
       
            ఆలయ  గోడలమీద వివిధ దేవతా కృతులు కొలువు తీరి ఉన్నాయి. వీనిలో పంచముఖ గణపతి  సింహాసనారూఢుడై  దర్శనమిస్తాడు. ది చాలా అరుదైన విగ్రహం.
                     
         ఆలయప్రాంగణం లో వాయవ్య దిశ లో సుబ్రమణ్యేశ్వర ఆలయం,  ఉత్తర దిశ లో ధక్షిణాభిముఖం గా కాలభైరవాలయం ఉన్నాయి. ధక్షిణ భాగ ఉపాలయం లో వీరభద్రుడు,భద్రకాళి, ఉత్తరంగా ఉన్నఉపాలయం లో దుర్గామాత కొలువుతీరియున్నారు. ఈశాన్య దిశ లో 16స్ధంభాల కళ్యాణమండపం  నిర్మించబడింది.
          
          
                           
                          కళ్యాణ మండపం

       ప్రాచీనత   :------             క్రీ.శ 1292 లో కాకతీయ రాజగురువు  సోమశివాచార్యులు ఈ ఆలయాన్ని తొలిసారి ఉద్ధరించినట్లు తెలుస్తోంది. ఆలయ విగ్రహం దక్షిణవైపు గోడ లో ఇప్పటికీ ఉంది. తరువాత దేవరకొండ సంస్ధానాధీశులు 13 వ జమీందారు కోదండరామన్న గారు 1782 లో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేశారు.1795  లో 15 వ జమీందారైన  నాగేశ్వర నాయుడు గారు గాలిగోపుర నిర్మాణం  గావించారు. 


 ఫ్రత్యేక ఉత్సవాలు.:-------                 శ్రీ దుర్గానాగేశ్వరస్వామి వారి ఆలయం లో ఉగాది పర్వదినం, శ్రావణపూర్ణిమ రోజున లక్ష కుంకుమార్చన, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆశ్వీయుజమాసం లో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీకమాసం లో అఖండ దీపారాధన, ఆరుద్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, కన్నులపండువు గా జరుగుతుంది.
     
                              ఆలయదృశ్యం
          క్షేత్రపాలకుడు.:-------              పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాలస్వామి. రుక్మిణీ సత్యభామాసమేతుడైన వేణుగోపాలుడు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నాడు.ఈ వేణుగోపాలస్వామి ని విశ్వామిత్రుడు ప్రతిష్టించి నట్లు పద్మపురాణం చెపుతోంది.




                         రాజగోపురం లోని శాసనం
      
  రవాణా సౌకర్యాలు. :------         ఈ క్షేత్రం  మచిలీపట్టణానికి 35 కి మీ. దూరం లోను, మోపిదేవి, చల్లపల్లి కి 10 కి మీ.దూరం లోను, విజయవాడ కు 75 కి.మీ,రేపల్లె కు 20 కి.మీ .దూరం లోను ఉంది. ఆర్టీసీ మచిలీపట్నం, విజయవాడ,చల్లపల్లి, అవనిగడ్డ ల నుండి పరిమిత సంఖ్య లో సర్వీసులను నడుపుతున్నారు. అందువలన ఇక్కడకు  చేరుకోవాలంటే స్వంతవాహనం ఏర్పాటు మంచిది. శ్రమ, సమయము ,రెండూ కలిసివస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే కాఫీ ఫలహారాలు మాత్రం లభిస్తాయి. నివాసానికి  ఎటువంటి సౌకర్యాలు లేవు. తప్పక చూడవలసిన శైవ క్షేత్రాల్లో పెదకళ్లేపల్లి ఒకటి.


*********************************************************************************

Monday 26 November 2012

ఘంటశాల జలథీశ్వరస్వామి


                        ఘంటశాల     జలథీశ్వరస్వామి
           
               

                కృష్ణాతీరం లో వెలసిన  తీర్దక్షేత్రాల్లో ఘంటశాల ఒకటి.ఆంద్రదేశం లోనే కాకుండా భారతదేశం లోనే ఎక్కడా లేని విధంగా  శివపార్వతులిద్దరూ ఒకే పానమట్టం పై దర్శనమిచ్చే ఏకైక క్షేత్ర మిది. జలథీశ్వరస్వామి గా స్వామి సేవలందుకుంటుంటే, బాలపార్వతి గా అమ్మవారు భక్తులను తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తోంది . ఇది తరతరాలనాటి మాట.


                     
                    బాలపార్వతీ  సమేత  జలథీశ్వర స్వామి వారి దివ్యదర్శనం

                       ఎందుకంటే ఈ ఆలయం రెండవశతాబ్ది కంటే పూర్వపు దని చరిత్రకారులు శాసనాద్యాధారాతో నిర్ధారించారు. ఒకే పీఠం మీద ఆదిదంపతులు కొలువు తీరిన రమణీయ దృశ్యం భక్తులను పరవశులను చేస్తుంది.పెద్దముతైదువ పెనిమిటి తో కలసి ఏకపీఠం మీద దర్సనమివ్వడం  అపురూప దృశ్యం కదా. ఇటువంటి మూలవిరాట్ సందర్శనం సకలశుభాలను, సుఖాలను,సంపదలను , కీర్తిప్రతిష్టలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

                       ఆలయముఖమండపం
        స్థలపురాణం:------.           హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి   వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి  ఉత్తరాపథానికి బయలుదేరింది.  జీవకోటి భారంతో  ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.

           
                          అగస్త్యుడు ప్రతిష్ట చేస్తున్న  ఊహా చిత్రం

                 ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే  తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి  సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా  ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.

            
                                కళామండపం            

        అప్పటికి ఈ గ్రామం  సముద్రం,  కృష్ణానది కలిసే నదీ ముఖ ద్వార ప్రదేశంగా ఉండేది.  జలథి అంటే సముద్రం. సముద్రం లో నౌకాయానానికి బయలుదేరేముందు నావికులు   గంగానాథుడైన ఈ స్వామిని పూజించి , బయలుదేరేవారని,  తిరిగి వచ్చిన తరువాత మళ్లీ స్వామిని దర్శించుకొనే ఇళ్లకు వెళ్లేవారు. దుకే ఈ స్వామి జలథీశ్వరుడయ్యాడు. 1,2 శతాబ్ధాలలోకంటకశ్శిల అనేపేరు గల ఘంటశాల ప్రముఖ నౌకా కేంద్రంగా  విలసిల్లినట్లు  చారిత్రక ఆధారాలున్నాయి.



                           సుబ్రమణ్యేశ్వరుని  ధ్వజస్థంభం

 ఆలయప్రత్యేకత. :------                శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత.ఈ పానమట్టం ఏకఱాతిశిల.  దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి  దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం  ఒక ప్రత్యేకత.
                  ఈ ఆలయ గోపురం గజపృష్టాకార గోపురం గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్  చేయబడింది.
                   మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో  కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది.
             కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర  పీఠంగా నిర్థారించారు.

   నవగ్రహమండపం.:------            ఏకపీఠంపై వెలసిన సివపార్వతుల వలెనే  నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి  నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.

 శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం.:-----       ఈ ఆలయ  ఆవరణ లోనే 200 సంవత్సరాల నాటి వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం ఉంది. మార్గశిర మాసంలో షష్టి ఉత్సవాలు  తిరునాళ్లను తలపిస్తూ అత్యంతవైభవంగా జరుగుతాయి. సంతానాకాంక్షులయిన దంపతులు స్వామివారికి పూజలు చేయించి  మందిరానికి వెనుకనున్న నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోయడం, అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం.

                                   నాగేంద్రస్వామి


          దేవాలయఆవరణ లో నైఋతిభాగంలో  శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది.పూర్ణిమ తరువాత వచ్చే చవితికి ఈ ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. జలథీశ్వరుని అభిషేకజలం  ఆరోగ్యప్రదాయిని .  ఈ అర్దనారీశ్వరుని అభిషేకజలం సర్వరోగనివారిణి యని   జనశ్రుతి.
                    అంత్రాలయ ద్వారానికి పైన ఆది శంకరుల విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు కాలభైరవుడు, కుడివైపు నరసింహస్వామి ద్వారపాలకులు గా దర్శనమిస్తారు. దీనిని శివ కేశవాభేదానికి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటారు.ఈ రెండు పాలరాతి విగ్రహాలు  క్రీ,శ, 2 వ శతాబ్దానికి చెందినవి గా పురావస్తు శాఖ వారు నిర్దారించారు. 

                      రెండవ శతాబ్దం నాటి నరసింహ విగ్రహం 

    చారిత్రకత. :-----                       ఇది అత్యంత ప్రాచినమైన శైవక్షేత్రం. ఇక్కడ  లభించిన సరస్వతీ దేవి, రతీదేవి విగ్రహాలు క్రీ.పూ. 6000  సంవత్సరాలనాటి హరప్పా ,మొహంజొదారో శిల్పకళ కు చెందినవి గా చరిత్ర పరిశోధకులు గుర్తించారు.
              క్రీ.శ.1 వ శతాబ్దం లో ఘంటశాల ను కంటకశైల గా ఫ్రెంచి చరిత్రకారుడు డూబ్రెయిల్ తన డక్కను పూర్వచరిత్ర లో పేర్కొన్నాడు.టోలమీ మొదలగు చరిత్రకారులు  ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు. చోళుల కాలం లో చోళపట్టణం గా, పాండ్యులకాలం లో పాండ్యపురంగా తరువాత ఘంటశాల గా పిలువబడుతోంది. రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ద ఓడరేవు  గా ఉన్నట్లు  చారిత్రకాధారాలున్నాయి.
                   సుమారు ఏడు శాసనాలు ధేవాలయ ఉత్తర గోడమిద,   బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి.ఇవన్నీ దాన   శాసనాలే
.
రవాణాసౌకర్యాలు.:-----    విజయవాడ,గుడివాడ,మచిలీపట్నం, రేపల్లె ల నుండి  ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. బారసాల,అక్షరాభ్యాసం,గ్రహశాంతులు, జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కలదు.స్వంతవాహనం ఉన్నట్లయితే విజయవాడ నుండి కఱకట్ట మీదుగా       52 కి.మీ లో  శ్రీకాకుళం,కొడాలి మీదుగా ఘంటశాల కు చేరుకోవచ్చు.



 ***********ఓం నమశ్శివాయ ********************************************************